సమాధి దొంగలు
సమాధి దొంగలు
అర్థరాత్రి…వర్షం కుండపోతగా కురుస్తోంది…
నగరంలోని ఓ సిమెట్రీ అది…రెయిన్ కోట్స్, గమ్ బూట్సూ ధరించిన దృఢకాయులయిన నలుగురు వ్యక్తులు అందులో ప్రవేశించారు. ఒకడి చేతిలో ఓ పొడవాటి పెట్టె ఉంది. ఇంకొకడి దగ్గర బరువైన గోనెసంచి ఉంది. టార్చ్ లైట్ వెలుతురులో ఒక్కొక్క సమాధినే చూసుకుంటూ ముందుకు నడచారు వాళ్ళు.
చివరికి ఓ సమాధి వద్ద ఆగి, గోనెసంచి లోంచి పార, పలుగు, గునపం, వగైరా పనిముట్లను బైటకు తీసారు. ఒకడు టార్చ్ లైట్ వెలుతురును ఫోకస్ చేస్తూంటే, మిగతా ముగ్గురూ ఆ సమాధిని త్రవ్వడానికి ఉపక్రమించారు… శవపేటిక కనిపించగానే, ఇద్దరు వ్యక్తులు త్రాళ్ళ సాయంతో గోతిలోకి దిగి త్రాళ్ళను దానికి కట్టారు. నలుగురూ కలసి పేటికను పైకి తీసారు.
సుత్తితో కొట్టి కఫిన్ ని తెరచారు. లోపల ఫ్రెష్ గా ఉన్న మృతదేహం కనిపించింది. వర్షానికి తడిచిపోకుండా శవాన్ని వాటర్ ప్రూఫ్ క్లాత్ తో కప్పి, తమతో తీసుకువచ్చిన పెట్టెలో ఉంచి క్లోజ్ చేసేసారు.
సమాధిని పూర్తిగా పూడ్చకుండానే వదిలేసి, పనిముట్లను గోనెసంచిలో సర్దేసుకుని, డెడ్ బాడీ ఉన్న పెట్టెను మోసుకుంటూ సిమెట్రీ బయటకు నడచారు.
వీధిలో కొద్ది దూరంలో చిన్నసైజు ఆంబులెన్స్ ఒకటి ఆగి ఉంది. ఆ శవపేటికను అందులోకి ఎక్కించారు. దానితోపాటు ముగ్గురు వ్యక్తులు ఎక్కితే, టార్చ్ లైట్ చూపిస్తూన్న నాలుగవ వ్యక్తి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ఎడతెరిపిలేకుండా కురుస్తూన్న ఆ వర్షాన్ని చీల్చుకుంటూ ముందుకు పరుగెత్తింది ఆంబులెన్స్.
#
గత కొన్ని నెలలుగా నగరంలోని సమాధుల నుండి శవాలు అదృశ్యమవుతున్నాయి. ప్రజలలో అలజడి రేపింది అది.
బతికున్నవారిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజడం కద్దు. కానీ, శవాలను ఏం చేసుకుంటారో!...అంతుపట్టలేదు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరామ్ కి.
జాతి, మత విచక్షణ లేకుండా దొంగలు అందరి సమాధులనూ టార్గెట్ చేయడం విశేషం!
#
రాత్రి పదకొండు గంటలు అవుతుంది…సెల్ ఫోన్ మ్రోగడంతో పక్కమీద తలగడ పక్కనున్న ఫోన్ ని అందుకుని స్క్రీన్ వంక చూసాడు బాలరాజు. అది ‘అన్న’ కాల్!
“ఏరా, రాజూ! పనిని గాలికి వదిలేసి పెళ్ళాం పక్కలో వెచ్చగా తొంగున్నావట్రా?” అవతలి గొంతుక కర్కశంగా వినిపించడంతో, గతుక్కుమన్నాడు బాలరాజు.
“ఆఖరు బాడీని తెచ్చి అప్పుడే రెండు వారాలు దాటింది. ఏం చేస్తున్నావ్?” మళ్ళీ కోపంగా అడిగాడు ‘అన్న’.
