తారతమ్యం
తారతమ్యం


ఏంటమ్మా సువిధా.....!!! బాగానే ముస్తాబయినట్టున్నావు....అడగద్దు కానీ ఎక్కడిదాక ప్రయాణం..??? అంటూ ఆరాలు తీయసాగింది ఇంటిపక్కనే ఉంటున్న సావిత్రమ్మ.
మా చుట్టాలమ్మాయి పెళ్లి లెండి అంగరంగ వైభవంగా చేస్తున్నారట....
అవునా ....!! మరి ఇంటిల్లిపాది వెళ్లకుండా ఒక్కదానివే వెళ్తున్నావేంటి...???? అని అడిగింది సావిత్రమ్మ.
అవును పిన్నీ గారు మా ఆయనకి ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. మా పిల్లలు సమ్మర్ వెకేషన్ అని వాళ్ళ స్కూల్లో నిర్వహించే సమ్మర్ క్యాంపు కెళ్లారు.
నేనొక్కదాన్నే వెళ్ళాలి ఎండలేమో మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే భయంగా ఉంది .
సరేనండి పిన్ని గారు తిరిగి వచ్చాక మళ్ళీ కలుస్తాను అని బయల్దేరింది సువిధా.
ఆ రోజు దాదాపు రాత్రి 10గం. అయింది పెళ్లి వేడుక నుండి ఇంటికి వచ్చేసరికి. చాలా అలసిపోయి ఎదో దీర్ఘంగా ఆలోచనల్లో పడి అలానే నిద్రపోయింది.
****
మరుసటి రోజు సావిత్రమ్మ గారు సాయంకాలం కబుర్లు పెట్టడానికి సువిధా దగ్గరికి వచ్చింది.
ఏమైంది అమ్మాయి ....!!!
అప్పుడే వచ్చేసావ్...??
మీ దగ్గరి బందువులన్నావ్....!!!
పెళ్లి బాగా జరిగిందా.....??
అని ఎడతెరపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది సావిత్రమ్మ.
అయినా కూడా సువిధా వేటికి సమాధానం ఇవ్వకుండా ఆలోచనల్లో ఉండిపోయింది.
వెంటనే ఆలోచనల నుండి తేరుకొని ,,,
ఆ... పిన్ని గారు !!
ఏదో పరధ్యానంలో పడ్డాలేండి. పెళ్ళికేం బ్రహ్మాండంగా జరిగింది. పాత బంధాలు, కొత్త పరిచయాలు, అన్ని బాగానే జరిగాయి.
ఇంకేం ..... మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావ్ మరి...???
కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి....
ఒకప్పుడు పెళ్లి లాంటి ఏ వేడుకల హడావుడి అయినా నెల ముందు నుండి , కొంచెం సౌకర్యాలు పెరిగాక 10, 15 రోజుల నుండి హడావిడి ఉండేది.
ప్రస్తుతం ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఇళ్లల్లో అయితే హడావుడి ,టెన్షన్ పడడం అవసరమే లేదు.
అన్ని చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ అని, క్యాటరింగ్ అని ఇలా ప్రతిదీ వాళ్ళు చేసి పెడతారు.
నేను వెళ్లిన పెళ్లి చాలా బాగా జరిగింది .అదొక పెద్ద ఏ.సి ఫంక్షన్ హాల్ , వేల సంఖ్యలో హాజరయ్యారు,కానీ చాలా నిశ్శబ్దంగా జరిగిపోయింది.
అదొక బిజినెస్ మీటింగ్ లా అనిపించింది. ఏం మాట్లాడినా ఎవరు ఏమనుకుంటారో అని, వాళ్ళ లాగా మనం లేమేమో అని, చాలా రకాల ప్రశ్నలు అందరిలో మెదిలాయి.
అదేంటీ అమ్మాయి అలా మాట్లాడుతున్నావ్ ???
అవునండి పిన్ని గారు....
అన్ని హంగులతో, ఆర్భాటాలతో పెళ్లి వేడుక జరిగింది. వచ్చిన వాళ్లు వాళ్ల తాహత్తు కు తగ్గట్టుగా కట్నకానుకలు సమర్పించుకున్నారు. కానీ అందరూ ఒకేలా ఉండరు కదండీ.
చిన్న మొత్తంలో కట్నం చదివిస్తే చులకనగా చేస్తారేమో అని, పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో చదివిస్తారు. వచ్చిన బందువులేమో పలకరింపుల కన్నా ఎక్కువగా వాళ్ళ ఆస్తులు, వీళ్ళ అంతస్తుల గురించే ఆరాలు తీస్తూ ఉంటారు.
