మరణం దాటి..
మరణం దాటి..
శ్రీకర్ మరణం సంభవించి మూడు గంటలు దాటింది. ఎవరో తట్టి లేపినట్లు అతడి శరీరం నుండి ఒక వెలుగు రేఖ బయటికి వచ్చింది.
కాస్సేపు అతని శరీరం విడువలేక అది దాని చుట్టూ తిరిగింది. ఏదో గుర్తుకు వచ్చినట్లు తన వాళ్ళను చూసి అలా ఆకాశం వైపు ఎగిరింది.
శ్రీకర్ తన రూపాన్ని చూసుకున్నాడు. మరి కొద్ది గంటల్లో అతడి శరీరం మట్టిలో కలిసిపోతుంది.
ఇప్పుడు తనో కాంతి పుంజం. అంతే. అంటే అది ఆత్మనా.. అతడికి భయం లేదు. బాధా లేదు. ఆ కాంతి పుంజం అలా ప్రయాణిస్తూ ఉంది.
ఒక చోటికి చేరగానే అతడికి మరిన్ని కాంతి పుంజాలు కనిపించాయి. అవన్నీ వెళ్లే దిక్కు వైపు అతడు ప్రయాణించసాగాడు.
తను విన్నట్టు స్వర్గమూ నరకమూ లేవా.. అంటే? అంతా అబద్దమా. అతడికి అరవాలనిపించింది. అంతలోనే మరో పెద్ద వెలుగు అతడిని ఆక్రమించింది.
ఏది మరణం? మానవుడు ఎందుకు పడుతున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు? మరణించిన నేను ఎక్కడికి వెళుతున్నాను? ఈ ప్రశ్నల్ని అడిగాడు ఆ వెలుగును.
అతడికి సమాధానం రాలేదు. క్రమంగా వెలుగు చీకటిగా మారి ఆ కాంతి పుంజం అనంత విశ్వంలో కలిసిపోయింది.