“లేదన్నా. ఆపని మీదే ఉన్నాను. ఈ మధ్య సిమెట్రీల దగ్గర, స్మశానాల దగ్గరా పోలీసుల నిఘా అధికంగా ఉంది. అందుకే…కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామని…” నసిగాడు బాలరాజు.
“నెలకు కనీసం మూడు శవాలనయినా సప్లయ్ చేయాలన్నది మన కాంట్రాక్ట్. ఆర్నెల్లలో డజనుకు మించి సరఫరా చేయలేకపోయాం. మన మీద నమ్మకం సన్నగిల్లితే మరో సోర్స్ ని వెదుక్కునే ప్రమాదం ఉంది వాళ్ళు”.
“లేదన్నా. అలా జరగనివ్వను” హామీ ఇచ్చాడు బాలరాజు.
ఓ క్షణం ఆగి, అన్నాడు ‘అన్న’ – “రెండు రోజుల్లో బాడీ ఏదీ దొరక్కపోతే…నీ మనుషుల్లో ఒకణ్ణి చంపి అయినా, వాడి బాడీని తీసుకురా”.
బాలరాజు చిన్నగా ఉలికిపడ్డాడు. “అదేంటన్నా, అంత మాట అనేసావ్?”
అవతల చిన్నగా నవ్వు వినిపించింది. “శవానికి లక్ష ఇస్తున్నాను. ఆమాత్రం అథారిటీ ఉంటుందిలే నాకు!” ఫోన్ కట్ అయింది.
బాలరాజుకు ముప్పయ్ అయిదేళ్ళు ఉంటాయి. మనిషి ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవరుగా పనిచేసేవాడు. వచ్చే జీతం కుటుంబపోషణకు సరిపోక ప్రతి నెలా అప్పులు చేయవలసి వచ్చేది…అయితే, కొన్ని నెలల క్రితం అనుకోకుండా ‘అన్న’ తో పరిచయమయింది అతనికి. అది అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది.
కొందరు ‘పార్టీలకు’ శవాలను సప్లయ్ చేసే సీక్రెట్ కాంట్రాక్ట్ ని కుదుర్చుకున్నాడు ‘అన్న’. ఆ ‘దందా’ లోకి బాలరాజును కూడా లాగి, ఆ వ్యవహారానికి ఇన్-చార్జ్ ని చేసాడు. ‘అన్న’ ది క్రిమినల్ మైండ్. పథకం అతనిదీ, ఆచరణ బాలరాజుదీను.
‘అన్న’ సలహా మేరకు ఓ మినీ వ్యాన్ ని వాయిదాల పద్ధతిలో తీసుకుని, దాన్ని ఆంబులెన్స్ గా మార్చుకున్నాడు బాలరాజు. పైకి అది ప్రైవేట్ ఆంబులెన్స్. లోపాయకారిగా మాత్రం దొంగిలింపడ్డ శవాలకు రవాణా వాహనం!
ఆ ‘ఆపరేషన్’ లో పాలుపంచుకునే వ్యక్తులకు బాలరాజు తప్ప, ‘అన్న’ ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు.
#
సమాధి దొంగలను ఎలాగైనా పట్టుకుని తీరాలని కంకణం కట్టుకున్నాడు ఇన్స్ పెక్టర్ శివరామ్ …ఆ కేసు యొక్క పూర్వాపరాలను నిశితంగా సమీక్షించాడు.
శవాలు ఏయే ప్రాంతాల నుండి అదృశ్యమయ్యాయో, ఆ ప్రాంతాలకు మరోసారి వెళ్ళి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాడు – తాము మిస్ చేసిన ‘క్లూస్’ ఏవైనా లభిస్తాయేమోనని. దొంగల ‘మోడస్ ఆపరేండీ’ ని అధ్యయనం చేసి, అది ఒకే ముఠా పనేనని నిర్ధారించుకున్నాడు. ఆ ముఠా రాష్ట్రానికి చెందినదా, లేక ఇతర రాష్ట్రాలకు చెందినదా అన్నది మాత్రం తెలియలేదు.
