ఉదయబాబు కొత్తపల్లి

Drama Tragedy

4  

ఉదయబాబు కొత్తపల్లి

Drama Tragedy

ఈపాపం మాదే...!!!

ఈపాపం మాదే...!!!

6 mins
453


ఈ పాపం మాదే...!(కధ)


‘' ఇపుడంత అవసరం ఏం వచ్చిందిరా? పైగా సెలవు రోజులు కాదు. అటు పిల్లలకు ఇటు కోడలికి సెలవు ఇస్తారో లేదో...మేము ఇపుడు ఇంటికి వచ్చి ఏం చేయాలిరా? మాకిక్కడ ప్రశాంతం గా ఉంది. ఇంకోసారి వస్తాంలే.’’అన్నారు అంజనీదేవి గారు కొడుకును ఉద్దేశించి.

మహీధర్ నొచ్చుకున్నట్టు చూసాడు.

ఆ చూపును అర్ధం చేసుకున్న ఆతని భార్య రవళి అత్తమామల్ని ఉద్దేశించి అంది.

‘’అదేంటత్తయ్యా అలా అంటారు? ఈ వయసులో మిమ్మల్ని ఒక్క రోజు కూడా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నామే అని ఎంత మధన పడిపోతున్నామో తెలుసా! మీ అబ్బాయి, నేను రేపు ఎల్లుండి రెండు రోజులు సెలవు పెట్టాము. పిల్లలలు కూడా సెలవు ఇమ్మని డైరీలో రాసి పంపించాలి. ఆ తరువాత రోజు ఆదివారం. మూడు రోజులు మనమంతా కలిసి ఉందాం రండి.మీరైనా అత్తయ్యకి నచ్చచేప్పండి మామయ్యా?’’

‘’ వాళ్ళంతా ప్రాదేయపడుతుంటే కాదంటావేంటి? రిటైరై ఇక్కడకు వచ్చిన ఆరునెలల తర్వాత మొదటి సారి వాళ్ళు ఇంటికి రమ్మని కోరుతున్నారు. అయినా మనం వెడుతున్నది పరాయి ఇంటికి కాదుగా. మన కొడుకు, కోడలు ఇంటికేగా? ఏమంటావ్?’’అన్నారు రమణ రావు గారు భార్యకు నచ్చచేబుతున్నట్టుగా.

‘’నేననేదీ అదే. ఆరునెలలుగా అలవాటు అయిపోయిందిగా. అక్కడకు ఈ మూడు రోజుల భాగ్యానికి వెళ్ళకపోతేనేం?అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి మనని చూసి వెడుతూనే ఉన్నాడు. ఇంకా మనం అక్కడకు వెళ్లి చేసేదేముంది?’’అన్నారావిడ.

‘’అలా అనకమ్మా. మాకు కుదిరితే అసలు మిమ్మల్ని ఇక్కడ చేర్పించేవాళ్ళమే కాదు.ఇప్పుడైనా ఎవరో ఎదో అన్నారనో, అంటారనో మేము తీసుకు వెళ్ళడం లేదమ్మా.మిమ్మల్ని మనస్పూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నాము.’’అంటూ కోడలివైపు అర్దోక్తిగా చూసిన చూపులోని అంతరార్ధం గ్రహించిన అంజనాదేవి గారికి ఆ మాటలు కొడుకు మనసులోంచి రావడం లేదనీ, పెదవులపైనుంచే వచ్చాయని అర్ధమైంది.

అంతలో తమతో బాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న పరశురామయ్యగారు లోపలి వచ్చారు.

“హలో అంకుల్ బాగున్నారా?’’ అంటూ ఆయన్ని పలకరించాడు మహీధర్.

తానూ కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన పాదాలకు నమస్కరించి ‘’కూర్చోండి అంకుల్ ‘’అన్నాడు తాను నేలమీద చతికిలపడుతూ.

‘’ఎంతసేపయిందయ్యా వచ్చి? మా అబ్బాయి పవన్, భార్య పిల్లలు ఎలా ఉన్నారు?’’ అడిగారాయన.

