కాశీ ప్రయాణం
కాశీ ప్రయాణం
"అక్కయ్యగారూ, నేను మూర్తిగారి తల్లిని తీసుకొని కాశీవెళ్తున్నాను. ఆవిడకెప్పట్నించో కోరికట. ఏ కొడుకును అడిగినా కుదరదంటున్నారట. మూర్తిగారికి సెలవులేదని నన్నడిగారు. నేను తీసుకెళ్తున్నాను. బావగారిని కాస్త మీ మరదల్ని, పిల్లల్ని ఓ రెండురోజులు చూస్తూండమనండి." అన్నారు నారాయణగారు, రావుగారిభార్య, సీతమ్మగారితో.
"అలాగే. మంచిది, వెళ్ళిరండి. పుణ్యం-పురుషార్థం."
అన్నారావిడ నవ్వుతూ.
నారాయణగారు ప్రసాదం తీసుకొని మూడోరోజు సాయంత్రంవచ్చారు.
"రావయ్యా నారాయణా, కాశీదర్శనం బాగాజరిగిందా." పలకరించారు రావుగారు.
"ఏందర్శనమో బావగారూ. ముసలామె 108 సార్లు స్నానాలంటూ చంపేసారండీ. అందుకే కాబోలు, ఆవిడ చాదస్తానికి జడిసి ఎవరూ తీస్కెళ్ళేవారు కాదామో ఆమెను." అన్నారు నారాయణగారు కుర్చీలో కూలబడుతూ.
"అందుకే, అత్తయ్యగారంటారు, అన్నింట్లో మీకు అత్యుత్సాహమెక్కువని." నవ్వుతూ మంచినీళ్ళిచ్చింది రావుగారమ్మాయి శారద.
"అరే కన్నేమైంది? అలావాచిందేమిటి?" మళ్ళీతనే అడిగింది ఆదుర్దాగా.
"ఏముందమ్మా , పుణ్యానికిపోతే పాపమెదురైందని, ట్రైన్లో వచ్చేటప్పుడు ఇనుప రజను కళ్ళల్లోపడింది. హాస్పిటల్లో చూపిస్తే క్లీన్ చేసి మందులిచ్చారు." అన్నారాయన.
"ఏంటయ్యా, ఎప్పుడేదోకటి. మాచెల్లెమ్మ బాధపడదూ." అన్నారు రావుగారు.
"అదేంటండీ, తమ్ముడుగారికి కన్ను బాగులేక పోయినా ఆయన్నే అంటారు. ఇప్పుడెలా ఉందండీ " అడిగారు సీతమ్మగారు.
"ఫర్లేదండీ. మీ ఏచెల్లెలా! అయ్యోరామ! కొట్టినంత పనిచేసింది. ఇంకా బాధపడడమొకటా!" అన్నారు నారాయణగారు.
"మామయ్యగారికి ఏదోకటి చేయకపోతే తోచదు." అంది శారద ఆటపట్టిస్తూ.
"అనండమ్మా , మీరనేవాళ్ళు, మేంపడేవాళ్ళం, అంతేనా అక్కయ్యగారూ." అన్నరాయన నవ్వుతూ.
"అంతేకదా మరి." అంటూనవ్వేశారావిడ.
శారద, రావుగారు కూడా వారి నవ్వులతో శృతికలిపారు.