సింహాచల పుణ్యక్షేత్రము
సింహాచల పుణ్యక్షేత్రము
వైజాగ్ లో ఉండి ఇంకా సింహాచలం వెళ్ళలేదా అని కొలీగ్స్ అనడంతో ఓ ఆదివారం నాడు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే అన్ని శ్రావణ శనివారాలూ అయిపోవడం వలన పెద్దగా రష్ ఉండదు అని నా నమ్మకం.
వర్షం కొద్దిగా పడుతున్నా బయల్దేరాను. వైజాగ్ లో వర్షం ఎప్పుడైనా పడొచ్చు. ఆగొచ్చు. మనం నిమిత్తమాత్రులం కదా.
ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పదిహేను రూపాయలే బస్సు టికెట్టు. కొండ క్రింద నుండి మీదకి వెళ్ళే బస్సులు. మొత్తం కలిపి ముప్పావు గంట కూడా పట్టదు ప్రయాణం.
సింహాచలంలో దర్శనానికి లేట్ అవలేదు కానీ అక్కడ బయట ఉన్న కౌంటర్లలో ఫోను, బ్యాగు భద్రపరచుకునే టోకెన్ తీసుకునేటప్పటికి చాలా టైమ్ పట్టేసింది.
గోవింద నామస్మరణ చేసుకుంటూ స్వామిని దర్శించుకున్నాను. స్వామి వారి దర్శనం బాగా జరిగింది. ఇక్కడ స్వామి ద్వయావతార రూపంలో వెలిశారు. భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు, స్వామి వరాహ నారసింహ రూపాలు కలిసినట్లు కొలువయ్యారు. స్వామి వారి నిజరూపం చందనంతో కప్పబడి ఉంటుంది.
బయటకి వచ్చి అక్కడ ఇచ్చే ఉచిత ప్రసాదం తీసుకుని తింటూ ఉంటే స్వామి వారి ఆభరణాలు ఉండే మ్యూజియం కనిపించింది.
అందులో స్వామి వారికీ, అమ్మవారికీ అలంకరించే హారాలు, ఇతర వస్తువుల రూపాలు అద్దాల బాక్సుల్లో ఉంచారు. బంగారు పారిజాతాలు, పచ్చల పతకం ఇలా ఎన్నో.
ఆ తరువాత బయటకి వచ్చి, క్యూలో నిలబడి, డబ్బులు ఇచ్చి, నాలుగు పులిహోర, నాలుగు లడ్డూ ప్రసాదం తీసుకున్నాను.
కొంత మంది భక్తులు గోసేవ చేస్తున్నారు. నేనూ దణ్ణం పెట్టుకుని, పులిహోర తిని బస్సు వెతుక్కుంటూ వెళ్ళాను.
నేరుగా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్ళే బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నాను.
రూములో ఉన్న కొలీగ్స్ ఇంకా నిద్ర లేవలేదు. నేను సింహాచల క్షేత్ర తీర్థయాత్ర పూర్తి చేసుకుని వచ్చేశాను.