మహీధర్, పవన్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు.

‘’బాగానే ఉన్నారంకుల్. మీరెలాగున్నారో చూసి రమ్మన్నారు.మీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు. ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నా వాడు ఆ సెక్షన్ కి హెడ్, నేను ఈ సెక్షన్ కి హెడ్. వర్క్ తో ఒకే బిజీ.మొన్న అ కాకినాడ కాంప్ కు వెళ్ళాడు. ఈవారం రాలేనని చెప్పమన్నాడు.మీరైనా అమ్మకి నాన్నగారికి చెప్పండంకుల్.రేపు, ఎల్లుండి - నేను, రవళి. పిల్లలు సెలవు పెట్టాము.అమ్మని నాన్నగారిని ఇంటికి తీసుకు వెళ్ళేటందుకు వస్తే వాళ్ళు రాము అంటున్నారు. మీరు చెప్పండంకుల్.'' అన్నాడు మహీధర్ పరశురామయ్యగారితో.

''వెర్రి నాగన్నా. అన్నయ్యగారు మాకు చెప్పాలిట్రా? అక్కడకు వచ్చి నీకు అనవసరమైన ఇబ్బంది కలిగించడం ఎందుకని? నేను బట్టలు సర్దుతాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి." అన్నారు అంజనీదేవిగారు కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ.

'' ఆంటీ ఏరి అంకుల్?'' అంటూ ఆయనతో కబుర్లలో పడిపోయాడు మహీధర్, ఆయన కోడలు, మనుమలు విశేషాలు అడుగుతూ ఉండిపోయింది రవళి.

మధ్య మధ్యలో రమణరావుగారిని సంప్రదిస్తూనే మూడు రోజులు ఉండేందుకు అవసరమైన లగేజీని సిద్ధం చేశారు అంజనాదేవిగారు. 

వాళ్ళు తెమిలాకా తల్లితండ్రులను తీసుకుని బయల్దేరాడు మహీధర్ , భార్య రవళి తో సహా. 

''వదిన గారికి చెప్పండి అన్నయ్యగారు. మూడు రోజుల్లో, అంటే ఆదివారం సాయంత్రం వచ్చేస్తాం. ఇంతకీ ఆవిడ ఏరి?''అడిగారు అంజనాదేవి.

''అలసటగా ఉందని పాడుకుందమ్మా. నేను చెబుతానులే. మీరు వెళ్ళిరండి.మీరు లేని ఈ మూడు రోజులు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ మరీ ముసలిదైపోతుంది. అయినా తప్పదు కదా. వెళ్ళిరండి రమణా!'' అన్నారాయన.

కొడుకుని కోడల్ని అనుసరించారు రమణరావు దంపతులు. 

*****

కొడుకు ఇంటికి వచ్చాకా స్నానపానాదులు పూర్తిచేసుకుని హలో టి. వి. చూస్తూ మానవలకోసం ఎదురు చూడసాగారు రమణరావు. దంపతులు. 

రాత్రి ఎనిమిదిన్నర సమయం; ఓ వాడిపోయిన బచ్చలి తీగల్లా వచ్చారు అంకిత, మదన్. 

''నానమ్మా. తాతగారూ..'' అంటూ అమాంతం ఒడిలో వాలిపోయారు. వారిని తనివితీరా ముద్దాడి వారి చదువు, స్కూల్ విశేషాలు అడుగుతున్నంతలోనే ఎదురింటి ఏదోపనిమీద వెళ్లిన రవళి రివ్వున వస్తూనే, ''మొదలెట్టారా...నానమ్మా, తాతయ్య బుర్రలు తినడం? గబగబా స్నానాలు చేసిరండి. మీరు హోంవర్క్ చేసుకుంటుంటే అన్నం పెట్టేస్తాను. ఊ.." అని హుంకరించడంతో పిల్లలిద్దరూ బిక్కమొగమేసుకుని కదిలారు.