చుట్టరికాలు అంటే అమ్మ తరపు బంధువులు,నాన్న తరుపు బంధువులు అనే అర్థం మాయమై ఉన్నవాళ్లు మనవాళ్ళు ,లేనోళ్లు పరాయి వాళ్ళు అన్న కొత్త అర్థాలు పుట్టుకొచ్చాయి.
కాదు కాదు....
మనకి తెలీకుండానే మనం ఆ వ్యవస్థ కి అలవాటు పడిపోయాం. ఒకర్ని చూసి ఇంకొకరు , ఇంకొకళ్లని చూసి మిగతా వాళ్ళు అలా మనకేం తక్కువ అంటే మనకేం తక్కువ అని ఆలోచనల్లో కూడా అలా అలవాటు పడిపోయాం.
ఈ పెళ్లి ఒక్కటే కాదు పిన్ని గారు...వారం రోజుల క్రితం వెళ్లిన ఒక ఫంక్షన్ లో కూడా ఇంతే...వాళ్ల గొప్పలు ప్రదర్శించడం వల్ల వాళ్ళ ముందు మనల్ని మనం తక్కువగా భావించడం చాలా మందిలో చూసాను.
చాలా సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే మనం అతిథులుగా వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎంత బాగా చేసిన మేము ఉన్నవాళ్ళం కదా అందుకే ఆ మాత్రం చేయకపోతే ఎలా....!!!!! అన్నట్టుగా చూసి వెళ్ళిపోతారు.
మనల్ని ఎవరు అనరు అలా అని మనం అందరి కంటే తక్కువ కాదు , మనకున్నంతలో మనం సంతోషంగా, తృప్తిగా ఉంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నామెమో అని అనిపిస్తుంది.
ఈ తారతమ్యాల వల్ల మన వరకు మనం సర్దుకుపోతున్నాం. కానీ మన భావితరాలకు, ఏ విలువలు , అనుబందాలు తెలవకుండా అయిపోతాయేమో అని భయమేస్తోంది.
ఇప్పటికే పెద్దవాళ్ళు ఉండే తీరును గమనిస్తున్న పిల్లల్లో కొంతమందికి మంచి
నడవడిక అలవడిన, చాలా మందిలో ఎదుటివారి మాటను
మనమెందుకు వినాలి అన్న ఆలోచన పెరుగుతుంది. మాకేంటి మేము ఉన్నవాళ్ళం మాకేదైన నడుస్తది అనుకునే వాళ్ళు లేకపోలేదు.
అక్కడ అంతమంది జనాలు వచ్చినా కూడా ఎవరి గోల వారిది ,ఎవరి గొప్ప వాళ్ళది. అందుకే ఆ గోల భరించలేక వెంటనే తిరుగుపయనమయ్యా.
ఇంకా నయం మా ఆయన్ని, పిల్లల్ని వెంటబెట్టుకుపోయే పరిస్థితి రాలేదు.
అప్పటికి మా వారు అంటూనే ఉన్నారు.... అక్కడికి వెళ్లకపోతే వచ్చే నష్టమేమీ లేదుగా.....!!! అక్కడి వ్యవస్థ, ఇంకా వాళ్ళ మాటలు చాలా చులకనగా ఉంటాయి అని వివరించిన వినక వెళ్ళాను కదా...!!! అందుకే ఇపుడు బాధపడుతున్న అని అనగానే..... సావిత్రమ్మ....
నువ్వన్నది నిజమేనమ్మా...!!! మా కాలానికి, ఈ కాలానికి చాలా మార్పులొచ్చాయి. ఆ కాలంలో మనిషికి విలువనిచ్చారు, ఈ కాలం మనిషి వెనకున్న డబ్బుకే విలువ.
కానీ అందరూ అలా లేరే తల్లి...!!! అది మన కుటుంబ పరిస్థితులు, మనం నేర్పే తీరు కూడా కారణం.
కష్టపడి సంపాదించి కోట్ల సంపాదనతో ఒక స్థాయికి ఎదిగిన మనిషి వంద మందికి ఉపాధి కల్పిస్తే ఆ వంద మంది ఇంకో వంద మందికి ఆదర్శమై నిలుస్తున్న సందర్భాలు లేకపోలేదు.
