M.V. SWAMY

Tragedy Classics

4.2  

M.V. SWAMY

Tragedy Classics

ఓ తండ్రి కథ

ఓ తండ్రి కథ

6 mins
465


ఓ తండ్రి కథ (కథ)

మోహన్ చిన్నప్పటి నుండీ చురుకైన కుర్రాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ నెంబర్ వన్ స్టూడెంట్‌గా ఉండేవాడు. ‘‘మీ కుర్రాడు మంచి తెలివైన వాడోయ్, కాస్త కష్టమైనా పెద్ద చదువులు చదివించు పెరిగి పెద్దయిన తరువాత మంచి స్థాయిలో ఉండి నీకూ నీ కుటుంబానికీ, ఈ ఊరికీ గొప్ప పేరు తెస్తాడు మీవాడు’’ అని అంటుండేవారు స్కూల్ టీచర్స్ మోహన్ తండ్రి అప్పారావుతో. అప్పారావు ఆటో డ్రైవర్. బ్యాంకు లోన్‌తో ఆటో కొనుక్కుని సొంతంగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు.

మోహన్ తల్లి శారదకు బ్రాండెక్స్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగమొచ్చింది. నెలకు ఆరువేలు జీతం. మోహన్ అయిదవ తరగతి పాసయ్యాడు. ఎక్కడా కోచింగ్‌కి వెళ్లకుండానే మోహన్ నవోదయ స్కూల్‌లో సీటు సంపాదించుకున్నాడు. రోజులు గడిచాయి. అప్పారావు రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి పనిచేసేవాడు. అతనికి భార్య శారద తోడు కూడా కలిసిరావడంతో ఆటో డ్రైవర్ నుండి పది ఆటోల ఓనరయ్యాడు. అతని దగ్గర పది పదిహేను మంది ఆటో డ్రైవర్లు డైలీ వేజెస్ కింద పనిచేసేవారు.

మోహన్ నవోదయ చదువు పూర్తయింది. ఎపి రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలో చదువుదువు గాని ఎంట్రన్స్ రాయమని ఎందరు ఎన్ని చెప్పినా వినకుండా ‘‘లేదు నేను ఫలానా విద్యా సంస్థలోనే చదువుతాను అక్కడయితే గణితం బేషుగ్గా ఉంటుంది. ఐఐటి తప్పకుండా కొట్టేయగలను’’ అని మంకుపట్టు పట్టాడు మోహన్. కొడుకు కోరిక కాదనలేక తన తలకు మించిన భారమైనా ఆ సంస్థలోనే ఇంటర్ చదివించాడు అప్పారావు. పిల్లాడి చదువుకి, కాలేజీ ఫీజుకి, పుస్తకాలకి, హాస్టల్‌కి డబ్బులు కట్టడానికి అప్పారావు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. చదువుతూ మోహన్ బాగా ఖర్చు చేయడం, వీకెండ్‌లో సినిమాలకి వెళ్లడం, షికార్లు చేస్తుండడంవల్ల పాకెట్ మనీయే ఎక్కువ భారమయ్యేది అప్పారావుకి. మోహన్ ఇంటర్ పూర్తయ్యేసరికి అప్పారావు మూడు ఆటోలు అమ్ముకోవలసి వచ్చింది.

కాల చక్రము గిర్రున తిరుగుతోంది, మోహన్‌కి అందరూ అనుకున్నట్టే ఖరగ్‌పూర్ ఐఐటిలో సీటొచ్చింది. తండ్రి ప్రోత్సాహంతో మెకానికల్ ట్రేడ్ తీసుకున్నాడు మోహన్. ఐఐటిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న మాటే గాని ఏ కార్పొరేట్ సంస్థకూ తగ్గదన్నట్టు ఖర్చయ్యేది అప్పారావుకి కొడుకు కింద. మోహన్ ఐఐటి పూర్తయ్యేసరికి అప్పారావు మరో అయిదు ఆటోలు అమ్మేశాడు. ‘‘నాను చెబితే విన్నావు కావు మనకున్న పది ఆటోల్లో ఎనిమిది అమ్మేశావు. మిగిలిన రెండు ఆటోల్లో ఒకటి పాడైపోయింది. మరొకటి నీకు మొట్టమొదటి ఆటో కాబట్టి సెంటిమెంట్‌తో ఉంచుకున్నావు... ఇదిగో పెనిమిటీ నువ్వు తప్పు చేస్తున్నావనిపిస్తోంది. ఎందుకంటే మనకున్న ఈ ఇందిరమ్మ ఇల్లు, ఆ రెండు ఆటోలు తప్ప మరేమీ లేదు. అప్పులూ పలకవు ఇప్పటికైనా మేల్కొని ఆడి సదువు అయింది కాబట్టి ఏదైనా ఉద్యోగానికి పొమ్మను మన పరిస్థితి కుదుటపడుతుంది’’ అని పోరుపెడుతుండేది శారద భర్త అప్పారావుతో. కొడుకు భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీలో మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో చేర్పించి, సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు అప్పారావు. లక్షలు ఖర్చు చేశాడు గానీ మోహన్ మొదటిసారి పరీక్షల్లో పాసవలేదు. కలెక్టర్ కాలేకపోయాడు.

