గాన గంధర్వుడికి సన్మానం
గాన గంధర్వుడికి సన్మానం
సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణానంతరం ఆయన స్వర్గానికేగినట్టు రాసిన నా కల్పిత కథ.
స్థలం - ఇంద్ర సభ :
భూలోకం నుండి వచ్చే ప్రత్యేక వ్యక్తి కోసం త్రిమూర్తులు సైతం ఇంద్రాసభకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడ్డారు.
ఆరోజు అందరూ సమావేశం అయ్యారు. భూలోకం నుండి ఒక ప్రముఖ వ్యక్తి వస్తున్నారు అని స్వాగత సన్నాహాలు చేస్తున్నారు. అందరూ ఆ వ్యక్తి ఎవరా అని ఎదురు చూస్తూ ఉండగా, ఈలోపు బాలు గారు పుష్పక విమానం లో అక్కడ దిగారు. ఆయనని చూసిన వెంటనే ఇంద్ర లోకం అంతా చప్పట్లతో నిండిపోయింది. గంధర్వుల గాన స్వరాలు, అప్సరసల నృత్య గీతాలు సభలో మార్మోగాయి.
ఘనంగా *బాలు* గారికి స్వాగత సత్కారాలు పూర్తయ్యాక బ్రహ్మా, విష్ణు మహేశ్వరులు ఆయనను కలవటానికి వచ్చారు. ముందుగా విష్ణు మూర్తి, "అయ్యా నీవేనా మా ఘనత ని ఆంధ్ర దేశమంతటా గానం చేసిన ఘనుడివి? ఆంధ్ర దేశమంతటనే కాకుండా మీ ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరించింది మీ గాత్రం తోనే కదా?" అని అడిగారు.
"స్వామీ, నేనే మీ గురించి గానం చేసే ఆ అదృష్టానికి నోచుకున్నది , ధన్యోస్మి!" అన్నారు బాలు గారు.
తర్వాత మహాశివుడు "నాయనా, నీవే కదూ నా లింగాష్టకం, బిల్వాష్టకం వంటివి కూడా శృతి లయలతో, రాగ యుక్తంగా ఆలపించి మమ్ములను ఆనందింపచేసింది?" అని అడిగారు.
"స్వామీ, అంతటి భాగ్యమా?" అని అడిగారు బాలు గారు.
చివరగా బ్రహ్మగారు, "మరి నా పాటలు ఎవరూ రాయలేదు, పాడలేదు?" అని నొచ్చుకున్నారు.
దానికి బాలు గారు "బ్రహ్మ దేవా, ఈ సృష్టికి మూల కారణం మీరే, నా జన్మ మీదే అయినప్పుడు నా ఈ మహద్భాగ్యానికి కూడా కారణం మీరే కదా!" అన్నారు.
ఆ మాటలకి త్రిమూర్తులు ఎంతో ఆనందించారు.
ఇంద్రాది దేవతలందరూ హర్షించారు.
"ఆహా ఏమి మా భాగ్యము ఇక నుంచి మీ గానామృతం తో మమ్ములను ఆనందింపచేయండి" అంటూ అప్పటికే అక్కడ ఉన్న ఘంటసాల గారిని, బాల మురళి కృష్ణ గారిని, సుబ్బులక్ష్మి గారిని చూపిస్తూ, "ఇక నుంచి మీరు కూడా వీళ్ళతో పాటు మాకు ప్రతి ఉదయం మేలుకొలుపు దగ్గర నుంచీ పవళింపు సేవ వరకు సమస్తం చెయ్యాల్సి ఉంటుంది. మీ గాన మాధుర్యం వినాలని మాకు కూడా ఎప్పటి నుంచో ఆత్రుత గా ఉన్నది. ఇప్పటివరకు భూలోకంలో అందరికి వినిపించారు, ఇక మీదట మా సాన్నిధ్యంలో మీరు గానం చెయ్యవలసి ఉంటుంది." అన్నారు విష్ణువు.
బాలూ గారు, "స్వామీ అంతటి మహద్భాగ్యమా? అంత కన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి, ఇదే కదా అందరూ కోరుకునే మోక్షం. ధన్యుడను స్వామీ" అని దేవతలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచీ నిష్క్రమించారు.
********
భూలోకం లో తన పయనం ముగించి దేవలోకం చేరిన గాన గంధర్వుడి గురించి నేను రాసిన (నా) కల్పిత కథ. ఎవ్వరిని కించపరచాలని కాదు.