అందులో కొంత మంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ, పది మందికి చేయూతనిస్తూ మనలో ఒకరిగా, మేమే గొప్ప అనే అహంకారం చూపించనివ్వక కలిసిపోయేతత్వం ఉన్నవాళ్లు ఉన్నారు.
అలా నిరాడంబరంగా,నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అందరూ నువ్వు అన్నట్టు ఉండి ఉంటే సమాజం ఇప్పటికి ఇంకా భ్రష్టుపట్టి పోయుండేది.
నువ్వు చూసిన వ్యవస్థ అక్కడ అలా ఉంది. నువ్వు బాధపడకు. మనం మన పిల్లల్ని ఎదుటివారికి ఆదర్శనీయంగా,పిల్లలకి నైతిక విలువల్ని చెప్తూ పెంచడం మన వంతు భాద్యత....
సరేనమ్మా...... చూస్తుండగానే భోజనాల సమయం అయింది . మనుమరాళ్లు, పిల్లలు నా కోసం చూస్తున్నట్టున్నారు అని హడావిడిగా వెళ్ళిపోయింది సావిత్రమ్మ.
పిన్ని గారి మాటల్లో నిజం ఉంది అనుకుంది సువిధా......!!!
అందరూ అలా ఉండకపోవచ్చు. నాణేనికి ఒక వైపుకు మాత్రమే నేను చూసానేమో అని అనుకోని పిల్లల విషయంలో తన వంతు భాద్యతను, పెంపకంను గుర్తుకు తెచ్చుకొని, తను ఎలా , ఏ విధంగా ఉండాలి అని , మంచిగా ఆలోచించడం వల్లే మంచి సమాజం ఏర్పడుతుంది కదా అని అనుకుంటు..... తన పనిలో మునిగిపోయింది.
★★★
21వ శతాబ్దంలో ఉండి పురోగతి లో మనం ముందున్నామని విజయ గర్వంతో పొంగిపోతున్నాం.
దశాబ్దాలు గడుస్తున్న కొలది విన్నూత్నమైన ఆలోచనలు, కొత్త రకమైన, సులభతరమైన విధానాలు ప్రతిక్షణం మనిషిని మెదడులో పురివిప్పుతూనే ఉన్నాయి.
సాంకేతిక పరంగా, విజ్ఞాన పరంగా , ఇంకా ఎన్నో రంగాల్లో మగవాళ్ళతో సమానంగా మహిళలుగా మనం కూడా ఆర్ధికంగా అభివృద్ధి చెందడం అనేది హర్షించదగ్గ విషయం.
సంపాదన పెరుగుతుంది, ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి. దానికి తోడు మనిషికి ఆశ పెరుగుతోంది ,ఆస్తులు పెరుగుతున్న కొలది మనిషికి మన స్థాయి ని చూపించుకోవాలని ఆతురత పెరుగుతుంది.
ఆ క్రమంలో చిన్న చిన్న విషయాలను కూడా మనం మర్చిపోతున్నాం. అన్ని సౌకర్యాలతో ఏ లోటు లేకుండా ఉంది అనుకుంటున్నాం కానీ దానితో పాటు బందాల మధ్య నాణ్యత, విలువ తగ్గుతుంది అన్న విషయం మర్చిపోతున్నాం.
అలా మనుషుల మధ్య ఎక్కువ, తక్కువ అన్న తారతమ్యాలు ఏర్పడుతున్నాయి.
అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదగాలి. మన స్థాయి కి తగ్గట్టుగా ఠీవిగా ఉండడం తప్పుకాదు. ఆ క్రమంలో పైసా ఉంటే ఎదుటివాళ్ల ను శాసించగలం అని అనుకోవడం తప్పు.
మనం చేసే ఆర్భాటాలు ఎదుటి వ్యక్తి ప్రశంసలు , సంతృప్తి పొందేలా ఉండాలి.
మనలో నిజాయితీ, నిక్కచ్చితనం ఉన్నపుడు ఎంతటి గొప్ప మనిషైనా సరే మన మాటకు తలొగ్గుతారు. అయితే ఎంత ఎదిగిన ఒదిగే ఉండాలి అని మర్చిపోవద్దు.
మంచి మాట ,ఆత్మీయతతో కూడిన పలకరింపు, గౌరవంతో ఇచ్చే మర్యాద, తరతరాలను చూస్తూ అన్ని అనుభవాలను కడుపులో దాచుకున్న పెద్ద వాళ్లు ఇచ్చే ఆశీర్వాదం వీటిని ఎన్ని కోట్లు ఇచ్చిన సంపాదించలేం.