kottapalli udayababu

Drama Action Inspirational

3.4  

kottapalli udayababu

Drama Action Inspirational

చూపుడు వేలు (కథ)

చూపుడు వేలు (కథ)

8 mins
10


చూపుడు వేలు (కథ)

‘’ఏవండీ ఓసారిలా ఇలా వస్తారా?’’ వంటగది గుమ్మంలోంచి  భర్తను పిలిచింది ఉమా మహేశ్వరి.


‘’ఆ! వస్తున్నా!’’ అంటూ విసుక్కుంటూ వచ్చి “ఏమిటి నీ నస?’’ అని ఉరుముతూ అడిగాడు చక్రధరం.


‘’అది కాదండీ మీరు చేస్తున్నది తప్పని నా మనసుకు అనిపిస్తోంది. మీరు మరొకసారి ఆలోచించండి’’ అని భర్త చేతికి రెండు టీ కప్పులు ఉన్న అందించింది .


 ‘’ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది? మనం ఇలా ప్రతి దానికి సంశయిస్తూ ఉండబట్టే ఆ డబ్బంతా మా తమ్ముడికి దోచి పెట్టేస్తోంది మా అమ్మ. ఇంతకంటే మంచి మార్గం లేదు. జరిగేదంతా రెండు కళ్లతో చూస్తున్నా నన్న ఆ విషయం కూడా మర్చిపో’’


 ‘’అది కాదండీ. అత్తయ్య గారికి ఒళ్లు తెలియని జ్వరంతో మంచం లో పడి ఉన్నప్పుడు మీరు ఈ పని చేశారని ఆవిడకి తెలిస్తే మనం మోసం చేశామని బాధపడతారు. ఆమె మనసును బాధ పెట్టడం ఇంటి పెద్ద కొడుకుగా మీకు ధర్మము కాదు, మనకు జయం అంతకన్నా కాదు.’’ బతిమిలాడుతున్నట్లు గా అంది ఉమ.


‘’ఇందుకేనా పిలిచింది? మళ్ళీ మళ్ళీ పిలిచి డిస్టర్బ్ చేయకు.’’విసుక్కుంటూ హాల్ లోకి వెళ్ళిపోయాడు చక్రధరం.


ఉమామహేశ్వరి వచ్చి అత్తగారి ముందు ఫైబర్ స్టూల్ మీద కూర్చుంది. ఎదురుగా భర్త హల్లో దామోదరం గారితో సీరియస్ గా చర్చిస్తూ ఎలా చేస్తే ఈ పని బెడిసి కొట్టకుండా ఉంటుందో అలా ఆయన చేత కాయితాలు రాయిస్తున్నాడు.


ఉమ అత్తగారికేసి చూసి యధాలాపంగా నుదిటి మీద తడి ఆరిపోయిన గుడ్డతీసి ఉడుకు లాన్ లో ముంచి పిడిచి ఆమె నుదుట మీద వేసింది.


రోహిణమ్మగారి ఒళ్ళు సలసల కాగిపోతోంది. అదేం చిత్రమో! సాయంకాలం అయ్యేసరికి జ్వరం పేలిపోతోంది. ఈయన ఆ పనేదో తొందరగా ముగించేస్తే బాగుండును. ఆలోచనలో పడిపోయింది ఉమామహేశ్వరి.


జిల్లా పరిషత్ హైస్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ గా తనకు ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే మున్సిపల్ ఇంజనీర్ గారి ప్రధమ పుత్రుడైన చక్రధరరావు తో తన వివాహం జరగడం, చక్కని సాంప్రదాయ కుటుంబం నుంచి అంతకంటే సంప్రదాయ కుటుంబంలో పెద్ద కోడలిగా అడుగు పెట్టడం జరిగింది.


