రాధే గోవింద
రాధే గోవింద
భారత భాగవతాలుఎన్ని సార్లు చదివిననూ నిన్ను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాను. ఎన్ని పురాణ కాలక్షేపాలు విన్ననూ నిన్ను సేవించు భాగ్యము పొందలేకపోయాను. బృందావనం దర్శించవలెనను ఆశ తీరకుండా ఉందే అని కృష్ణుని ప్రతిమ ముందు కూర్చున్నాడు విష్ణు దాసుడు.
విష్ణు దాసుడు కళ్ళు మూసుకుని కృష్ణుని ధ్యానించసాగాడు.
రాధే రాధే అని భక్తులు రాధా దేవిని పిలుస్తూ ఉంటే కృష్ణుడు పొంగిపోతున్నాడు. రాధా అనే నామము ప్రేమతో పలికితే వారి వెంట ఉంటానని అందరికీ చెబుతున్నాడు. అంతలో చైతన్య ప్రభువు వచ్చి కృష్ణుడికి దగ్గరగా ఉండడం అంటే కృష్ణుడికి దూరంగా ఉండడమే. రాధా దేవి కృష్ణుడి నుండి దూరంగా ఉన్నా ఆయన మనసులో సుస్థిర స్థానం సాధించింది కదా.
మరి ఆమె ప్రేమ లాంటి భక్తిని మనమూ సాధన చేయగలిగితే కృష్ణుడికి దూరంగా ఉండడం కూడా దగ్గరగా ఉండటమే అని ఆయన తన బోధనల్ని వినిపిస్తున్నారు.
విష్ణు దాసుడి కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి చైతన్య ప్రభువు లేడు. తన పక్కనే కూర్చున్న కొడుకు తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే అని స్తుతిస్తూ కనిపించాడు.