అణిమాదిసిద్ధులు
అణిమాదిసిద్ధులు
మనిషికి ఈ శరీరం కలిగి ఉండడమే సిద్ధి. అది ఆరోగ్యంగా ఉండడానికన్న మించిన పెద్ద సిద్ధి లేదు.
కాని చాలామంది జనాలకి, ఏదేదో చేసి, ఏవేవో సిద్ధులు పొందాలని ఆశ. ఆ సిద్ధులతో ధనము, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, గొప్ప సిద్ధుడిగా మిగిలి పోవాలనీ కోరిక.
ఈ సిద్ధులలో అణిమాది సిద్ధులు అందరికీ తెలుసు. అవి పొందాలని ఎందరికో తహ తహ.
ఈ రోజుల్లో కాదు గాని, ఇదివరకు ఈ పిచ్చి చాలా ఎక్కువగా ఉండేది. జనాల్లోని అత్యాశ, మూఢనమ్మకాలు దీనికి ఆజ్యం పోసేవి. ఈ శరీరంతో కలకాలం ఈ భూమి మీద జరా మరణాలు లేకుండా ఉండిపోవడం
అన్నింటికీ మకుటాయమానమైన సిద్ధిగా కోరబడేది.
ఎందరో జనం తమ జీవితాలను ఈ సిద్ధులు సాధించడం కోసం వెచ్చించే వారు. భారతదేశంలో ఈ సిద్ధులపై ఎన్నో పుస్తకాలు రాశారు; ఎంతో సాహిత్యం ఉంది.
ఎవరు ఎంత చేసినా ఈ భూమిపై జరా మరణాలు లేకుండా ఉండిపోవడం ఎవరికీ సాధ్యపడలేదు. అందరూ ఏదో వయసులో ప్రకృతి నియమానికి లోనై చనిపోయే వారు -
జాతస్య మరణం ధ్రువమ్ - కదా.
సిద్ధులతో జనాలను ఆకర్షించడం, శిష్య కోటిని ఏర్పరచుకోవడం, ఎంతో సాహిత్యం రచించడం, వీలైనంత ధనం, వీలైనన్ని ఆస్తులు సంపాదించుకోవడం జీవనాశయంగా
ఉండేది. తత్త్వం నేర్చుకోవడానికి ఎందరుండే వారో అంతకు మించి సిద్ధులు పొందడానికి జనాలుండేవారు.
మనిషికి ఆశ ఎక్కువ. పర్వాలేదు. ఆశ పడకుండా మనిషి బతక లేడు. కాని అది దురాశ కాకూడదు. దురాశ వ్యక్తిని అతని చుట్టుపక్కల వాళ్ళని నాశనం చేస్తుంది.
ఇదివరికిటి సిద్ధుల స్థానంలో ఇప్పుడు ఆధునిక సాంకేతిక పనిముట్లు వచ్చాయి.
అవి చేయగల ఇంద్రజాల మహేంద్రజాలాలు అనంతం. మనం ఈ ఆధునిక సాంకేతికతకి అలవాటు పడ్డాం. చాలామందిమి అవి లేకుండా బ్రతకలేము.
మనిషికి ఎప్పుడూ తను విశ్వ సార్వభౌముడు కావాలని కోరిక. ఆ దిశలోనే అన్ని ప్రయత్నాలు, కనిపెట్టడాలు చేస్తాడు. తను
ఏ ఇతర శక్తి మీదా ఆధారపడకుండా, స్వ ఇచ్ఛతో, స్వతంత్రగా జీవించాలని ఆశయం.
పూర్వ కాలంపు సిద్ధుల వంటివి నేటి ఆధునిక ఉపకరణములు.
ఈ హడావుడిలో తనకు ముఖ్యమైనది ఏదీ అనే మీమాంస రాదు.
తను ఈ శరీరం ద్వారా సంక్రమించిన జ్ఞాన, కర్మేంద్రియాలతో ఎన్నో చేయగలడు, అనుభవించగలడు. కాని అంత మాత్రాన సంతృప్తి చెందడు. అది తన హక్కు అనుకుంటాడు.
అందమైన దృశ్యాలు చూడగలగడం, శ్రావ్య ధ్వనులు వినగలగడం, ఎన్నో రుచుల ఆహారం ఆస్వాదిస్తూ తినగలగడం, సుగంధాలను ఆస్వాదించడం, స్పర్శానుభూతులు పొందడం, నడవగలగడం, చేతుల, కాళ్ళతో
ఎన్నో పనులు చేయగలగడం అద్భుతం అనుకోడు. ఇదంతా మామూలు అనుకుంటాడు.
ఆ జ్ఞాన, కర్మేంద్రియాలలో ఏదైనా లోటుంటే తప్ప వాటి విలువ తెలుసుకోడు. మాట్లాడగలగడం, అనుభూతి చెందగలగడం, ఆలోచించగలగడం తనకు మాత్రమే ప్రకృతిచే ఇవ్వ బడిన వరాలు అనుకోడు. ఆరోగ్యకరమైన, దార్ఢ్యమైన శరీరం కూడా ఒక పెను సిద్ధి అని తెలుసుకోడు.
సిద్ధులు, ఉపకరణాలు అంటూ నక్కాశతో బతుకుతూంటాడు. మనుషుల కన్నా ఆస్తిపాస్తులకి, డబ్బుకి విలువ ఇస్తాడు.
తనకు ఎన్నో చేసిపెట్టే శరీరం విలువ తెలుసుకోడు.
"శరీరమాద్య ఖలు ధర్మసాధనమ్" అని గ్రహించక ఇక్కట్లు పాలవుతాడు.