డబ్బు మనుషుల సమాజం
డబ్బు మనుషుల సమాజం
*****డబ్బు మనుషులు*****
గడిచిన రోజులన్నీ గాయాల మయం
నడిచిన దారులన్నీ రక్తసిక్తం
ఎదురైన అనుభవమంతా అరాచకత్వం
కలిసిన మనసులంతా విష స్వరూపం
***
విశ్వ మానవ సంఘాలన్నీ వినాశనాన్ని పెంచుతుంటే
నా కలం మాత్రం శాంతి మంత్రం జపిస్తుంది!!
మనుషుల మస్తిష్కాలు విజ్ఞతో విలసిల్లక
విశ్వాన్ని శాసించే సదస్సులలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటిస్తున్నాయి..
నా కలం మాత్రం మైత్రీ బంధం అల్లుతుంది!!
మనం మనుషులమని సంతోషపడ్డ ప్రతీసారీ మనం డబ్బును బట్టి మనుషులం అని నా కలం గుర్తు చేస్తుంటుంది!!
మనం మంచివాళ్ళం అని ఊహించిన ప్రతీసారీ మనం మంచి నటులం అని నా కలం రంగులేస్తుంది!!
మనవి మానవ సంబంధాలు అని సంబర పడ్డ ప్రతీసారీ
అవి కాలానుగుణ అవకాశవాద అస్థిర సుడి గుండాలు అని నా కలం చిన్నబోతుంది!!
ఆకలి కన్నా గొప్ప అపహాస్యం ఉంటుందా అని మనసు ప్రశ్నించిన ప్రతీసారీ.. స్వార్థం సామర్ధ్యం కంటే ఆకలి అపహాశ్యం చాలా చిన్నదని నా కలం రాసుకొస్తుంది!!
***
మన చుట్టూ ఉన్న మనుషులు..సమాజం..రోజు రోజుకీ నాశనం అవుతుంటే...
కేవలం డబ్బు మాత్రమే జీవితాలను ప్రభావితం చేస్తుంది అనే ఒక అపోహలో అయిన వాళ్ళను కాదనుకుని మనది కాని దానిపై ఆశ పెంచుకుని అగౌరవంగా అప్రతిష్ట పాలు అవుతుంటే...
జీవితం ఒక నాటక రంగం అని రాసిన షేక్స్పియర్ మహా కవి కళ్ళల్లో మెదులుతున్నారు!!
నా దేశాన్ని..ప్రజల్ని మేల్కొలుపు అని సందేసమిచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తున్నారు!!
***
రూపాయి మోజులో రూపాలు మారుతున్న కుటుంబాలు..
ఆస్తుల మోజులో ఆనవాలు కోల్పోయిన మనుషులు..నా కళ్ళకి.. కలానికి..సర్వస్వం హరించుకుపోయిన అనాధల్లా... అభాగ్యుల్లా... అనిపిస్తున్నారు!!
సంతృప్తి లేని జీవితాల్లో శవాల గుట్టల్లా.. కనిపిస్తున్నారు!!
మూలాలు మరిచి...విలువలు విడిచి సాగుతున్న మన బ్రతుకులు చివరికి..
స్మశానాన విరిగిన మట్టికుండలు!! కాష్టాన కాలిన కట్టెముక్కలు!!అని తెలుసుకొని మసలుకునేదేప్పుడో...ఈ పాడు జనాలు?!!
--
హరి మొజ్జాడ