అప్పటికి బాలకృష్ణ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. భర్త టెలికమ్యూనికేషన్స్ లో ఎ.యి.గా జాబ్ చేస్తున్నాడు. ఆడపడుచులు ఎలాగా లేరు. అత్తగారు ఎంతో సౌమ్య రాలు. తనను ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.


మున్సిపల్ ఇంజనీర్ గా ఎంతో డబ్బు ఇతరత్రా సంపాదించే అవకాశం ఉన్నా, నీతికి నిజాయితీకి మారుపేరైన మామగారు ఆ ధ్యేయంతోనే ఉద్యోగం చేశారు. పెద్ద కొడుకును అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివించిన ఆయన రెండవ కొడుకు దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేశారు.


తీవ్ర మనస్థాపానికి గురి కావడంతో సివియర్ హార్ట్ఎటాక్ వచ్చి మరణించారు. ఆయన హఠాత్తుగా మరణించడంతో రోహిణమ్మ గారు బాగా కుంగిపోయారు. ఆవిడను తాను మంచి మాటలతో ఈ లోకంలోకి తెచ్చేసరికి బాలకృష్ణ చదువు కూడా పూర్తయింది.


అనుకోకుండా తండ్రి స్నేహితుడు తను పని చేస్తున్న ఫ్యాక్టరీలో డైలీ లేబర్ జాబ్ ను బాలకృష్ణకు ఇప్పించాడు.


సరిగ్గా ఆ రోజుల్లోనే అత్తగారి తమ్ముడు వచ్చి తన కూతురు వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. తమ్ముడు బీద పరిస్థితిని చూసి అతనికి ఏమైనా సహాయం చేయమని తన భర్తను కోరారు అత్తగారు.


 అప్పటికే తమ్ముడు డైలీ లేబర్ గా చేయడం నచ్చకపోవడం, తాను కోరుకోకుండానే లక్ష్మీదేవి లంచాల రూపంతో రావడం, భార్యగా తాను సంపాదించే జీతం, వీటన్నిటి ధన గర్వంతో ఉన్న తన భర్త ‘’ నా దగ్గరెముందమ్మా నీకు తెలియనీది? ‘’ అనడంతో తనకే బాధ కలిగింది. అప్పుడే తనను హెచ్చరించారు ఆవిడ.


 ‘అమ్మ ఉమా! వాడికి కళ్లముందు నోట్లు నిండుగా కనిపిస్తూ ఉండడం తో ఎదుటి వాడి బాధ అర్థం చేసుకునే శక్తిని కోల్పోయాడు. వాడిని నీ కంట్రోలులో ఉంచుకోకపోతే చివరికి నీకు నీ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోతుంది.’’


అప్పటికే తనకు ఇద్దరు పిల్లలు. అంకిత, అక్షిత్ పుట్టేశారు. తాను ఎంత నచ్చ చెప్పినా ఆయనలో డబ్బు పట్ల వ్యామోహం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. తరచూ తాను ఆయనతో దెబ్బలాడుతున్నప్పుడు ఆర్థిక స్వాతంత్రం గల తాను విడిగా బ్రతకాలి అనుకునేది. అందుకు అత్తగారు అంగీకరించేవారు కాదు.


 ‘’ తప్పమ్మా ! ఎవరి జీవితాలు వారు బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ పెళ్లిళ్లు, పిల్లల అనుబంధాలు అనవసరం. పిల్లలు లేకుంటే నేనే నిన్ను ప్రోత్సహించేదానిని. నీ తల్లిదండ్రుల పెంపకంలో అమ్మానాన్నల ప్రేమ పొంది   పెరిగిన మీరు పిల్లలకు వాటిని అందకుండా జేయడం ఎంతవరకు న్యాయం ఆలోచించు?’’ అన్నారావిడ.


 ఆవిడ ఎప్పుడూ తన నీ కోడలిగా చూడలేదు. కూతురుగానే మందలించింది.