నగరంలో పలు ప్రాంతాలలో అతను చేసిన దర్యాప్తులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఒకవేళ ఏ శవపేటికలోనయినా విలువైన వస్తువులో, బంగారమో దొరికితే దొంగలు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తారు. అందుకే మార్వాడీ షాపులను, పాన్ షాపులను, ఇతర సోర్సెస్ నీ అలర్ట్ చేసాడు.
క్రిస్టియన్ సిమెట్రీస్, ముస్లిమ్ ఖబరస్తాన్ లు, హిందూ స్మశానవాటికల వద్ద రాత్రులు ప్రత్యేకంగా పోలీసులను మఫ్టీలో ఏర్పాటుచేసాడు శివరామ్… అయితే, స్మశాన వాతావరణానికి జడుసుకున్న ఓ కాన్ స్టబుల్ జ్వరం తెచ్చుకున్నాడు…మరోచోట, కాన్ స్టబుల్ కి ‘దయ్యాలు’ కనిపించాయి! భయంతో మంచం పట్టేసాడు. దాంతో స్మశాన డ్యూటీకి ముందుకు రావడంలేదు ఎవరూను! జెనరల్ నైట్ పెట్రోలింగును ఉధృతం చేయడంతోనే సంతృప్తి చెందవలసివచ్చింది శివరామ్.
#
ఆ నెల రోజుల్లో మరో మూడు సమాధులనుండి శవాలు మాయమయ్యాయి. దాంతో నగరప్రజలలో అసహనం, ఆగ్రహం పెరిగిపోయాయి. పోలీసుల అసమర్థతను తిట్టిపోసారు. ఇన్స్ పెక్టర్ శివరామ్ కి పైఅధికారుల ఒత్తిడి అధికమయింది.
అదే సమయంలో సిల్వర్ లైనింగులా అనిపించింది - ఓ రోజున ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికిల్ ఒకటి. అది మెడికల్ కాలేజెస్ లోని ఎనాటమీ క్లాసుల గురించినది. దాన్ని కుతూహలంతో చదివాడు శివరామ్.
దాని సారాంశం ఇది – ‘మెడికల్ కాలేజెస్ లో ఎనాటమీ క్లాసులలో విద్యార్థులచేత డిసెక్షన్ చేయించడానికి సరిపడినన్ని మృతదేహాలు సరఫరా కావడంలేదు. ప్రభుత్వాసుపత్రుల మార్చురీలలోని అన్-క్లెయిమ్డ్ బాడీస్ ని సాధారణంగా మెడికల్ కాలేజెస్ కి తరలించడం జరుగుతుంది. కాగా, వాటిని అనాథ శవాలుగా నిర్ణయించేందుకు న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి డిక్లేర్ చేసేసరికి జాప్యం జరగడమేకాక, శవాలు చెడిపోవడం కూడా కద్దు. పైగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూండడంతో అందుబాటులో ఉన్న మృతదేహాలు సరిపోవడంలేదు. అందువల్ల ఎనాటమీ క్లాసులను ప్రాక్టికల్స్ (డిసెక్షన్) లేకుండా థియరీతోనే సరిపెట్టడం జరుగుతోంది. దాన్ని మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణిస్తోంది…’
ఆ ఆర్టికిల్ ని చదువుతూంటే ఇన్స్ పెక్టర్ బుర్రలో కొత్త ఆలోచనలు రేగాయి…వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళాడు. ఎనాటమీ క్లాసులకు వారికి అందుతూన్న శవాలను గురించి చర్చించాడు. ప్రభుత్వ కాలేజీలకంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి మరింత అద్ద్వాన్నంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు…ఆయా కాలేజీలకు గత కొన్ని నెలలుగా లభ్యమైన శవాలను గూర్చి ఆరా తీసాడు. ఎవరూ రికార్డులను సవ్యంగా మెయింటెయిన్ చేయడంలేదని గుర్తించాడు.