అయినా పట్టు వదలకుండా కొడుకు మీదున్న ప్రేమతో మరికొన్ని లక్షలు ఖర్చు చేసి సివిల్స్ కోచింగ్‌లోనే రెండు మూడు సంవత్సరాలు ఉంచాడు మోహన్ని అప్పారావు. మూడో ప్రయత్నంలో మోహన్ సివిల్స్‌లో టాపర్ అయ్యాడు. కర్ణాటకలో జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. బెంగుళూరులో ట్రైనింగ్ కలెక్టర్‌గా జాయినయ్యాడు. అప్పారావు ఊర్లో సంబరాలు చేశాడు. ఊర్లో వాళ్లతో పాటు బంధుమిత్రులందరినీ పిలిచి విందు ఏర్పాట్లు చేశాడు. మోహన్‌కి చదువు చెప్పిన ఉపాధ్యాయులందరినీ స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. గురు దక్షిణ అంటూ తన తాహతుకు తగ్గ బహుమతులు ఇచ్చి ధన్యవాదాలు తెల్పాడు అప్పారావు. మోహన్ ట్రైనింగ్ పూర్తయింది. కర్ణాటకలో ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. కోచింగ్‌లు, పరీక్షలు, ట్రైనింగ్‌లు, ఉద్యోగాలు పేరిట మోహన్ చాలా బిజీగా ఉండడంతో సుమారు ఐదు సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులను చూడడానికే రాలేదు మోహన్.

కొడుకు ఉద్యోగంలో చేరాడు. సెలవు తీసుకొని పది రోజులైనా మన ఊర్లో ఉంటాడని ప్రకటించుకున్న అప్పారావు ఆశలు అడియాశలుగానే మిగిలాయి. మోహన్ పుట్టిన ఊరు రాలేదు. ట్రైనింగ్‌లో పరిచయమైన అపర్ణ అనే సివిల్స్ టాపర్‌ని పెళ్లి చేసుకున్నాడు మోహన్. అపర్ణని ఒప్పంచి తల్లిదండ్రుల్ని చూడడానికి మొక్కుబడిగా ఊరు వచ్చాడు మోహన్. చెప్పా చెయ్యకుండా పెళ్లి చేసుకున్న కొడుకు మీద కోపం పడలేదు అప్పారావు. ‘‘పెద్ద ఉద్యోగి కదా! వాడికి ఏది మంచో, ఏది చెడో తెలుసుకదా అందుకే వాడిని ఏమీ అనలేను’’ అంటూ బంధుమిత్రులకు సమాధానమిచ్చేవాడు అప్పారావు.

శారద మాత్రం కొడుకు తమని మోసం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించి గంభీరంగా ఉండిపోయేది గానీ కొడుకుపై ప్రేమవల్ల ఏమీ అనేది కాదు. మొక్కుబడిగా పొడిపొడిగా మాట్లాడుతూ కేవలం రెండంటే రెండు రోజులే ఉండి కర్ణాటక వెళ్లిపోయాడు మోహన్ భార్యని తీసుకుని. కాలగర్భంలో కొన్నాళ్లు గడిచిపోయాయి. మోహన్ తల్లిదండ్రులకు నెలకు పదివేల రూపాయలు మాత్రమే పంపేవాడు. ‘‘ఇక ఆటోలు గీటోలు అంటూ నా పరువు తీయకండి, ఇల్లు ఉంది, నేను పదివేలు పంపుతున్నాను, ఇక మిగతా జీవితాన్ని హాయిగా గడిపేయండి’’ అంటూ ఒకరోజు ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి.