దాంతో తన భర్త తనతో ఏం చెప్పడానికి ప్రయత్నం చేసినా ‘’ డబ్బు విషయంలో ఏం చేయాలో మీకు బాగా తెలుసు. మీ ఇష్టం వచ్చినట్టు గా చేసేయండి. నాతో ఎప్పుడూ సంప్రదించవలసిన అవసరం లేదూ.’'


తను ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవడంతో అత్తగారి తమ్ముడు కూతురు పెళ్లి, పీటలమీద ఆగిపోయింది. ఆ పెళ్ళికి తను, మరిది, అత్తగారు, పిల్లలు వెళ్లారు. ఆయన రాలేదు. పెళ్లి పందిట్లో కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్న తమ్ముడిని ఓదార్చిన అత్తగారు నిర్ణయానికి వచ్చిన దానిలా తన మరిది దగ్గరకు వచ్చింది.


 ‘’ నాన్న బాలకృష్ణ! నాకు నువ్వు ఒక సహాయం చేసి పెడతావా?’’


‘’ ఏమిటమ్మా అది?’’


‘’ మీ నాన్నగారు ఉండగా నీకు ఘనంగా చదువు చెప్పించి లేకపోయారు. కనీసం నీ పెళ్లి కూడా ఘనంగా చేయలేని స్థితిలో నేనున్నాను. నేను ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి నీ పెళ్లి చేయలేను. నీకు అభ్యంతరం లేకుంటే స్వప్నను పెళ్లాడి ఆమెకు జీవితాన్ని ప్రసాదించు. నీకు ఇష్టం లేకపోతే వద్దు ‘’అన్నారావిడ.


 రెండు నిమిషాలు సాలోచనగా ఆలోచించిన బాలకృష్ణ తల్లి పాదాలకు నమస్కరించి వెళ్లి స్వప్న మెడలో తాళి కట్టాడు. స్వప్న తన తోటి కోడలు అయింది.


 ‘’ఇదే రా తమ్ముడు నేను నీకు చేయగలిగిన సహాయం. ‘’ అన్నారావిడ తన తమ్ముడితో.


 భర్త బతికి ఉండగా తన తమ్ముడు ఏనాడు తమ గడప తొక్క లేదు.


‘’ శ్రీ కృష్ణుడు లాంటి బావ గారి దగ్గరకి అటుకులతో రాలేకపోతున్నాను. ఇంటి ఆడపడుచు గా నీకు ఒక చీర కూడా పెట్టలేని ఈ తమ్ముడిని మన్నించు అక్కా.!’’ అని వ్రాసిన తమ్ముడు ఉత్తరానికి ‘’నీ మనసులో సాంప్రదాయాన్ని నిలబెట్టాలని, దానిని తర్వాత తరం వారికి అంద చేయాలనే తపన ఉంది. ఆ చక్కని ఆలోచనే నీకు శ్రీరామరక్ష’’ అని ఆశీర్వదించారు అత్తగారు.


 ఆ ఏడాది తర్వాత స్వప్న కి బాబు పుట్టాడు. అయితే వాడు మానసిక వికలాంగుడు. దాంతో రోహిణమ్మగారు మరీ కుంగిపోయారు. బాలకృష్ణ ఇలాంటి దెబ్బలు తనకు అలవాటే అన్నట్లు నిర్వేదంగా నవ్వుకుని నిబ్బరంగా ఉండిపోయాడు.


 ఆ మనవడి కోసం ఎన్నో పూజలు యాత్రలు చేశారు ఆవిడ. ఎందరో డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి డబ్బు బాగానే ఖర్చు పెట్టారు. అంతా కేవలం తన భర్త వల్ల సంక్రమించిన సొమ్ముతోనే.


 


సంవత్సరంలో పది నెలల పాటు మరిది ఇంట్లో ఉండి, రెండు నెలలు తమ కోసం , మనవళ్ళ కోసం వచ్చి వెళ్తుంటారు. 