నెలసరి సరుకుల కోసం వెళ్లిన మహీధర్ స్నానంచేసి ''గుడ్ నైట్ నాన్నగారూ. సాయంత్రం నుంచీ తిరుగుడేమో ...బాగా అలిసిపోయాను. పడుకుంటాను. ''అని తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. 

అరగంట గడిచాకా పిల్లలు ఏంచేస్తున్నారో చూద్దామని లేవబోయిన అంజనాదేవిగారు నిద్రపోయిన కొడుకుని, కూతుర్ని ఒక్కొక్కరిగా వర్రీ బెదురూమ్ లోనే పడుకోబెట్టి వచ్చిన రవళిని చూసి ఇక మాట్లాడలేకపోయారు. 

''సారీ అత్తయ్య. పిల్లలిద్దరికీ లీవ్ ఇవ్వనని వాళ్ళ హెడ్- మిస్ట్రెస్ తెగేసి చెప్పింది. అందుచేత రేపటి హోమ్ వర్క్ చేస్తూనే నిద్రపోయారు - వెర్రి వెధవలు. అన్నట్టు మీ వృద్ధాశ్రమంలో మీకు హాల్లోనే పడుకోవడం ఇష్టమని పక్క ఇక్కడే ఏర్పాటుచేసాను. మీకు చూడాలనిపించినంతసేపు టి.వి. చూసి పడుకోండి. ఉదయం మాట్లాడుకుందాం.''అనేసి బెదురూమ్ లోకి వెళ్లి తలుపు వేసేసుకుంది.

అంజనాదేవిగారు భర్తకేసి ''అందుకే నేను రానన్నది.'' అన్నట్టుగా చూసి లేచి మనవల బెడ్ -రూమ్ లోకి వెళ్లి వాడిపోయిన కలువల్లా గాఢ నిద్రలో ఉన్న మనవల నుదుట ముద్దాడి హాల్లోకి వచ్చారు.

అప్పటికే టి. వి. కట్టేసి నిద్రకుపక్రమించిన రమణరావు గారి పక్కన నిద్రకుపక్రమించారు. 

*****

ఉదయం లేచి బ్రష్ చేసుకుని వంటగదివైపు వస్తున్నా అంజనాదేవిగారు ఆగిపోయారు. 

''మా అమ్మ కాఫీ ఎంత బాగా చేస్తుందో తెలుసా? ఆఖరి గుటక వేస్తూనే రెండో కప్పు కాఫీ అడిగేస్తావు" అంటున్నాడు మహీధర్.

''నిజమా. అత్తయ్య అంట బాగా పెడతారా ఫిల్టర్ కాఫీ? నాకు తెలీదే. అయినా రోజూ నాచేతి కాఫీ తాగుతూ ఒక్కరోజైనా ఆమాట చెప్పలేదేం?"

''నీమొహం. చాలా సార్లు అన్నాను. నువ్వు వినిపించుకుని వుండవు. అలాగే అమ్మ వంట చేసిందంటే, ఇక మరునాటివరకూ భోజనం చేయనవసరం లేదు. ''

''అయితే ఈ రెండు రోజులు మీ అమ్మగారి చేత వంట చేయించుకోండి.''బుంగమూతి పెడుతూ అన్న రవళి వంటగదిలొంచి బయటకు రాబోతూ, అత్తగారిని చూస్తూనే అంది - పిర్యాదు చేస్తున్నట్టు.

''చూడండత్తయ్యా. మీరు ఏంటో బాగా వంట చేస్తారట. అంటే ఇంతకాలం నుంచీ నా వంట ఖర్మ కాలి తింటున్నారనేగా అర్ధం.''

''పోనీలెమ్మ. అలాగని ఎందుకనుకోవాలి? ఈ రెండు రోజులు నువ్ వంట ముట్టుకుంటే నామీద ఒట్టే . సరేనా''అంటూ కాఫీ కలపడం కోసం నడుం బిగించారామె.

