అడుక్కో బుడుక్కో సాంబారు బుడ్డీ
అడుక్కో బుడుక్కో సాంబారు బుడ్డీ


అడుక్కో బుడుక్కో సాంబారు బుడ్డి
**********************************
గోస్తనీ నదీ ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య చిన్న పల్లెటూరు చామలాపల్లి అగ్రహారం. ఆ గ్రామంలో సీతాపతి లక్ష్మి దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి కొడుకులు కోడళ్ళు మనవలు మునిమనవల తో కలిసి పుట్టెడు సంతానం. ఉమ్మడి కుటుంబం కావడం తో ఇల్లంతా పిల్లాపాపలతో కిలకిల లాడేది. ఒక ఆదివారం నాడు పిల్లలంతా కలిసి ఏటి ఒడ్డున ఉన్న ఊడల మర్రి దగ్గరకి ఆడుకోవడానికి వెళ్ళారు. పిల్లలందరినీ చూసి చెట్టుమీద ఉన్న చిట్టిభూతం డింగ్ మని కిందకి దిగింది. సిరి భయపడింది. "చిట్టి చాలా మంచిది. నా స్నేహితురాలు భయపడకు." అన్నాడు చింటూ సిరితో.
“ఈరోజు ఒక కొత్త ఆట పరిచయం చేస్తాను ఆడటానికి మీరు సిద్ధమేనా? అని అడిగింది చిట్టి.
"మేము సిద్ధం." అన్నారు పిల్లలు ముక్త కంఠంతో.
“మీరు పది మంది ఉన్నారు. మీలో ఇద్దరిని నాయకులుగా ఎన్నుకోండి. ఆ ఇద్దరు నాయకులు వారికి నచ్చిన నలుగురు పిల్లల్ని కోరుకుంటారు.” అని చెప్పింది చిట్టి. చిట్టి చెప్పినట్లు చేశారు. ఒక సమూహానికి చింటూ నాయ
కుడు. రెండో సమూహానికి సిరి నాయకురాలు.
“ఇప్పుడు రెండు జట్లు తయారయ్యాయి. నాయకులిద్దరు అరగదీసిన చింతపిక్కని నేలపై వేస్తారు. తెలుపు వైపు పడినవారు ముందుగా ఆట మొడలెడతారు. జట్టు నాయకుడు తన జట్టు లోని పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టి చేతులు వెనక్కి పెట్టి ఉంచమంటాడు. అందరి చుట్టూ తిరుగుతూ రెండో జట్టు నాయకునికి కనపడకుండా ఒకరి చేతిలో పిన్నీసు పెడతాడు. అందరూ గట్టిగా చేతులు బిగించి ఉంచుతారు. తర్వాత ‘అడుక్కొ బుడుక్కొ సాంబారు బుడ్డి’ అని అరుస్తూ చుట్టూరా తిరుగుతాడు. అప్పుడు రెండో జట్టు నాయకుడు ఎవరి దగ్గర పిన్నిసు ఉందో ఊహించి చెప్పాలి. వాడి దగ్గర పిన్నీసు ఉంటే రెండో నాయకుడు గెలిచినట్లు లేకుంటే ఓడినట్లు. గెలిచినట్లయితే ఆ పిల్లాడు బయటకి వస్తాడు, రెండో జట్టులో కలుస్తాడు. ఓడిపోతే తన జట్టులోని ఒక పిల్లాడిని గెలిచిన జట్టు లోకి పంపించాలి. ఇదీ ఆట. మరెందుకు ఆలస్యం! ఆట మొదలెట్టండి.” అంది చిట్టి భూతం. “భలే! భలే! అడుక్కో బుడుక్కో సాంబారు బుడ్డి.” అని పాడుకుంటూ ఆట మొదలెట్టారు పిల్లలు.
కాశీ విశ్వనాథం పట్రాయుడు
- 9494524445