ఇక తమ పిల్లలు ఇద్దరీలో అమ్మాయి స్టేట్ బ్యాంక్ తో ఇంజనీరింగ్ చదువుతోంది. అక్షిత్ కాస్త మందమతి వాడే. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు అబ్బడం లేదు. వాడినుంచి వాడి మనవడి తరం వరకు అవసరమైనంత డబ్బు ఎలాగైనా సంపాదించి ఇచ్చేయాలని భర్త తాపత్రయం. ఆ తాపత్రయంలో అంది వచ్చిన సొమ్మంతా సేకరించి స్థలాలు, నగలు, బంగారం , అపార్ట్మెంట్లు దేని మీద పడితే దాని మీద పెట్టుబడి పెట్టేస్తున్నారు.


ఇప్పుడు తల్లి పేరు మీద ఉన్న ఇల్లు తమ్ముడికి లేకుండా పూర్తిగా తన పేర అత్తగారు తన ఇష్టంతో రాసి ఇచ్చినట్లు పత్రాలు తయారు చేస్తున్నాడు.


 అదే తనకు గరళం మింగినట్టు గా ఉంది.


 అత్త గారిని లేపి చెప్పేద్దామా అనుకుంది. కానీ అసలామే ఈ లోకంలోనే లేనట్టు గా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది.


భర్త వకీలు గారిని తల్లి మంచం దగ్గరకు తీసుకు రావడంతో ఉమా మహేశ్వరి కొంగుతో కడుపు కళ్ళు తుడుచుకుంది.


ఆయన సహకారంతో స్పృహ లేని తల్లి చేతి వేళ్ళ మధ్య పెన్ ఉంచి ఆ చేతిని తన చేత్తో పట్టుకుని తల్లి చేత అవసరమైన చోట సంతకాలు పెట్టించాడు చక్రధరరావు.


తర్వాత అన్నీ యధాప్రకారంగా సద్ది పెట్టుకుని కాగితాలు తీసి జాగ్రత్త పెట్టి భార్య సలహా మీద ఫామిలీ డాక్టర్ కి ఫోన్ చేశాడు.


 మరిదికి జరిగిన అన్యాయానికి తన్నుకువస్తున్న బాధను దిగమింగుకుంటూ మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఉమామహేశ్వరి.


 జ్వరం తగ్గుతూనే తమ్ముడు ఇంటికి బయలుదేరి పోయిన తల్లిని చూసి మండిపడ్డాడు చక్రధరం.


‘’ నీకు అనారోగ్యం వచ్చినప్పుడు సేవ చేయడానికి మేం కావాలి. ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆ మతి లేని వాడికి చాకిరీ చేసి డబ్బంతా వాడి మొహాన పెడతావు . ఇదేమన్నా న్యాయంగా ఉందా అమ్మా?’’


 రోహిణమ్మగారు ఉమామహేశ్వరి కేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె కళ్ళతో సైగ చేసి తలదించుకుంది .


 ‘’ఈసారి చిన్నాడీ ఇంటిదగ్గర ఉండగానే అనారోగ్యాన్ని రమ్మని కబురు చేస్తాను లేరా’’ అంటూనవ్వేసి వెళ్ళిపోయారావిడ.


‘’ చూసావా నేను ఏదో కాని పని చేసినట్టు ఫీల్ అయ్యావు. ‘నీకు మాత్రం ఎదిగిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. నా మందుల ఖర్చు నేను పెట్టుకుంటాను అని అనగలిగిందా అమ్మ? ఈ పెద్ద వాళ్ళు ఎవరో ఒకరి మీద ప్రేమ పెంచుకుంటారు.  ఒళ్ళు మండమంటే మండదూ మరి?’’ తల్లి వెళ్ళిపోయాక అన్నాడు చక్రధరం ఉమతో.


‘’ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టి చూస్తారేంటి? డబ్బేనా మనిషికి ముఖ్యం? తల్లి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమానుబంధాలు ఇవేవీ అవసరం లేదా మీకు?’’


