మనసు చేసిన న్యాయం - 27వ భాగం
మనసు చేసిన న్యాయం - 27వ భాగం
మనసు చేసిన న్యాయం - 27వ భాగం
* చాలా రోజుల తర్వాత ఒకరోజు నాన్నగారిని తెల్లని యూనిఫారం వేసుకున్న నలుగురు మగవాళ్ళు అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఆయన కాలికి కట్టు ఉంది.
*నాన్నగారు సెలవు పెట్టారట. ఇంట్లోనే ఉన్నారు. తనకి తగ్గాకా మావారింటికి తీసుకెళ్తాను అన్నారు. ఇంట్లో ఏమీ తోచడం లేదట. సరదాగా ఆఫీసుకు వెళ్లి అంకుల్స్ తో కబుర్లు చెప్పి వచ్చేవారు.
*ఈరోజు వాడెవడో సినిమాలో రౌడీలా ఉన్నాడు పెద్ద సూట్ కేసుతో వచ్చాడు. అమ్మ - నాన్నగారు ఇంట్లో లేరు.అని చెప్పింది.
అతను అమ్మతో చాలా సేపే మాట్లాడాడు. ఆ పెట్టెలో డబ్బు తీసి చూపించాడు. రెండు లక్షలు ఉందట. అది తీసుకుని నాన్నగారి చేత ఎలాగైనా తమవైపే మాట్లాడేలా ఒప్పించమని చెప్పి మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు.
నాన్నగారికోసం అమ్మ ఎదురు చూస్తూనే ఉంది ..ఎపుడు వస్తారా...ఎపుడు చెబుదామా అని ఇల్లంతా తిరిగింది.
కానీ ఇంట్లో పనిచేసే కేశవులు సాయంత్రం వచ్చి ''మీ ఆవిడకి డబ్బు ఇచ్చాం కదా,,ఇంకా మా వైపు మాట్లాడవా?''అని వాళ్లెవరో నాన్నగారిని కత్తులతో పొడిచి చంపేసారట .అప్పుడే తమ్ముడు, చెల్లెళ్ళు కాలేజీల నుంచి వచ్చారు. అందరం వెక్కి వెక్కి ఏడ్చేసాము. చివరకి పోలీసులు మాకు నాన్నగారి ముఖం ఒక్కటి చూపించారు. అంతే ! డాడీ మళ్ళీ కనపడలేదు.
***************
తరువాత కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. అప్పటివరకు చదివిన నాకు నా గుండెలు కొట్టుకుంటున్న శబ్దం స్పష్టంగా తెలుస్తోంది. పుస్తకం మూసి రెండు నిముషాలు అలాగే ఉండిపోయాను. అక్షరాలూ మసకగా కనిపిస్తున్నాయేమిటి అని కళ్ళు తుడుచుకుంటే చేతులనిండా తడి.
ఈ కథ అంతటికీ కారణం ఒక ఆడదాని వింత ప్రవర్తనా?
తనచెల్లిలి ముక్కూ చెవులూ కోసి పరాభవించిన అవమానం తనదిగా భావించిన రావణాసురుడు సీతామాతను దొంగిలించుకుపోయి లంక నాశనానికి కారణమైన రామాయణాన్ని చదివాను.
ద్రౌపది నవ్వును కురుసార్వభౌముడు అవమానంగా భావించడమే మహాభారత యుద్ధానికి నాది అని చదివాను.
కానీ తన అల్లుడు తను చేసిన పనికి తనను ప్రశించడంద్వారా అవమానపరిచాడని భావించి కన్న కూతురి కాపురం కూడా సర్వనాశనం చేసే తల్లులుంటారా? ఉన్నారనే సమాధానం వస్తోంది ఈ కధ ద్వారా...అనుకున్న కొద్దీ నాకు కన్నీళ్లు ఆగలేదు.
తన మూర్ఖత్వపు పైశాచిక పంతానికి తనకూతురునే కాకుండా అభం శుభం ఎరుగని తన మనవరాలికి తల్లితండ్రుల ప్రేమకూడా లేకుండా చేసిన రాక్షసి అత్తయ్యగారు...అనుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోసాగింది. అన్నయ్యను ఏమీ చెయ్యలేక ఏ పాపం ఎరుగని తల్లికి కన్నకూతురుని దూరం చేసి, పాలుతాగే పసిగుడ్డును కన్నతల్లి ప్రేమను దూరంచేసి ఆమె ఏంసాధించింది?
