" వెలిసిపోయిన మౌనం"
" వెలిసిపోయిన మౌనం"
వెలిసిపోయిన మౌనం !(కవిత)
సూర్యోదయపు వెలుగు పుస్తకంలో
తొలి పేజీకి తెర లేవగానే
ఆ ఆలయ వాకిలి ముంగిట
తెలుగు నుడికారపు రంగవల్లి
మిస మిసలాడుతున్న కన్నెపడుచై
ఒళ్ళు విరుచుకుంటుంది
తాడు - బొంగరం తోడు లేని ప్రధానార్చకుడు
తుప్పు పట్టిన తాళం చెవి చేత
పవిత్రంగా చేయించిన అరంగేట్రంతో
ప్రతి వాయురేణువు చైతన్యమవుతుంది.
సకల కోణాల విజ్ఞాన సారాన్ని
తమలోకి- అక్షరమాలలుగా ఒంపుకున్న
ఇంద్రధనస్సు రంగుల వార్తాపుత్రికలు
ర్యాంపుపై కన్యమనుల్లా
ఆ ఏకలవ్య ఆచార్యుని స్వాగతిస్తాయి.
విజ్ఞానపు గింజలు ఏరుకునే జ్ఞానవిహంగాలు ఒళ్లంతా కళ్ళయిన అమరేంద్రుని తలపిస్తూ ప్రపంచ విజ్ఞానం ముందు కాళ్ళు చాపుకుని తపస్సు ఆరంభిస్తాయి.
పుస్తకాలు నలుగుతున్న కొద్ది
మస్తకాల న్యూరాన్లలో సమాచార స్రవంతి నిక్షిప్తమవుతూ ఉంటుంది.
భార్య బాధిత భర్తల విశ్రాంతి కోసం
పంకాలు సర్కస్ బఫూన్లయి
తిరుగుతూ ఉంటాయి.
భవిష్యత్తును నడిపించే ఉద్యోగ పక్షి
వస్తుందో రాదో అనే తూగుతుయ్యాలలో యువత జోగాడుతూ ఉంటుంది ఉంటుంది
దుమ్ము భక్షణ చేస్తూ
కాలాతీతవృద్ధ కన్యల్లా
కొలువు దీరిన స్వయంవరంలో
తమను పునీతం చేసే చదవరి కోసం
గ్రంథ ప్రబంధ పురాణ కావ్యాలు
అనిమేష రాత్రులు గడుపుతూ ఉంటాయి.
వారోత్సవాల పండుగ సంరంభంలో
Lఆరంభ సూచికగా నిలచిన
జాతీయ పతాకపు ఆవిష్కరణ
మలి పొద్దు పొడవక ముందే
వృద్ధ రాజకీయ తాజా హామీలా
అవనతం అవుతుంది
ఈనాటి సమ సమాజ భవనంలో
ఉన్న ఒక్కప్రాణాన్ని
ఊడబోతున్న మేకుకు వేలాడుతున్న వెలిసినపోయిన వర్ణ చిత్రంలా
ఆ గ్రంధాల ఆలయం మాత్రం
సగటు పాఠకుడి గొంతులో
చేదు మాత్రల పారాడుతూ
పోరాడుతూ...!
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్.