భస్మధారి
భస్మధారి


తీతువు కూతలు విని కపాలము పగిలినది
తను ఉన్నది స్మశాన స్థలి అని తెలిసి
గజ గజ వణికినది
రూపము లేని రూపములు ఏవేవో తచ్చాడుతున్నాయి
దేహము లేని దేహము భయము పొందుతోంది
పెళ్ళాం బిడ్డలు బంధువులు సావాసగాళ్ళు
ఎవ్వరూ దగ్గర లేరే అని వగచింది
అయ్యో ఈ బంధాలూ బంధుత్వాలూ
సుఖాలూ సురత క్రీడలు శాశ్వతమని తలిచానే
అహంకారముతో అంతా నాదేనని
నే చెప్పినది జరిగి తీరాలని ఎందరినో శాసించానే
నా మద ప్రవృత్తితో ఎందరినో బాధపెట్టానే
ఇప్పుడెవ్వరు నాకు దిక్కు
దిక్కు తోచట్లేదు
తెలియని దారి
ఎటు పోవాలో ఎరుక లేని దారి
నా అనుకున్న వారెవారూ నాతో రాలేని దారి
ఈ తెలియని దారిలో ఎవరు నాకు తోడు అని ఏడ్చినది ఆత్మ
వినిపిస్తోంది డమరుక నాదం
ధర్మమనే నందినెక్కి
కైలాసము వీడి
వల్లకాటికి వచ్చెనట శివుడు
అష్టాదాశ భుజముల రుద్ర తాండవము చేసెనట
ఆత్మ చైతన్యము పొందెను
స్వామీ నే నిన్నెప్పుడూ కొలవలేదు
నాకోసం వచ్చావు
ఏమీయగలను అని అందట ఆత్మ
చుట్టూ కలియతిరిగి
తన దేహము కాలి మిగిల్చిన బూడిద తెచ్చి
మహా కాలుడికి అభిషేకము చేసెనట
భస్మధారి ఎదుట ప్రణమిల్లి
శంభో శంకరా అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచెనట
బిడ్డల కోసం స్మశానానికి వచ్చి తోడు ఉండే సామీ
ఇంక నాకు భయము లేదని ఆయన పాదాల మీద వాలి విశ్రమించినదట