 ‘’ పిచ్చి మొహమా! అవి కూడు గుడ్డా పెట్టవు. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఇంత వయసు వచ్చి కాటికి కాళ్లు చాపుఉన్న మా అమ్మను చూడు. అవసరం అయినా ఐదు పైసలు తీస్తుందా ? తీయదు.అది డబ్బు విలువ అంటే! అయిన దానికి కాని దానికి ఆవిడని వెనకేసుకు రావడం కాదు. ఆవిడని  చూసి నేర్చుకో’’ అన్నాడు చక్రధరం.


 ‘’మీరు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మీకు ఏమీ అనారోగ్యం చేయలేదా?’’


 ‘’చేసింది... అయితే?’’


అప్పుడు మీ అనారోగ్యానికి ఖర్చు మీరు మీ అమ్మగారికిచ్చారా?’’


‘’ అది ఎలా వీలవుతుంది? అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. పైగా చదువుకుంటున్నవాడిని. అయినా కన్నందుకు అది వాళ్ళ కనీస బాధ్యత.’’


 


‘’ అలాగే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వాడిని చేసిన ఆ తల్లికి మీరు చేసింది కనీస బాధ్యతేనండి. ఆవిడ మీకు చేసిన దానికన్నా మీరు ఆవిడకి వీసమెత్తు ఎక్కువ చేయలేదు. ఈ జన్మకు చేయలేరుకూడా. మీరు జ్వరంతో కలవరిస్తునప్పుడు తన గుండెలకు హత్తుకుని మీ చేయి తన మెడ చుట్టూ వేసుకుని ‘నేనున్నాను నాన్నా. భయపడకు’ అని ఆమె తానే ప్రపంచ మై మిమ్మల్ని ఓదార్చి ఉంటుంది. కానీ మీరు ఒక్కసారైనా అలా చేయగలిగారా? లేదు. ఎందుకంటే అమ్మ మీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.’’


 ‘’ అంతే!’’ అన్నాడు నిర్లజ్జగా స్థిరంగా చక్రధరం.


“ ఒక్క నిమిషం ఉండండి’’ అంటూ ఉమ తన గదిలోకి వెళ్లి కొంత డబ్బు, ఓ బాంక్ పాస్ బుక్ తెచ్చి అతని చేతిలో పెట్టింది.


‘’ ఇదిగో తీసుకోండి!’’


‘’ఏంటి? అత్తగారు తరపున వకాల్తా పుచ్చుకుని ఆవిడ ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు ఇస్తున్నావా? లేక ఇంకా ఎలాగైనా సంపాదిస్తున్నావా?’’ అన్నాడు హేళనగా.


అందులోని వెటకారం అర్థం అయిన ఉమా నిర్ఘాంతపోయింది.


 “భేష్! మీకు పట్టిన డబ్బు పిచ్చిలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అది మీ అమ్మగారు తన ఆరోగ్యానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బుగా ఇచ్చింది. ఇక ఆ పుస్తకం ఉన్న సొమ్మంతా మీ అమ్మ గారికి మీ నాన్నగారి పెన్షన్ మంజూరు అయిన నాటి నుంచి మన ఇంట్లో ఉన్న కాలానికి ఇచ్చిన సొమ్ము. రేపు మీ కొడుకు ఇంట్లో మీరు అంతా ఆత్మాభిమానంగాను బ్రతక గలరా? డబ్బు మదపిచ్చిలో ఉన్న మీకు పైసా ఇవ్వాలనిపిస్తుండా? ఇవ్వకపోతే మీ కోడలు వూరుకుంటుందా? యే తరానికైనా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది. తెలుసుకోండి’’ అనేసి విసురుగా అక్కడనుంచి వెళ్లిపోయింది ఉమ.


