మథుర స్మృతులు
మథుర స్మృతులు
చిన్న నాటి జ్ఞాపకాల్లో మా నానమ్మ జ్ఞాపకాలు నాకు చాలా విలువైనవి. తానేమీ చదువుకోక పోయినా మాకు ఎన్నో మంచి విషయాలు కథలుగా చెప్పేది.
మా బాబాయిలు, పెదనాన్న లు ఎవరేం తెచ్చినా ముందు మా అందరికీ పంచి పెట్టేది. కోడళ్ళకి పెడితే కొడుకులు తిడతారని
"లక్ష్మీ, కొంచెం మంచి నీళ్ళు పట్టుకురా, దాహంగా ఉంది." అని
పిలిచేది. ఏం కోడలు వచ్చినా తాను పెట్టాల్సింది గమ్మున వారి
చేతిలో పెట్టి వెళ్ళమని సైగ చేసేది.
మాకు కూర్చో పెట్టి రాముడు, కృష్ణుడు కథలు చెప్పేది. అవి ఎంత బాగా చెప్పేదంటే మేమంతా "ఇంకా చెప్పు నానమ్మా,"
అని గొడవ చేసేవాళ్ళం.
కృష్ణుని కథల్లో 'చల్దులారగించుట' అనే కథ వర్ణించి వర్ణించి
చెప్పేది. ఆ కథను ఎన్నిసార్లు చెప్పినా వింటూనే ఉండేవాళ్ళం.
"కృష్ణుడు తన తోటి గోపాలకులతో కలిసి ఆవుల్ని మేపడానికి
వెళ్ళేవాడు. అప్పుడు వాళ్ళమ్మ యశోద కృష్ణునికి కూడా చద్ది
కట్టి ఇచ్చేది." ఇలా చెప్తూ ఉండేది నానమ్మ.
మధ్యలో ఒక మనవరాలి ప్రశ్న " నానమ్మా, కృష్ణుడు నందరాజు
కొడుకు కదా, అతనెందుకు ఆవుల్ని మేపడం, వాళ్ళకి పని వాళ్ళు లేరా."
" ఆ కాలంలో ఇలాంటి తేడాలు ఉండేవి కాదమ్మా. అందరూ కలిసికట్టుగా ఉండేవారు. కృష్ణుడు తన చద్ది అందరితో పంచుకొనే వాడు. అందరి దగ్గర తనూ తినేవాడు. అప్పట్లో ఈ ఎక్కువ
తక్కువ లు లేవు." అంటూ కృష్ణుని గురించి బోలెడు కథలు
చెప్పేది.
కృష్ణ నామం తరచూ విని విని ఆ పేరు పట్ల నాకు విపరీతమైన ప్రేమ పెరిగి పోయి పెద్దయ్యాక 'ఆ పేరు గల వాడిని పెళ్ళి చేసుకోవాలి, లేదా ఆ అబ్బాయి కి ఏం పేరున్నా "కృష్ణ'" అని
మార్చేయాలి' అనుకునే దాన్ని. 'మగవాడి పేరు మార్చిన మొదటి అమ్మాయి గా పేరు తెచ్చుకోవాలని' కలలు కనేదాన్ని
కానీ నాకు మా వారు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన పేరు కృష్ణ. ఇంకా నాకు మార్చే అవకాశం ఏది? పోనీ లే, కోరుకున్నా పేరే కదా అని తృప్తి పడిపోయా