‘‘అమ్మకు బాగా సుస్తీ చేసింది బ్రాండెక్స్‌లో పని చేయడం వల్ల దారం పోగుల ధూళి, దుమ్మి గుండెల్లో చేరి ఆమెకు టీబీ సోకినట్లు డాక్టర్లు చెప్పారు. నువ్వు వచ్చి చూసిపో నాయినా, మాకున్నది నువ్వు ఒక్కడివే కదా!’’ అని అప్పారావు ఫోన్ చేస్తే,‘‘ఒక యాభై వేల రూపాయలు పంపుతున్నాను. వైజాగ్‌లోని మంచి ఆసుపత్రిలో చూపించండి ఫర్వాలేదు, నేను వీలు చూసుకొని వస్తాను’’ అని సమాధానమిచ్చాడు మోహన్. ఆరు నెలలు గడిచింది. డబ్బులు మాత్రమే పంపేవాడు గాని తల్లిని చూడడానికి వచ్చేవాడు కాదు మోహన్. రోగం ముదరడంకన్నా, కొడుకు తీరుకే మానసిక రోగం ముదిరి శారద కన్నుమూసింది.

విషయం తెలిసినా ‘‘నేను ఢిల్లీలో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను- శవాన్ని ఉంచవద్దు మన ఊరువాళ్ళు ఒప్పుకోరు, నేను తప్పకుండా రేపు వస్తాను, రుూలోగా జరగవలసిన తంతు పూర్తి చెయండి’’ అని ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి. కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో అప్పారావు బంధుమిత్రుల దగ్గర కొడుకుని చులకన చేయకుండా ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుండి ఎలా రాగలడు, నేనే తంతు పూర్తిచేస్తానులే’’ అంటూ భార్య అంత్యక్రియలు జరిపించేశాడు. మర్నాడు మోహన్ వచ్చాడు, లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో అతి కష్టం మీద ఒక రోజు ఉండి తల్లికి పిండప్రదానం జరిపించేసి హడావుడిగా పోయాడు.

‘‘పదోరోజు పెద్ద కర్మకి తమరు ఉండాలి బాబు’’ అని పంతులు గారు అంటే, ‘‘ఎందుకండి అంత సెంటిమెంట్ మూడో రోజు నేనే పిండ ప్రదానం చేశాను కదా! నేను జిల్లా కలెక్టర్ని నాకూ వేరే బాధ్యతలుంటాయి గదా, అయినా మా నాన్న ఉన్నాడు ఆయన చేత పదో రోజు పెద్ద కర్మ తంతు జరిపించండి ఖర్చుకు వెనుకాడవద్దు గ్రామంలోని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి’’ అంటూ ఒక 50 వేల రూపాయలు దగ్గర బంధువులకు అందించి, వెళ్లిపోయాడు. అయినా అప్పారావుకి కొడుకు మీద కోపం రాలేదు. ‘జరిగిందేదో జరిగిపోయింది, పోయిన నా శారద మరి రాదు కదా వాడినెందుకు ఇబ్బంది పెట్టడం వెళ్లనివ్వండి’ అంటూ కొడుకుని సాగనంపాడు అప్పారావు.

కాలగమనంలో అప్పారావు ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడిపాడు. ఆర్థిక ఇబ్బందులు లేవుగాని, మానసిక ఇబ్బంది అతన్ని కుంగదీసింది. కొడుక్కి ఇద్దరు కొడుకులు పుట్టారు. మనవలు పుట్టిన తరువాత, వాళ్లని తీసుకుని ఊరు రమ్మనమని మోహన్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది.

కొడుకు తడిగుడ్డతో పీకలు కోసే రకం అని అప్పుడర్థమయింది అప్పారావుకి ‘్భర్య శారద ఎంత మొత్తుకున్నా ఇల్లూ, వళ్లూ గుల్ల చేసుకుని కొడుకుని పై చదువులు చదివించినందుకు ఫలితం అనుభవించక తప్పదు’ అనుకుంటూ విషయం ప్రాణ స్నేహితులకి కూడా చెప్పకుండా లోలోపలే కుంగిపోయేవాడు అతడు- మోహన్ మిత్రుడు ఊరు సర్పంచ్ సత్యం నాయుడు పదేపదిసార్లు ఒత్తిడి చేసి ‘‘మీ నాన్నను ఒకసారి నీ దగ్గరకు పిలు, మనవల్ని కళ్లారా చూసి, వాళ్లతో ఆడుకోవాలని కోరికతో ఉన్నాడు’’ అని బలవంతం చేయడంతో ‘‘అయితే నువ్వు అతన్ని బెంగుళూరు పంపే ఏర్పాటు చెయ్యి రిజర్వేషన్ చేయించి ట్రెయిన్ ఎక్కించేస్తే నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను’’ అని మోహన్ కనాకష్టం మీద అనగానే అప్పారావును ట్రెయిన్ ఎక్కించాడు. అప్పారావుని ఇంటికి తీసుకెళ్లడానికి మోహన్ ఇంటి పని మనుషులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు.