 వీపుమీద ఎవరో చెల్లున చరచినట్టు మ్రాన్పడిపోయాడు చక్రధరం. చిన్న మెదడులో సరి అయిన చోట దెబ్బతగిలి నట్టుగా అయోమయంగా ఆలోచనలో పడిపోయాడు.


********     


 మూడు రోజుల తర్వాత అతనికి తల్లి దగ్గర నుంచి ఒక ఉత్తరం అందింది. చింపి చదవసాగాడు.


 “ చిరంజీవి పెద్ద బాబుకి,


అమ్మ ఆఫీసులు. ఎలా ఉన్నావ్ నాన్న? వేళకు తిను. డబ్బు సంపాదనలో పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎవరో ఒక మంచి కవి చెప్పినట్లు ‘మనిషి రూపాయి సంపాదించడం కోసం కష్టపడతాడు. ఆ రూపాయి తనకు తోడుగా మరో రూపాయిని సంపాదించి పెట్టమని మనిషిని కష్ట పెడుతుంది. చివరికి ఆ కష్టమే అతనిని బలి తీసుకుంటుంది’ అని.


నాకు నువ్వు, నీ తమ్ముడు రెండు కళ్ళు. నీకు ఇద్దరు పిల్లలలాగా! నువ్వు ముందు పుట్టావు. నీ తమ్ముడి కన్నా ఎక్కువ కాలం మన ఇంట్లో తిన్నావు. నీ తమ్ముడు కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించి పెద్దపెద్ద చదువులు చదివావు.  పెద్ద ఉద్యోగం సంపాదించావు. అయినా నాకు మీరు ఇద్దరూ సమానమే.


నీ కూతురు నీ కొడుకు కన్నా ముందు పుట్టింది. వాడి కన్నా ఎక్కువ ఖర్చుతో పెరుగుతోంది. ఈవేళ ఇంజనీరింగ్ చదువుతోంది. నీ కొడుకుకు చదువు అబ్బలేదు. అయినా నువ్వు ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తున్నావు. అలాగన్నమాట.


నీ భార్యలా నీ తమ్ముడి భార్య ఉద్యోగస్తురాలు కాదు. నా తమ్ముడి స్థితికి జాలిపడి స్వప్న మెడలో తాళి కట్టమంటే కట్టాడు నీ తమ్ముడు. అలాంటి పెళ్ళిళ్ళ వల్ల మానసిక లోపం ఉన్న పిల్లలు కలుగుతారని తెలిసి కూడా ఆమెను తన భార్యను చేసుకున్నాడు. నీ పిల్లల్లా ఆరోగ్యవంతుడు కాదు వాడి కొడుకు. నీ కొడుకుకు చదువు అబ్బడం లేదని, వాడు భవిష్యత్తులో సుఖంగా ఉండాలని ఆశిస్తూ, ఏ రకంగా సంపాదించకూడదో అన్ని రకాలుగా సంపాదిస్తున్నావే.  మరి నా రెండో కొడుకుకు ఆర్థిక సాయం చేయడం కోసం ఎక్కువ కాలం వారి దగ్గర ఉండడం న్యాయం కాదంటావా చెప్పు?


నాన్న!. అవతలి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి నిర్భయంగా చూపుడువేలు ఎత్తి చూపిస్తాం. కానీ అందులో మన వైపు మూడు తప్పులను సూచిస్తూ మూడు వేళ్ళు ఉన్నాయి అని మర్చిపోతాం.