అజాత శత్రువులాంటి భర్తను పోగొట్టుకుంది. అయిదవతనాన్ని పోగొట్టుకోవడం కన్నా దౌర్భాగ్యం ఒక స్త్రీకి ఏముంటుంది?
తరువాత వదిన ఇంకా ఏం రాసుకుందో నాకు ఉత్సుకత ఆగలేదు. నా స్థానంలోంచి లేచి రూంలో ఉన్న ఒక ఫైబర్ కుర్చీని తీసుకుని కారిడార్లో ఫాన్ వేసుకుని లైట్ కింద ఖాళీ పేజీల తరువాత నుంచి చదవడం కొనసాగించాను.
*************
* రోజూ ఇంటికి పోలీసులు వచ్చేవాళ్ళు. ఏవేవో ప్రశ్నలు అడిగేవాళ్ళు. వాళ్ళు వెళ్ళాకా ఆ సినిమా రౌడీ లాంటి వాడు వచ్చేవాడు. అమ్మకిచ్చిన డబ్బులు అడిగేవాడు. అమ్మ బంగారం అమ్మి వాడి డబ్బు వాడికి ఇచ్చేసింది. హైదరాబాద్ వెళ్లి అధికారులని కలవడంకోసం తమ్ముడు, అమ్మ వారానికోసారి అన్నట్టు తిరిగేవాళ్లు. మేము ఇంట్లో భయంగా గడిపేవాళ్ళం. ఇలా కాదని అమ్మ మమ్మల్ని అందరినీ హైదరాబాద్ తీసుకువచ్చేసింది.ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళం.
మొత్తానికి తమ్ముడికి నాన్నగారి ఉద్యోగం వచ్చింది . ఎవరో 'జాస్మిన్' అట. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారట.పెళ్ళికి ముందే గర్భం రావడంతో ఆ అమ్మాయినిచ్చి చర్చిలో పెళ్లి చేసేసాడట జాస్మిన్ తండ్రి. ఆ విషయం విని ఇంటికి తీసుకువచ్చిన జాస్మిన్ ని అమ్మ కొట్టడానికి వెళ్ళింది. తమ్ముడు నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటే అమ్మ ఆ అమ్మాయిని కిందపడేసి తన్నేసింది . దాంతో తమ్ముడు అమ్మని తోసేశాడు.
అప్పటినుంచి అమ్మకి, అన్నయ్యకి రోజూ దెబ్బలాట. ఇదివరకు బైట తాగేవాడట...ఇపుడు ఇంట్లోనే తాగడం నేర్చుకున్నాడు. మరదలు వాళ్ళ నాన్నగారు చర్చి ఫాస్టర్ ట. బోలెడు డబ్బు ఉన్నవారట. జాస్మిన్, తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ ఫాదర్ తో చర్చికి వెళ్లి సాయంత్రానికి వచ్చేది. తమ్ముడికి బాబు పుట్టాడు. వాడు పుట్టడంతో నాకు బోలెడు కాలక్షేపం అయ్యేది.
''నీ ఉద్యోగం కోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టాను. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ చెల్లెళ్ళకి పెళ్లి ఎలా చెయ్యను? వాళ్ళకి పెళ్లిళ్లేనా చెయ్యి...లేదా డబ్బన్నా ఇయ్యి..''అని అమ్మ ఒకటే గొడవ.
''వాళ్ళే వాళ్లకు నచ్చిన వాళ్ళను వెతుక్కుని చేసుకుంటారు.నేను పెళ్లిళ్ళు చేస్తాను. నీ నిర్వాకంవల్లే దేవుడిలాంటి నాన్నగారు పోయారు. అక్క కాపురం సర్వనాశనం చేసావు.ఇంకా మమ్మల్ని కూడా నాశనం చెయ్యాలనా ?'' అని విసుక్కున్నాడు తమ్ముడు.
మూడేసి నెలల తేడాలో చెల్లెళ్ళిద్దరూ వాళ్ళకు నచ్చిన వాళ్ళను చూసి చేసేసుకున్నారు. తమ్ముడే దగ్గరుండి పెళ్లిళ్లు చేసి వాళ్ళని అత్తారిళ్లకు పంపేసాడు.
