మొల్ల రామాయణము
మొల్ల రామాయణము
మొల్ల రామాయణము
మత్తేభవిక్రీడితము.
ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప మునీశ్వరుండలర గోదండంబు చేనంది చి
వ్వన మోవెట్టి గుణంబు పట్టి పటు బాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాతము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్.//
భావము :
పై పద్యము మొల్ల రామాయణములోని సీతాస్వయంవర ఘట్టములోనిది.సూర్యవంశములో జన్మించిన శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ తనను వీక్షించుచుండగా, మునీశ్వరుడైన విశ్వామిత్రుడు సంతోషంచగా, శివధనుస్సును చేతబూని, చివ్వున పైకెత్తి నారిని పట్టి తన అతులితమైన భుజశక్తితో తీయగానే ఆ విల్లు సముద్రాలు ఘోషించి నంత పెద్ద శబ్దంతో విరిగిపోయింది.//
శ్రీరామచంద్రుని యొక్క భుజబల శక్తిని తెలియపరుస్తూ, విల్లు ఎలా విరిగిందో 'తునిగెన్ 'అనే మాట తో మొల్ల శ్రీరాముడి భుజశక్తి ముందు విల్లు ఒక పుల్ల లాగా విరిగింది అని వ్రాసింది. అదే సమయంలో కానీ ఆ విల్లు తక్కువదేమీ కాదు.,పరమశివుని ధనుస్సు. అది విరిగినప్పుడు ఆ శబ్దం సముద్రాలు ఘోషించినట్లు ఉంది అని వ్రాయటం,అంటే విల్లు గొప్పతనమును గూర్చి కూడా తెలియ చెప్పింది.అంత గొప్పదైన విల్లును రాముడు చిన్న పుల్లలాగా విరిచేసాడు. అదీ కవయిత్రి మొల్ల యొక్క గొప్పతనం.//
