దొంగ సొమ్ము
దొంగ సొమ్ము
ఒకటి కాదు రెండు కాదు. గంగమ్మకు బోనం పట్టుకుందామని యాభై వేలు బ్యాంకీ నుండి తెచ్చినా . తెల్లారే సరికి ఇంట్లో డబ్బు బాయె. మీరే ఒక రవ్వ ఇచారించి పెట్టాల.. చెమట పట్టిన నుదురు తుడుసుకుంటూ సబిన్స్పెక్టరు పాపయ్య ముందు తన సమస్య చెప్పుకున్నాడు సుబ్బారెడ్డి.
పాపయ్యకు అప్పటికే ఈ దొంగతనం ఎవరు చేశారో చూచాయగా తెలుసు. క్రితం రాత్రి పెట్రోలింగ్ చేసేటప్పుడు పక్క పల్లె సూరి గాడు దొరికినట్టు తనకు తెలియడం, వాడి దగ్గర ' మామూలు ' తీసుకుని డబ్బుతో పాటు వాణ్ణి కూడా వదిలేయడం జరిగింది.
వేరే ఎవరైనా అయితే పాపయ్య అంత సేపు ఆలోచించే వాడు కాదు. సుబ్బారెడ్డి ఊరిలో మంచి పేరున్న వాడు. ఎలాగోలా కేసు పెట్టనివ్వకుండా ఆపాలి అని మనసులో అనుకున్నాడు.
రెడ్డి గారూ! కంగారు పడకండి. యాభై వేలు అంటే పెద్ద మొత్తమే. కానీ అంటూ కానిస్టేబుల్ వైపు చూశాడు.
ఏం చెప్తాడో అని చెవులు రిక్కించి వింటూ నిలబడ్డ కానిస్టేబులు బయటికి వెళ్ళిపోయాడు.
రెడ్డి గారూ! మీ అబ్బాయి ఈ మధ్య ఆ పోరంబోకు గ్యాంగుతో కలిసి నాటు సారా కాసే చోట కనబడ్డాడు. పాపయ్య గుడ్లు మిటకరిస్తూ అన్నాడు.
అది సర్లేవయ్యా. ముందు ఈ డబ్బు గురించి చూడు అని అన్నాడు సుబ్బారెడ్డి.
పాపయ్య లేనిపోనివి చెబుతున్నాడు అని అతనికి అర్థమయింది. కానీ కొడుకు కూడా తన మాటే వినే రకం కాదు కాబట్టి వాదన అనవసరం.
రెడ్డి గారూ! మీ ఆవిణ్ణి కూడా స్టేషనుకు పిలిచి విచారించాల్సి వస్తుంది. డబ్బు ఎవరైనా తీసుండొచ్చు కదా. పాపయ్య గట్టి బాణమే వేశాడు.
యో. ఏంది నువ్వు సెప్పేది. పానం బాలేదంటే ఆస్పత్రికి పోదు. డాకటరే ఇంటికొచ్చి సూస్తాడు. అట్టాటింది నా పెండ్లాం ఈడికొచ్చి ఇవరం సెప్పాల్నా.
నువ్వూ వద్దూ . కేసు పెట్టడమూ వద్దు. అయినా దొంగ సొమ్ము అరగదులే అని అరిచాడు సుబ్బారెడ్డి.
రెడ్డి గారూ. నే పట్టుకుంటా కదా దొంగని అని వినయంగా అన్నాడు పాపయ్య.
పట్టుకో. తిన్నాల ముందే పట్టుకో. ఆ దొంగ నాయాలు దొరకాలీ. పొట్టేలి బదులు ఆ దొంగ నాయాల్ని నరికితే పీడా పోతుంది అని ఆవేశంతో బయటికి వెళ్ళిపోయాడు.
పాపయ్య ఒక్క క్షణం హడలిపోయాడు. విషయం తెలిస్తే నన్ను కూడా గంగమ్మకు బలి ఇచ్చేట్టున్నాడు అని అతని వెన్నులో వణుకు పుట్టింది.
అయినా ఎలా తెలుస్తుంది.. ఎవరు చెబుతారు.. ఇది తన రాజ్యం అనుకున్నాడు.