పైసా స్వామ్యం అయిన రోజు
పైసా స్వామ్యం అయిన రోజు


క్రమ క్రమంగా....
ప్రజాస్వామ్యం పైసాస్వామ్యం
అయి'పోయింది'
ఓటుని పచ్చనోటుకి
అమ్ముకున్నవాడు
నోరుమూసుకోక ఇంకేమీ చెయ్యగలడు
ధనస్వామ్యంలో లాభనష్టాల
లెక్కలు కీలకం...ఐదేళ్లలో
వందకు లక్ష సాధారణ లక్ష్యం
అదనంగా అధికార హోదా
దర్జా దర్పం డాబూ కూడా
ఆ పక్షం ఈ పక్షం కాదు
వామపక్షం తప్ప అన్ని పక్షాలు
ఎక్కడో ఒక దగ్గర గడ్డి తిన్నవే
సంక్షేమ పథకాలు పేరిట
ఒకడు ముందస్తు మదుపు పెడితే
ఆదుకునే స్కీములంటూ
మరొకడు మూడాకులు ఎక్కువే
తింటున్నాడు...వింటున్నారా
నేనిక్కడ గురుంచే చెప్పడంలేదు
భారతావని ఎన్నికలు పొట్ట విప్పితే
నోట్ల కట్టల కట్ల పాములై...
ఎప్పుడో ఆమెను చంపేసాయి
మందుకో... విందుకో ఇంకెందుకో
ఓటు హక్కుని అమ్ముకుంటే
ఛోటామోటా నేతలు సహితం
నీ నోట మట్టికొట్టి కోటీశ్వరులై
నీ కళ్ళముందే వటవృక్షాలై
విషపు గాలులు వీస్తున్నారు
అవినీతి కారుచీకట్లో
ఒక వేగు చుక్క రాక మానదు
అంతవరకూ ఈ కృత్రిమ
ఎల్ ఈ డీ నక్షత్రాలను భరించక
తప్పదు ఒప్పుకున్నాక
ఒక్కటే ఆలోచన రేకిస్తుంది
నోటా మాట ప్రతినోటా వింటే
పచ్చనోటు పలుచనై
ప్రజాస్వామ్యం చిక్కనౌతుందేమో!!!