ఆధ్యాత్మికత
ఆధ్యాత్మికత
శ్రీ రమణ మహర్షి పలుకుల ప్రకారం, ఆత్మానుభవానికి మనం చేయవలసిందేమీ లేదు, చేయవలసిందంతా ఏమీ చేయకుండా ఉండడమే. ఆత్మానుభవం అయ్యే ఉంది. అడ్డుతున్న వ్యక్తిత్వ స్పృహను లేకుండా చేసుకోవడమే.
మహర్షుల పంథా గాని, ఇతర ఆధ్యాత్మిక మార్గములు గాని అందరికీ కాదు. లౌకిక ప్రపంచంలో ఉంటూ నిద్రపోగలగడమే ఆ మార్గమును అనుసరించడం.
ముముక్షువులు మాత్రమే ఆధ్యాత్మిక పథం అనుసరించాలి. ఉత్సుకత లేక ఆర్తి ఉన్నవారే ఆధ్యాత్మిక సాధనకు ఉపక్రమించాలి.
మిగతా అందరూ తమ తమ లౌకిక వ్యవహారములలో తలమునకలై, జీవితాన్ని జీవించడం మంచిది.
కోరికలతో, అవి తీరాలనే ఆశతో భగవంతుని, ఆత్మానుభవాన్ని పొందాలనుకోవడం వృథా
ప్రయాస. ఆధ్యాత్మికత ఒక శాస్త్ర పఠనం వంటిది. శాస్త్రముపై నమ్మకము, శ్రద్ధ, భక్తి, గౌరవము, పిపాస, ఉండి తీరాలి.
భగవత్ పదము చేరాలంటే భగవదర్పణం జరగాలి. శరణాగతి చెందాలి. ప్రపత్తి నిండాలి.
ఏదో లౌకికమైన కోరిక తీరడం కోసం ఆధ్యాత్మిక పథం త్రొక్కడం అనవసరం. ఉపయోగం లేని శ్రమ. ఆ లౌకికమైన కోరికలు తీరడానికి, మోసగాళ్ళని తెలియకుండా, మన బలహీనతను, అవసరాన్ని సొమ్ము చేసుకునే స్వాములను, సన్యాసులు, ఆనందాలను, అమ్మలను, బాబాలను, అటువంటి వారిని ఆశ్రయించడం మేలు.
ఆధ్యాత్మికత జిజ్ఞాసువులకే. ఆర్తులకు కూడా. అర్ధార్ధులకు లౌకిక ప్రపంచంలో కనిపించే నకిలీ గురువులను నమ్మడం మంచిది. ఆ గురువు అదృష్టం, మన అదృష్టం బాగుంటే ఆ కోరిక తీరుతుంది. ఆధ్యాత్మికత అలసులకు, అత్యాశాపరులకు కాదు. నిజాన్ని అనుభవించాలనే తహతహ నిజాయితీగా ఉన్నవారికి మాత్రమే.
లౌకిక జీవనాన్ని, అందులో ఎదురయ్యే వడి దుడుకులను భగవత్ కృపతో ఎదుర్కుంటూ, సంయమనంతో జీవిస్తూ, సుస్థిర అనన్య భక్తి కలవారే శాంత్యానుభవానికి అర్హులు.
భగవదనుభవానికి పరితపిస్తూ, శ్రద్ధాళువులై,
శ్లోll అనన్యాన్ చింతయంతో మాం యే జనాః
పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహమ్
అనే భగవాన్ ఉవాచ అయిన హామీని మనసా, వచసా, కర్మణా నమ్మి భక్తి, కర్మ, జ్ఞాన మార్గములలో తమకు ఇష్టమైన పంథాలో సాగిపోవడమే మోక్ష ప్రదము.
"మోక్షః విష్ణు ప్రసాదేన వినా న లభ్యతే".
శివరూపాత్ జ్ఞానమహః
తత్త్వో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం
భాస్కరాత్ ఆరోగ్యమిచ్ఛామి
అని కోరుకుంటూ, పొందుతూ ఈ లౌకిక జీవనాన్ని విద్యుక్త ధర్మములు నిర్వహిస్తూ సుఖప్రదంగా జీవించడమే ఆధ్యాత్మికత.
మిగతాదంతా డంబాచారం. ఉపయోగపడనిది.
ఓం తత్ సత్!