బొమ్మరిల్లు
బొమ్మరిల్లు
జయ, నారాయణలది మధ్యతరగతి కుటుంబం.
వాళ్ళకి కూతురు సరసు, కొడుకు కుమార్.
వారి ఇల్లు "బొమ్మరిల్లు" లాగ అందమైన గూడు.
సరసు చిన్నప్పుడే అనారోగ్యంతో పుట్టింది.
పదో తరగతి పాస్ అయింది.
సరసు ఎప్పుడు తన అనారోగ్యం గురించి బాధ పడలేదు.
ఎందుకంటే తల్లి తండ్రి తనని అమితమైన ప్రేమతో ఆరోగ్యం
బాలేదని ఎంతో ప్రేమగా పెంచారు.
తమ్ముడు కుమార్ కూడా చాలా ప్రేమగా ఉండేవాడు.
నిజంగా చెప్పాలంటే కుమార్ సరసుకు తమ్ముడు కంటే కూడా మంచి స్నేహితుడు.అక్క అంటే ఎంతో ప్రేమ.
సరసు తల్లి ,తండ్రి,తమ్ముడు ప్రేమలో తన వైకల్యంను పట్టించుకొనేది కాదు.
సరసు ఎటు వెళ్ళాలన్నా కుమార్ తన సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు.
సినిమాలకి, స్కూల్ కి, గుడికి ఎటు అంటే అటు సైకిల్ మీద వెళ్ళేవారు.
సరసు, కుమార్ తిట్టుకునేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. కల్సి ఆడుకునేవాళ్ళు. పెద్దగయ్యాక కూడా కాలంతో పాటు వాళ్ళ ప్రేమ మరింత పెరిగింది.
తన అనారోగ్యం వల్ల సరసు ఏ పని చేయలేకపోయేది.
అయినా ఎప్పుడు ఏ పని చేయాల్సిన అవసరం రాలేదు.
అన్ని అవసరాలు తల్లి,తండ్రి, తమ్ముడు చూసేవారు.
కుమార్ డిగ్రీ అయిపోయింది.
ఒకరోజు ఉష అనే అమ్మాయిని వెంట పెట్టుకు వచ్చాడు తన స్నేహితురాలంటూ.
తర్వాత సరసుకు చెప్పాడు ఆమెని పెళ్లి చేసుకుంటా అని.
సరసు ఊహించిందే ఇది.
ఒకటే చెప్పింది అమ్మకి ఇష్టం అయితే నాకేం అభ్యంతరం లేదని. వేరే కులం అయినా సరసు ఉద్దేశ్యం మనుషులు అంతా ఒకటే కులం అనేది మనుషులు పెట్టుకున్న పద్దతులు అని.
కానీ జయకి ఇష్టం లేదు. అలా తమ కొడుకు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అందరిలో తలవంపులు
ఇది కుదరదు అని చెప్పింది.
ఇక్కడ చెప్పాల్సిన విషయం సరసు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం.
నారాయణది చిన్న పని. రోజు వచ్చేది రోజు తినడానికే సరిపోయేది.
జయ కూడా మిషను కుట్టి ఇంట్లోకి వెళ్ళదీసేది.
రాత్రి జయ ఎంతో ప్రేమగా సరసుకు, కుమార్ కి అన్నం తినిపిస్తుంటే చెప్పాడు కుమార్ తల్లి ఎంత కష్టపడి పెంచిందో తెలుసని అమ్మకి ఇష్టం లేకుండా ఉషను పెళ్లి చేసుకోను అని ఎంతో నమ్మకంగా చెప్పాడు.
ఆ రాత్రి స్నేహితులతో బయటికి వెళుతున్న అని చెప్పి మూడురోజుల తర్వాత ఉషను పెళ్లి చేసుకొని వచ్చాడు కుమార్.
జయ, సరసు కుమార్ ఇలా మోసం చేస్తాడని ఊహించలేదు. బాగా ఏడిచారు.
సరసు తేరుకుని తల్లికి నచ్చ చెప్పింది ఉషని ఇంట్లోకి ఆహ్వానించారు.
కానీ కుమార్ తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
సరసును కుమార్ ఎంత మాట్లాడించాలని చూసినా
మౌనంగా ప్రక్కకు వెళ్ళిపోయేది.
సరసు ఎప్పుడు తన గురించి ఆలోచించలేదు, ఎలా బ్రతుకుతాను అని ఇప్పటి దాక ఆ అవసరం రాలేదు.
కుమార్ నమ్మించి మోసం చేశాడని మాట్లాడటం మానేసింది.
ఇన్ని రోజులు తండ్రి పెంచాడు. భవిష్యత్తులో తమ్ముడు తోడు ఉంటాడు అని అన్ని కుమార్ చూసుకుంటాడని తాను ఎలా బ్రతుకుతానని తన గురించి ఆలోచించలేదు.
ఇప్పుడు తమ్ముడుతో మాట్లాడట్లేదు కదా వాడు సంపాదించిన తిండి వద్దని తనని తాను పోషించుకోవడానికి పని చేయాలనుకుంది.
అలానే మనుషులను నమ్మడం మానేసింది.
ఎవరూ మనకోసం ఆలోచించరని అందరూ మోసగాళ్ళే అని ఒకటే నిర్ణయం తీసుకుంది.
ఎంత కష్టమైన తన జీవితం తను బ్రతకాలని, ఎవరి మీద ఆధారపడకూడదని.
ఇప్పుడు సరసు వాళ్ళ ఇంట్లో ఇదివరకులా ప్రేమలు ఉన్న మనుషులు ఒకరికి ఒకరు దూరమైనట్టు,
బొమ్మరిల్లు లాంటి గూడు చెదిరి గుంపుల గువ్వలుగా ఉన్న నలుగురు చెట్టుకొకరు అయ్యారు.
ఎవరి అభిప్రాయం వారిది.
మనుషుల సంబంధాలు, బంధాలు అన్ని అవసరాలకేమో అనిపిస్తుంది.