శిశిరశోభ (కవిత )
శిశిరశోభ (కవిత )
చలి దుస్తుల్ తనువులకు వెచ్చదనమీయ
వేడి నీటిని త్రావుచు విధులు నడిపి
భారతంబున జనులిట్లు వరలు చుండ
శిశిర ఋతువు తా జనుదెంచి చెలగు చుండె
ధరణి యందున ముత్యంపు ధార వోలె
మిహిక బిందువు ల్జారగా మిలమిలంచు
సొగసు లింపారు నీభువి శోభ లిపుడు
కాంచు వారల మదినిండ కల్గు ముదము.
చల్లచల్లగా జలములు జారు చుండ
పూని వెడలిన యారుద్ర పురుగు లచట
నెఱ్ఱ పగడంపు రాశిగా నింపు గొలుప
బీర పాదులో పూవులు విరగ బూసె
బంతి చామంతి పూవుల వరుసలోన
పారి జాతమ్ములట రాలి పలకరించె.
నంది వర్ధనముల సౌరు విందు చేయ
నొళ్ళు మరచిన తుమ్మెద లుత్సహించి
కాంచు చుండెను పూవుల కాంతి నపుడు.
కాల మీవిధి ధరణిలో కలియ తిరుగ
వచ్చె శిశిరంపు శోభలు వసుధ యందు
మనసు కాహ్లాద మొసగెడి మాసమిదియె.
అంబరంబున వెన్నెల లావరించ
వెండి ముద్దగా నింగిలో వెలుగు చుండి
నమృతంబును కురిపించి యాడుకొనుచు
కొంటె జాబిల్లి తారల వెంట నడిచె.
కదిలి పోయెడి కాలపు గమనమందు
ప్రకృతి యందముల్ కలిగించు పరవశమును/
----------------------------