భోజనాలు అయినా వెంటనే ఆఫీసు నుంచి అర్జెంట్ ఫోన్లు రావడంతో విసుక్కుంటూ మహీధర్, కాలనీ లో మరో ఆఫీసర్ గారి భార్య దగ్గర క్లచ్ వర్క్ నేర్చేసుకుని వస్తానని రవళి వెళ్లిపోయారు. 

మళ్ళీ ఎపుడో సాయంత్రం వేళకు వచ్చారు. 

అప్పటికే రాత్రి వంటకూడా పూర్తి చేసేసారు అంజనాదేవిగారు. 

తాను నేర్చుకున్న వర్క్, కొత్తగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీరలు అన్నీ చూపుతూ కబుర్లు చెబుతుండగానే పిల్లలు వచ్చారు. 

మళ్ళీ గతరాత్రి టైం- టబులే .

ఇదేవిధంగా శనివారం కూడా గడిచిపోయింది. 

''రేపు సెలవే కదా. ఈవేళ అయినా పిల్లలతో మేము కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చా?''అడిగారు రమణరావుగారు కోడలిని.

''అయ్యో ఎంతమాట. వాళ్లకి ఖాళీ లేక గానీ, లేకపోతె మీతో ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు. పిల్లలూ. ఈవేళంతా మీరు తాతగారితో, నాన్నమ్మతో కబుర్లు చెప్పుకోండి. మీ ఇష్టం.'' అంటూ పర్మిషనిచ్చింది రవళి.

ఆ కొద్దీ సమయానికే బ్రహ్మానందపడిపోయారు ఆ దంపతులు. 

అందరూ భోజనాలు అయ్యాకా టీవీ ముందు కూర్చున్నారు. 

అది రమణారావు దంపతులు ఉంటున్న వృద్ధాశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఆ వృద్ధాశ్రమంలో వృద్ధుల మనోగతాలు, వ్యధలు, వెతలు, ఏ పరిస్థుతులలో తాము అక్కడ చేరినది నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ, తమను అక్కడ చేర్పించిన తమ పిల్లలకు ఆ స్థితి రాకుండా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని , వారెక్కడున్నా, క్షేమ, స్థైర్య, విజయ, ధైర్య, ఐశ్వర్య, ఆరోగ్యాలతో సుఖంగా శాంతిగా జీవించాలని కోరుకుంటున్నామని విలపిస్తూ ఆశీర్వదించారు,.

కొందరు వృద్ధులైతే వెక్కి వెక్కి ఏడ్చారు. తమను అక్కడ చేర్చాకా, కనీసం బ్రతికి ఉన్నామో లేదో చూసే నాధుడు లేడని. 

పరశురామయ్యగారు, ఆయన భార్యా కూడా మాట్లాడారు. 

మహీధర్, రవళి ముఖాలు నల్లగా అవడం గమనించారు రమణరావు దంపతులు. 

ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలియచేసింది రవళి. 

''వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లల్లో ఆ తల్లి తండ్రుల్ని ఉంచలేకపోతున్నారో ఆ టీవీ వాళ్ళకేం తెలుసును?అయినా ఆ ముసలాళ్ళు కూడా అంట నిర్మొహమాటంగా తమ పిల్లలు ఎంత వెధవలో అలా బహిరంగంగా చెప్పేయాలా-ప్రజలందరిముందూ వెధవల్ని చెయ్యాలని కాకపొతే.?''అంటూ.

''పోనీ లేమ్మా. వాళ్ళ మనసులో బాధ కొద్దీ అని ఉంటారు. అనారో మీలా వారానికో, నెలకో ఒకసారైనా వచ్చి కనిపించి వెళ్తుంటే ఆ ముసలి ప్రాణాలు ఎంత సంతోషిస్తాయో..అది వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి గానీ ఎవరేం చెయ్యగలం?''అన్నారు అంజనాదేవి.

''నాకు తల నొప్పిగా ఉంది. నేను వెళ్లి పడుకుంటా నాన్నగారు.'' అంటూ తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు మహీధర్.