అప్పారావు గుండెల్లో పండగ, మనవల్ని చూశాడు, మురిసిపోయాడు, కానీ చేరిక, పరిచయం లేకపోవడం వల్ల వాళ్లే అప్పారావుకి దూరంగా పోతుండేవారు. కొడుకు దగ్గర అప్పారావు నెల రోజులున్నాడు. ఒక రోజు మోహన్ భార్య కావాలనే మోహన్‌తో గిల్లికజ్జాలు పెట్టుకొని గొడవపడింది. ఆ గొడవలో మాటామాటా పెరిగి ‘‘మీ నాన్న ఇక్కడ ఉండడానికి వీలులేదు, ప్రతి అడ్డమైనవాడిని ఉంచడానికి ఈ కొంపేమీ అనాథ శరణాలయం కాదు, మీ నాన్నని ఊరు పంపకపోతే నేనూ నా పేరెంట్స్‌ని తెచ్చి ఇంట్లో ఉంచుతాను. అయినా నీకూ నాకు నప్పడం లేదు మనం వేరువేరుగా ఉందాం, నీ తండ్రితో నువ్వు ఉండు, నా పేరెంట్స్‌తో నేను ఉంటాను’’ అని తీవ్ర స్వరంతో చెప్పింది మోహన్‌తో. భార్య దగ్గర లొంగిపోయాడో, కావాలనే నాటకం ఆడాడో తెలీదుగానీ ‘‘నేను సుఖంగా ఉండాలంటే నువ్వు మనవూరు వెళ్లిపోవాలి నాన్న’’ అంటూ తండ్రిని బ్రతిమిలాడాడు మోహన్.

‘‘నేను నీ దగ్గర ఉండిపోవడానికి రాలేదురా. ఏదో కొద్ది రోజులుండి పోదామని, పిల్లల్ని చూడాలని వచ్చాను. ఇక నేను వెళ్లిపోతాను. అక్కడ మన ఇల్లు, మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడే నాకు బాగుంటుంది. నా గురించి ఆలోచించకు, నువ్వు నీ పెళ్ళాంతో గొడవపడకు, బహుశా నేను పల్లెటూరి వాడినికదా, నా వేషం, భాష, నా మాటలు ఆమెకు నచ్చకపోవచ్చు. నా గురించి దిగులుపడకు నువ్వూ నీ కుటుంబం హాయిగా ఉండండి. మీరు గొడవలు పడితే పిల్లలు బెంగపెట్టుకుంటారు’’ అంటూ ఊరు బయలుదేరాడు అప్పారావు. జనరల్ బోగీల్లో ప్రయాణమైతే కూర్చోడానికి సీటు దొరక్క నిద్రపట్టక కిక్కిరిసిన జనాలుతో సందడిగా ఉండేది. కొడుకు బిక్షవల్ల అప్పారావుకు థర్డ్ ఏసిలో సీటు దొరికింది. ఎసి చల్లదనంవల్ల అప్పారావుకి మగత నిద్ర పట్టింది. నిద్రలోకి జారుకోకముందే భార్య గుర్తుకొచ్చింది.

‘‘పాపం పిచ్చిది. ఏనాడూ రిజర్వేషన్ పెట్లో కూకోలేదు. పైగా ఎసి అంటేనే దానికి తెలీదు. కొడుకు కుటుంబం గురించి, పిల్లల ముచ్చట గురించి చెబితే మురిసిపోయి ఉండేది. కానీ అది ముందు చావడమే మంచిదయింది. కొడుకు, ఇద్దరు కొడుకుల తండ్రి, జిల్లా కలెక్టర్ అన్న ఆనందం కన్నా... మంచీ మర్యాద లేని ఆడదాన్ని పెళ్లాంగా చేసుకున్నాడనే దిగులుతో అది గుండాగి చచ్చి ఉండేది. కొడుకు తడి గుడ్డలతో పీకలు కోసే రకం అని తెలిసి కత్తితో పొడుచుకుని చచ్చి ఉండేది. అయినా కొడుకు బంగారు పల్లకిలో పోతున్నా నాకు ఆడు ముళ్ల కంపల మీద కూర్చున్నట్లు కనిపిస్తున్నాడు. భగవంతుడా ఆడిని ఓ కంట కనిపెట్టు, నా కొడుక్కి ఏ కష్టమూ రాకుండా చూడు’’ అని మనసులోనే ప్రార్థన చేసుకుని కునుకు తీశాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు అప్పారావు... మరి లేవలేదు. శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Tragedy