అనంతరం తన మేనకోడలిని అక్కడ చేర్పించదలచుకున్నట్టు చెబుతూ, మెడికల్ స్టూడెంట్స్ తో మాట్లాడాడు. మఫ్టీలో ఉండడంతో అతన్ని ఓ పోలీసు ఆఫీసరుగా గుర్తించలేదు ఎవరూను…
గత నెలదినాలలో ఏయే కాలేజీలకు ఎన్ని శవాలు వచ్చాయోనని లోపాయకారీగా విచారించితే – మూడు ప్రైవేట్ కాలేజీలకు ఒక్కో శవం చొప్పున వచ్చినట్టు తెలిసింది. సమాధుల నుండి శవాలు మాయమైన రెండు రోజులకు అవి సప్ప్లై చేయబడ్డట్టు గ్రహించాడు.
ఆ కాలేజీలలో ఒకదానికి మారువేషంలో వెళ్ళాడు శివరామ్. ఆ కాలేజ్ మార్చురీ అటెండర్ ని మచ్చిక చేసుకుని, తాను ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి చెందినవాడననీ, ఎనాటమీ క్లాసులకు శవాలను సప్లై చేసే సోర్స్ కావాలనీ అడిగాడు.
‘అప్పుడప్పుడు డెడ్ బాడీస్’ ఓ ఆంబులెన్స్ లో వస్తాయనీ, మిగతా వివరాలు తనకు తెలియవనీ చెప్పాడు అతను. ఆ ఆంబులెన్స్ నంబర్ని ఇచ్చాడు.
ఇన్స్ పెక్టర్ ఆఫీసుకు తిరిగివచ్చేసరికి, ఓ అరవయ్యేళ్ళ వృద్ధుణ్ణి తెచ్చి లాకప్ లో వేసారు అతని సిబ్బంది. బంగారు నెక్లెస్ ఒకటి ఓ పాన్ షాపులో అమ్మబోతూ పట్టుబడ్డాడట అతను.
ఆ నగ తన కోడలిదనీ, కొడుకు తనకు త్రాగుడుకు డబ్బులు ఇవ్వడంలేదన్న కోపంతో దాన్ని అమ్మేయడానికి తెచ్చాననీ చెప్పాడు ముసలాడు. కాన్ స్టబుల్స్ ని పంపించి అతని కొడుకును రప్పించాడు శివరామ్.
తన పేరు గంగులు అనీ, కూలిపని చేసుకుంటాననీ చెప్పాడు వాడు. మొదట ఆ నెక్లెస్ గురించి తనకేమీ తెలియదన్నాడు. తరువాత అది తనకు ఎక్కడో దొరికిందన్నాడు. చితగ్గొట్టేసరికి, ‘ఓ ఆడమనిషి శవం మెళ్ళో ఉంటే తీసుకున్నానంటూ’ నిజాలు బయటపెట్టాడు..
అతను చెప్పిన బాలరాజు యొక్క ఆంబులెన్స్ నంబరూ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మార్చురీ ఎటెండెంట్ ఇచ్చిన నంబరూ ఒకటే.
బాలరాజు ఇంటికి వెళ్ళాడు శివరాం. అతను నాలుగు రోజులుగా ఊళ్ళో లేడు. మరదలి పెళ్ళికి వెళ్ళాడనీ, మర్నాడు వస్తాడనీ తెలిసింది.
అతని గురించి విచారిస్తే...ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ ఆర్థికంగా కష్టపడుతూన్న బాలరాజు, కొద్ది నెలలలోనే జల్సా జీవితం గడుపుతున్నాడని తెలిసింది.
మర్నాటి ఉదయం బాలరాజును నాంపల్లి రైల్వే స్టేషన్ లోనే పికప్ చేసుకున్నాడు శివరామ్.