 తమ్ముడు పరిస్థితే నీకు వచ్చి ఉంటే ఏం చేసేవాడివి? నువ్వు ఏం చేసేవాడివో నాకు తెలియదు. నేను మాత్రం అప్పుడు ఖచ్చితంగా నీకు అండగా ఉండేదాన్ని. నిన్ను ఇలా ఆశీర్వదిస్తున్నాను అనుకోకు. ఇది కేవలం నీకు తెలియ చెప్పడం వరకే నా ఉద్దేశ్యం. నేను మీ ఇంట్లో ఉన్నంత కాలానికి ప్రతీ పైసా ఉమ చేతికిచ్చాను. నీకు వెంటనే ఆ డబ్బు ఇచ్చేస్తాను అంది ఆమె. ఆమె జీతమంతా తీసేసుకుని కేవలం బస్ పాస్ ఇతర ఖర్చులకు కేవలం వెయ్యి రూపాయలు చేతిలో పెడుతున్న నిన్ను మందలించలేక ఆ డబ్బు ఆమెను వాడుకోమన్నాను.


 నాకన్నా అభిమానం గల ఆమె నీ చేత తిట్లు తింటూనే కావలసిన డబ్బు అడిగి తీసుకుంటోందే తప్ప నేను ఇచ్చిన పైసా ముట్టుకోకుండా ఆ పుస్తకంలో వేస్తోంది.


నా ఇంటికి అనారోగ్యంతో వస్తావు అన్నావు. అనారోగ్యం చెప్పి రాదురా నాన్న. అనారోగ్యం వస్తుంది అనుకుంటే ఇక మీ ఇంటికి రాను. తలకొరివి పెద్ద కొడుకె పెట్టక్కర్లేదు రా. నీకు కష్టమైన భాషలో చెప్పాలంటే ‘ఇష్టమైన వాళ్ళే’ పెట్టాలి. అందుకు నేను నీకు ఆ సమయం కూడా వృధా కానివ్వను. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే సంపాదనను నువ్వు కోల్పోకూడదు అని నా ఉద్దేశం.


 


ఇక ఇంత డబ్బు సంపాదిస్తున్నావు. రేపు నీ సహ ఉద్యోగికె కన్ను కుడుతుంది. ఏ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకో సందేశం పడేసి  వినోదం చూస్తాడు. నా క్షేమమే కోరే తల్లి అయితే ఇలా ఆలోచిస్తుందా అని అనుకుంటున్నావు కదూ . లేదయ్యా. జరిగే అవకాశాలు గురించి గుర్తు చేస్తున్నానంతే, ఆనాడు నీ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమైతే నీ పిల్లాడి పరిస్థితి ఏమిటి? చేతులు కాలాక ఆకులు పట్టుకుని నువ్వు ఏం చేయగలవు? సకల సంపదలను తలదాన్నే సంపద ‘సంతృప్తి’ రా నాన్న.


ఈ వయసులో కూడా నా బిడ్డలకు ఒకరికి 10 నెలలు, మరొకరికి 2 నెలలు ఆర్థికంగా సహాయపడగలుగుతున్నానన్న సంతృప్తే నా ఆరోగ్య రహస్యం. నీకు ఏ కష్టం కలిగినా, ఏ నష్టం జరిగినా ముందు చిల్లు పడేది ఈ అమ్మ గుండెకేరా... ఏ తల్లయినా తన బిడ్డలు అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా,  ఆనందంగా ఉండాలని వారి చేతుల్లో తన జీవితం వెళ్లిపోవాలని కోరుకుంటుంది. అలాంటి సగటు తల్లినే నేను కూడా.


నువ్వు కోరి ఉంటే తమ్ముడిని ఒప్పించి, నీ కళ్ళ ఎదుట ఇల్లంతా నీపేర రిజిస్ట్రేషన్ చేయించి మరి ఇక్కడికి వచ్చే దాన్ని. ఈ విషయం నువ్వు డబ్బులు ఇచ్చి రాయించిన వకీలు గారే చెప్పారు. ఆయనను ఏమీ అనకు. ఆయన ప్రస్తుతం నీ పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఎప్పుడైనా ఈ అమ్మని తలుచుకో. నిన్ను కోరేది ఒకటే.


