సగటు రచయిత
సగటు రచయిత
మీకు కిషోర్ గారి పుస్తకాలు తెలుసా. ఏదో సాహితీ సమావేశంలో ఓ సాహిత్య విశ్లేషకుడు నన్నే అడిగాడు.
హా! అని ఏదో ముక్తసరిగా అన్నాను. ఇంత సీనియర్ రచయితని నా రచనల గురించి మాట్లాడకుండా ఎవరి గురించో అడిగితే మరి అహం దెబ్బ తినదూ.
నేనతని రచనలన్నీ చదివేశాను. చాలా బాగుంటాయి. మీరేమంటారు? మళ్లీ అదే చచ్చు ప్రశ్న వేశాడు.
ఆ ఏం బాగుంటాయి అతని రచనలు. అతని రచనలన్నీ mediocre గా ఉంటాయి. జాబులో అంతరాలు చూడకూడదు అంటాడు. ఆస్తులన్నీ పోయినా ఆవకాయతో అన్నం తిని ఆనందంగా బ్రతకచ్చు అంటాడు.
ఒట్టి సుత్తి మేళం క్యాండిడేట్స్ ప్రతినిధిలా ఉంటాయి అతడి పాత్రలన్నీ అని నా ఉక్రోషాన్ని వెళ్లగక్కాను.
అదేంటండీ! మీ తోటి రచయితలంతా అతణ్ణి ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే మీరేమిటి ఇలా అంటున్నారు అని మళ్లీ అడిగాడు ఆ సాహిత్య విశ్లేషకుడు.
బల్లి వెల్లకిలా గోడను కరుచుకుని తాను పట్టుకోకపోతే గోడ పడిపోతుంది అనుకుంటుది అన్నట్టు అతని రచనల వల్ల ఏదో జీవితాలు ఉద్ధరింపబడినట్లు ఏమిటండీ ఈ చర్చలూ.
ఏదో జనాల నోళ్లలో నానుతూ నాలుగు నోట్లు సంపాదించుకునే రకమే కదా అని తీసిపారేసి నా దారిన నేను చక్కా పోయాను.
రెండు వారాలు గడిచాయి. కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రకటించింది.
వర్ధమాన రచయిత కిషోర్ బాబుకు సాహిత్య అకాడెమీ అవార్డు...
ఇక పేపరు చదవబుద్ధి కాలేదు.
ఎక్కడో నవ్వులు వినిపిస్తున్నాయి. తలుపులన్నీ వేసే ఉంచాను.
ట్రింగ్ ట్రింగ్ అని టెలిఫోన్ మ్రోగింది.
మీరు తప్పకుండా రావాలండీ. మీలాంటి పెద్దలు కిషోర్ బాబు లాంటి వారిని ప్రశంసించక పోతే ఎలా.
అటు వైపు అదే సాహిత్య విశ్లేషకుడు నన్ను సభకు వచ్చి ఆ కిషోర్ ను పొగడమంటున్నాడు.
నాకు తల కొట్టేసినట్లయింది.
చిరాకులో పుస్తకాల షెల్ఫ్ తెరిచాను. గతేడాది కొన్న నవల. సంతోషంలో సగటు మనిషి. ఆ కిషోర్ వ్రాసిందే.
ఎందుకో ఆ నవల చదువుతూ ఉండిపోయాను.