’ఎవరెవరో తన ఆంబులెన్సుని వాడుకుంటారనీ, శవాల సంగతి తనకు తెలియదనీ’ బుకాయించబోయాడు బాలరాజు. గంగులు తమ అధీనంలో ఉన్నాడనేసరికి గతుక్కుమన్నాడు. మాట మార్చి, ‘తాను అన్నకోసం ఆంబులెన్స్ ను నడుపుతాడనీ, అతను అనాథశవాలను కొని మెడికల్ కాలేజీలకు సప్లయ్ చేస్తాడనీ’ చెప్పాడు. అయితే, పోలీస్ ట్రీట్మెంట్ ని రుచి చూసాక, నిజం కక్కకతప్పలేదు.
నేరమంతా ‘అన్న’ మీదకు నెట్టే ప్రయత్నంచేస్తూ, ‘అన్న' పేరు గురవారెడ్డి అనీ…అతనికి తెలియకుండా తాను తన సెల్ లో రికార్డ్ చేసిన తమ సంభాషణలను ప్లే చేసి వినిపించాడు.
బాలరాజును తీసుకుని గురవారెడ్డి ఇంటికి వెళ్ళాడు శివరామ్. అతను ఇంట్లో లేడు. ‘గతదినం గురవారెడ్డి తల్లి డెత్ యానివర్శరీ అనీ, కార్యక్రమం ముగిసేసరికి సాయంత్రం అయిపోయిందనీ, ఆ తరువాత తల్లి సమాధిని దర్శించేందుకు అతను స్మశానానికి వెళ్ళాడనీ’ చెప్పింది అతని భార్య. తద్దినం రోజున ఆవిడ సమాధి వద్దకు వెళ్ళి గంటలకొద్దీ గడిపివస్తాడంది. తెల్లవారినా రాకపోయేసరికి ఫోన్ చేసామనీ, స్విచాఫ్ చేయబడి ఉందనీ చెప్పింది.
అంతలో బాలరాజు సెల్ మ్రోగింది. శివరామ్ సైగనందుకుని స్పీకర్ ఆన్ చేసాడు అతను.
“బాలరాజన్నా! ఊరినుండి వచ్చావా? మేము మార్చురీలో ఉన్నాం, వస్తావా?” అన్నాడు అవతలి వ్యక్తి.
అది ‘అన్న’ ప్రైవేట్ మార్చురీ అని చెప్పాడు బాలరాజు. కాస్ స్టబుల్స్ ని గురవారెడ్డి ఇంటి దగ్గర కాపలా ఉంచి, బాలరాజుతో మార్చురీకి వెళ్ళాడు శివరామ్.
అక్కడ శవాన్ని చూసి బాలరాజు బిగుసుకుపోయాడు. శివరామ్ మఫ్టీలో ఉన్నందున, అతన్ని క్లయెంటుగా భావించారు అక్కడున్న వ్యక్తులు ఇద్దరూ.
“పెద్దన్న చెప్పాడని, నువ్వు వచ్చేసరికి ఓ శవాన్ని తెచ్చి ఉంచమన్నావుకదా? ఇదిగో!” అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి, బాలరాజుతో. ”గంగులు గాడు ఎటు పోయాడో తెలీలేదు. మీరిద్దరూ లేకుండా సమాధి తవ్వడానికి మాకు ధైర్యం చాల్లేదన్నా! బాడీ అర్జెంటన్నావని, స్మశానంలో తిరుగుతూన్న ఒకణ్ణి వెనుకనుండి బుర్ర పగులగొట్టి వాడి శవాన్ని తెచ్చేసాం…”.
“అన్నా! మా కష్టాన్ని గుర్తించి ఎప్పుడూ ఇచ్చేదానికంటే ఎక్కువే ముట్టజెప్పాలి మాకు…” అన్నాడు రెండోవాడు.
శిలావిగ్రహంలా ఉండిపోయిన బాలరాజు తేరుకుని ఇన్స్ పెక్టర్ వంక వెర్రిచూపులు చూసాడు.
“సార్! ఇతనే… ‘అన్న’…గురవారెడ్డి…” అన్నాడు శవాన్ని చూపిస్తూ!!