తనమాట లెక్కచెయ్యకుండా తమ్ముడు వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడని అసలే మండిపోతున్న అమ్మ, చెల్లెల్లు కూడా వారికిష్టమైన వాళ్ళని చేసేసుకున్నారని గుర్తుకువచ్చినప్పుడల్లా హిస్టీరియా వచ్చినదానిలా ప్రవర్తించేది. ఇంట్లో వస్తువులు బలం కొద్దీ విసిరేసేది. ఇంటి ఓనర్ ఖాళీ చేసేయమన్నాడు.
ఒకరోజు 'మీ అక్కయ్యకి కూడా ఒక దారి చూసేయండి ' అన్న జాస్మిన్ సలహాతో నన్ను దగ్గరుండి యశోదాలో తన స్నేహితుడైన సైక్రియాటిస్టు గారి దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు తమ్ముడు.
అదేదో నల్లమందు ప్రభావం నామీద ఎక్కువగా ఉందని పరీక్షలలో తేల్చిన ఆయన తన పర్యవేక్షణలో హాస్పిటల్ లో చేర్చమని సూచించాడు. అపుడు పక్క బెడ్ లో ఉన్న తల్లీ కూతుళ్లతో కొంచెం నన్ను కనిపెట్టుకుని ఉండమని తమ్ముడు కోరాడు. ఆ కూతురే పల్లవి మేడం...పల్లవి తల్లిగారే పక్క బెడ్ పేషంట్.
మేము ఇల్లుకోసం ప్రయత్నిస్తున్నామన్న వార్త విని వాళ్లకు తోడుగా ఉండటం కోసం పక్కవాటా మాకు అద్దెకిచ్చారు.
మేము పల్లవి మేడం వాళ్ళ ఇంటిలోకి మారిపోయాము.
చిన్నప్పటినుంచి డబ్బు జల్సాగా ఖర్చు పెట్టే అలవాటున్న తమ్ముడు డ్యూటీలో ఎక్కువ డబ్బులు లంచం కింద డిమాండ్ చేస్తుండగా రెడ్ హేండెడ్ గా పట్టేసుకున్నారు. విచారణలో నిజమని తేలడంతో వాడిని సస్పెండ్ చేసారు. ఆ బాధ తట్టుకోలేక తమ్ముడికి తాగుడు ఎక్కువైంది.దాంతో అమ్మకి వాడికి రోజూ గొడవ ఎక్కువైంది. పల్లవి మేడం అమ్మగారు చెప్పినా వినేది కాదు అమ్మ.
ఆరోజు తన కొడుకు తనను సరిగా చూడడటంలేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేద్దామని వెళ్తున్న అమ్మని మెయిన్ రోడ్ లోకి మలుపు తిరుగుతుండగా వేగంగా ఒక బైక్ ఢీకొట్టి వెళ్లిపోవడంతో అంత ఎత్తున ఎగిరిపడిన ఆమె మళ్ళీ తిరిగి లేవలేదు.
అమ్మ తన ఉద్యోగం కోసం ఎంత తాపత్రయపడిందో గుర్తు తెచ్చుకున్నతమ్ముడు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాకా, ఒక వారం రోజుల మనస్సాన్తి కోసం బాబును నాకు అప్పగించి జాస్మిన్, మావగారితో కలిసి కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఊటీ వెళ్లారు. ఒక కొండమలుపులో వేగంగా మలుపు తిప్పబోయి సేఫ్ గార్డ్ గోడను బలంగా ఢీకొట్టి కారు లోయలోకి పడిపోవడంతో స్పాట్ డెడ్ అని తరువాత పోలీసులు నిర్ధారించారు.
*దైవంలాంటి భర్తను, నన్ను అమ్మను చేసి తన జన్మసార్ధకం చేసుకున్న సాత్వికను తల్లి మాటవిని దూరంచేసుకున్న నా ఒంటరి జీవితానికి ఒకే ఒక వెలుగు....
'ప్రణవసాయి'!
* అయినా సరే...జీవితంలో ఒకే ఒక్క చివరి కోరిక!
***************
అక్కడ ఆగిపోయింది వదిన చేతిరాత.
(మిగతా 28 వభాగంలో)