''మీరూ ఈవేళ్టి కి తాతగారి దగ్గరే పడకేసేయ్యండి. ఆయన బుర్ర పాడైపోయింది. నేనూ వెళ్తానత్తయ్యా.''అంటూ భర్త ను అనుసరించింది రవళి.

నిద్రపోతున్న మనుమల్ని చూస్తూ ఎవరి జ్ఞాపకాలలో వాళ్లు ఉండిపోయిన రమణరావు దంపతులకు చాలా సేపటికి గానీ నిద్ర పట్టలేదు. 

*****

అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది అంజనాదేవిగారికి. 

మంచినీళ్లు తాగుదామని వంటగదివైపు రాబోతున్న ఆమె, కొడుకు బెడ్ రూమ్ లొంచి వినబడుతున్న మాటలు వింటూ ఆగిపోయారు. 

''పెళ్ళాం రెండురోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్కు గ్రాండ్ సక్సెస్.అందుకు మీకు ఈ బహుమతి.''ఆమె ఎం బహుమతి ఇవ్వబోయిందో గానీ....''మరేంటనుకున్నావ్ అయ్యగారంటే? ఇంట చిన్న బహుమతా?''అంటున్నాడు గారంగా మహీధర్.

''లేదు లేదు. మీ ఫ్రెండ్ పవన్ ఆ టీవీ నైన్ కార్యక్రమం ఉందని ముందుగా తెలుసుకుని చెప్పబట్టి సరిపోయింది. వెంటనే మీ అమ్మ నాన్నల్ని అక్కడనుంచి తప్పించి తీసుకొచ్చేసాం. అదే వేళ్ళు కూడా అక్కడే ఉండగా ఆ కార్యక్రమం జరిగి ఉంటె మనగురించి వీళ్ళు ఏం చెప్పేవారో ఏమో? మన పని అయిపోయిందిగా. రేపు తీసుకెళ్లి అక్కడ వదిలేసిరండి. ఏది ఏమైనా నా మాట మన్నించి నా కోర్కె తీచినందుకు మీకు అసలైన బహుమతి నేనే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు.''అంది రవళి.

''నీ పంతం నెగ్గించుకునేందుకు వారం రోజులు పస్తు పెట్టి ఇపుడు బహుమతులిస్తావా...అసలు నిన్నూ...''

ఇక వినలేకపోయారావిడ. 

లేక లేక కలిగిన ఇక్కగానొక్క కొడుకుని అల్లారుముద్దుగా పెంచి, ప్రాణప్రదంగా ప్రేమించి , అడిగిందే తడవుగా కాదనకుండా అతి చిన్న కోరికనుంచి అతి పెద్ద కోరికవరకూ తీర్చి పెద్ద చేసినందుకు తమ కొడుకు తమకు ఇచ్చే విలువా, ప్రతిఫలం ఇదా! ఎంత నాటకం ఆడాడు? 

''తల్లితండ్రులందు దయలేని పుత్రుడు...'' సుమతీ శతకం లోని పద్యం గుర్తుకు వాచిందామెకు. దాసుడైనవాడికీ, అదీ భార్యాదాసుడైనవాడికీ ఈ వృద్ధాప్యంలో కన్నవారిని సాకే అవసరం, అవకాశం లేదు ఈ రోజుల్లో. వెళ్లకన్నా ఆశ్రమంలోని వారే తమకు అసలైన ఆత్మబంధువులు.

'తనకు మాలిన ధర్మం పనికి రాదు'నాయనా అని నేర్పినందుకు, 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అన్నట్టు చేసాడు. ఈ శిక్ష అనుభవించాల్సిందే. అవును. ''ఈ పాపం మాదే'' ! ఉదయాన్నే లేచి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకుని

మంచినీళ్లు కూడా తాగడం మర్చిపోయి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భర్త పక్కన పడుకుని బెడ్లైట్ కేసి చూస్తూ ఉండిపోయారామె!!!


సమాప్తం 



Rate this content
Log in

Similar telugu story from Drama