 మనిషి ఎంత సంపాదిస్తున్నా వేళకు మూడుపూటలా తినాలి. అలా అయితేనే మర్నాడు ఇంకా సంపాదించగలడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళకు భోజనం చెయ్. ఈ అమ్మ మీద ఏమూల గౌరవం ఉన్నా ఈమాట ఒక్కటీ పాటించు. ఉంటాను.


 ఆశీస్సులతో - అమ్మ!’’


 ****************   


‘’అమ్మా. నన్ను... నన్ను క్షమించు !’’ అంటూ కన్నీళ్ళతో పాదాలు తడిపిస్తూ చేతిలో  కాగితాలు ఉండగానే తల్లి కాళ్లను రెండు చేతులతో చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తున్న చక్రధరం తలను ఒళ్లోకి తీసుకుని మాతృ ప్రేమ తో నోటమాట రాక దుఃఖించసాగింది రోహిణమ్మగారు.


 ఉమని కూడా చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని అక్కున చేర్చుకున్నారామే. 


 “అమ్మ! నేను తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. ఇదిగో నీ ఎదురుగా ఈ కాగితాలు ముక్కలు చేసేస్తున్నాను. ఇంతకాలం డబ్బు వ్యామోహం తో తమ్ముడిని ఎంతో అవమానించాను . వాడు కష్టాలకు పరిస్థితులకు తట్టుకుని ఓర్పు సహనంతో నా కన్నా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇక నుంచి వాడి కష్టమే నా కష్టం. వాడు నాకు తమ్ముడు కాదమ్మా. నా పెద్ద కొడుకు. ఈమాట నీ పాదాల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నానమ్మా.


నీలో తప్పును ‘చూపుడు వేలు’తో ఎత్తి చూపిస్తున్నాను అనుకున్నానేగానీ, నా వైపు చూపిస్తున్న వేళ్లతో నా నా కళ్ళు నేనే పొడుచుకునే స్థాయికి దిగజారి పోయానని తెలుసుకున్నానమ్మా. నన్ను నువ్వు, తమ్ముడు, ఉమ అందరూ క్షమించండి’’


అతని కళ్ళనుంచి  వస్తున్నవి అశ్రువులు కాదు, మాతృ ప్రేమ అనే గంగాజలంతో మలినపూరితమైన మనసు పొరలను కరిగిస్తూ పెల్లుబుకుతున్న అభిషేక జలం.                                                                  రోహిణమ్మగారు ఉమవైపు చూసింది. ఉమ లేచి బాలకృష్ణని భర్త వద్దకు తీసుకు వచ్చింది.                      

‘’ తమ్ముడు! నన్ను క్షమించు తమ్ముడు! నీ పట్ల ఎంతో అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు’’ తమ్ముడి చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్నాడు చక్రధరం.


‘’అన్నయ్య! ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడు రాకూడదు. మనం క్షమించు అనాల్సి వచ్చిందంటే అవతలి వ్యక్తి ముందు తల వంచడమే అని అమ్మ అంటూ ఉంటుంది. నువ్వు పెద్ద వాడివి. నాన్నగారి తర్వాత నువ్వే నాకు తండ్రివి. నాకు నా కుటుంబానికి కావలసింది నీ ఆశీసులు తప్ప ఇలాంటి మాటలు కాదు.’’ అన్నాడు వినమ్రంగా బాలకృష్ణ.


సోదరప్రేమను అనుభవిస్తూ ‘’తమ్ముడూ’’ అంటూ ఆప్యాయంగా బాలకృష్ణని కౌగిలించుకున్నాడు చక్రధరం. 


 ఇద్దరు బిడ్డల అనుబంధాన్ని కళ్ళారా చూస్తున్న ఆ మాతృహృదయపు ఆనందం ఎన్ని జన్మలెత్తినా అమ్మ జన్మ ఎత్తిన వాళ్లకే ఆ అదృష్టం అని చెప్పక తప్పదు!!!


 సమాప్తం


 


 



Rate this content
Log in

Similar telugu story from Drama