నేలపై
నేలపై
నేలపై నాలుగు వాక్యాలు ఆరబోశాం
మనుషులు నింగిలో చేరినా తోడుంటాయని
వాటిని వెన్నెల్లో వెతుక్కుంటూ బ్రతుకుతూ
ఆ సుందర దృశ్యాన్ని తాకేందుకు రాస్తున్నాం ..
కాలం నేర్పుతుంది నిత్యం గురువుల్లా
కల్పితాలు లేని కావ్యాన్ని సృష్టించమని
రెండు కళ్ళు చూస్తూనే ఉన్నాయి అనుక్షణం
అద్దంలో బందీ కాకుండా నిజం కావాలని..
కలం ఎప్పుడూ దర్పాన్ని ప్రదర్శిస్తుంది
కాలానికి ఆయుష్షును అక్షరం ఇస్తుంది కాబట్టి
మంచి చెడుల మధ్య యుగములా నిలిచింది
సంఘం నిద్రావస్థను మేలుకొలుపుతూ సాగింది..
ఏదైతే ఏమి నిప్పుల కుంపట్లను
నీటి తొట్లను సమానం చేసుకుంటూ పోతుంది
అవసరానికి విశ్వరూపాన్ని చూపిస్తూ
గీతోపదేశములా మనిషి జీవితాన్ని మార్చేందుకు..
కార్చిన చుక్కలే తలరాతనైతే
వాల్మీకంలో నుంచి రామాయణం సృష్టించే
వేదనే కావ్యంగా నేలపై రాజసంగా వెలుగొందే
అక్షరమే దైవంగా భూమిపైన నిలబడింది..
అష్టాదశ వర్ణాలు నెమలి పింఛాల్లా విరాజిల్లే
సప్తవర్ణాలు వసంతాల సంబరాలు చేసుకొని
సప్త స్వరాలు ప్రకృతితో పారవశ్యమయై
కవులు మహా కావ్యాలతో వినోదం గావించిరి..
బాటలో మాటలై పదాలు పద్యమై సాగుతూ
కాలం సాధించే పరమార్ధానికి తోడుగా నిలిచే
అభ్యున్నతికి ఆయువును పోసుకుంటూ
భవితవ్యానికి ఒక దిక్సూచిలా దారులు చూపించేను..