Mahesh krishna

Tragedy

4.5  

Mahesh krishna

Tragedy

గెలుపు-వైఫల్యం

గెలుపు-వైఫల్యం

3 mins
1.2K


ఒకానొక ఊరిలో ఎన్నో ఇళ్లు,ఆ ఊరు మొత్తానికి ఒకేఒక ఆలయం ఉంది.ఆ ఆలయంలోని దైవానికి ఒక పూజారి నిత్యం పూజలు నిర్వహిస్తూ,అక్కడికి వచ్చే భక్తులు ఇచ్చే డబ్బులతో జీవనం సాగిస్తుండేవాడు మణిశర్మ.శర్మ గారికి ఒక భార్య(వాణి)ఒక కొడుకు(ఫణి) కలరు.వృత్తిపరంగా పూజారి అవ్వడంతో సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది.ఆ విషయంలో భార్య భర్తలకు తరచూ గొడవలు అయ్యేవి.కొన్ని సార్లు ఇరువురు కొడుకు ముందే మాట మాట అనుకునేవారు.కొడుకు ఫణికి వయసు 13 సంవత్సరాలు కావడంతో ఈ గొడవలు తన మనసును కలిచివేసేవి.ఎలాగైనా సరే తను కష్టపడి చదివి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి తన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని అనుకునేవాడు.కాని తన తండ్రికి తనను చదివించే స్థోమత లేదు.కొడుకుని కూడా తనలాగే పూజారిని చేయాలని అనుకునేవాడు శర్మ.అందుకోసం వేదపాఠాలు నేర్పించే ఆశ్రమంలో చేర్పించాలనుకున్నాడు.

             తన తండ్రి తననుకూడా పూజారిని చేయాలనుకోవడం ఫణికి నచ్చలేదు.బహుశ తన ఇంట్లో ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావమే అందుకు కారణం అయ్యుండచ్చు.ఒకానొక రాత్రి ఫణి ఇంటినుండి పారిపోయాడు.మరుసటి రోజు ఉదయం కొడుకు కనిపించకపోవడంతో తల్లిడండ్రులు కంగారుపడ్డారు.తన స్నేహితుల ఇంటికి వెళ్లాడేమో అని ఆరాతీసారు.కానీ ఎక్కడ వెతికినా ఎంతమందిని అడిగినా ఫణి జాడ తెలియలేదు.

     మరోవైపు ఇంటినుండి పారిపోయిన ఫణికి ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో అంతుపట్టలేదు.తన దగ్గర తినటానికి కూడా డబ్బులులేవు.అలా కనిపించిన దారిలో కనిపించని గమ్యాన్ని వెతుక్కుంటూ ప్రయాణం కొనసాగించాడు.అలా కొంతదూరం వెళ్లగానే ఆగివున్న లారీ వాహనం కనిపించింది.ఆ వాహన చోదకుడు ఎక్కడికి వెళ్తున్నాడో కనక్కుని తనను కూడా తీసుకెల్లమని ప్రాదేయపడ్డాడు.అందుకు ఆ చోదకుడు అంగీకరించడంతో ఉత్తరదేశానికి పయనమయ్యాడు.దారిలో ఆ చోదకుడు ఫణి ద్వారా వివరాలు తెలుసుకుని నువ్వు ఇంత చిన్నవయసులో ఇళ్లు వదిలిరావడం మంచిదికాదు ఎన్నో ఇబ్బందులు పడాల్సివస్తుందని ఇంటికి వెళ్లి బుధ్దిగా తల్లిదండ్రుల మాట వినమని వారించాడు.అందుకు నిరాకరించాడు ఫణి.ఇక చేసేదేమీలేక చోదకుడు తన యజమాని వద్దకు తీసుకెల్లి ఫణి పరిస్థితి వివరించాడు.అందుకు యజమాని ఫణిని తనవద్ద సహాయకుడుగా నియమించుకుంటానని కాకపోతే ఒక షరత్తు పెట్టాడు.ఫణి వయసు చిన్నది పైగా చదువుకోవాలని ఆశ పడ్డాడు.చదువుకోవడానికి కావల్సిన ఏర్పాట్లు తను చేస్తానని తీరిక సమయాల్లో తను చెప్పే పనులు చేస్తూ తనతోనే ఉండాలని అన్నాడు.అందుకు అంగీకరించిన ఫణి మరుసటిరోజునుండి చదువుకోవడం ప్రారంభించాడు.తీరిక ఉన్నప్పుడల్లా యజమానికి సహాయం చేస్తూ చేదోడువాదోడుగా ఉండసాగాడు.

      20 సంవత్సరాలు గడిచాయి

   ఫణి తన చదువుపూర్తిచేసి తన యజమాని సంస్థలోనే లావాదేవీలు చూసుకుంటూ మంచి స్థితిలో ఉన్నాడు.పెళ్లి చేసుకుని ఒక పిల్లాడిని కన్నాడు.ఒక రోజు తన 5ఏళ్ల కొడుకుతో ఆడుకుంటున్న సమయంలో ,కొడుకు ఫణిని ఒక ప్రశ్న అడుగుతాడు.నాన్న మీ నాన్న ఎక్కడున్నారు ,ఏం చేస్తున్నారు?అసలింతవరకూ ఆయన నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తాడు.అప్పటివరకూ తన జీవితంలో కమ్ముకున్న మబ్బులు ఒక్కసారిగా తప్పుకుంటాయి ఫణికి.చిన్నతనంలో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఒక్కసారిగా తట్టిలేపినట్టు అనిపిస్తుంది.ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు తన తల్లిదండ్రులను తాను ఎందుకు గుర్తుచేసుకోలేకపోయానన్న బాధ తనని కలచివేసి మరుక్షనమే తన ఊరికి పయనమవుతాడు.

             దారిపొడుగునా తన ఊరిని,తన తల్లిదండ్రులు మధ్య జరిగిన గొడవలని నెమరువేసుకుంటాడు ఫణి.కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఊరికి చేరుకుంటాడు.పరుగుపరుగున తను పుట్టిపెరిగిన ఇంటికి వెళ్లి చూడగా అక్కడ తన ఇళ్లు ఉండదు.చూడబోతే ఊరు చాలా మారిపోయింది అనుకుని చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని వారిని తన తల్లిదండ్రుల గురించి అడుగుతాడు.ఎవ్వరిని అడిగినా మాకు తెలీదు అన్న సమాధానమే వినిపిస్తుంది.ఇక ఆఖరి ప్రయత్నంగా తన తండ్రి పూజారిగా చేసిన ఆలయానికి చేరుకుంటాడు.చుట్టుపక్కల భవనాలు ఎంతో సుందరంగా ఉన్నప్పటికీ ,ఆలయం మాత్రం శిధిలావస్థలో ఉంటుంది.ఆలయం భయట ఒక బిచ్చగాడు కూర్చునివుంటాడు.అతనికి వంద రూపాయలు ఇచ్చి ఆలయం లోపలికి వెళ్లి చూడగా ఒక పూజారి దర్శనమిస్తాడు.ఆయన తన తండ్రికాదని చూడగానే అర్ధమవుతుంది ఫణికి.తన తల్లిదండ్రులు తనకు దొరికేలా చేయమని భగవంతున్ని ప్రార్ధించి అక్కడ ఉన్న పూజారిని ఇలా అడుగుతాడు,అయ్యా 20 ఏళ్ల క్రిందట ఈ గుడిలో శర్మగారనే పూజారి ఉండేవారు మీకు విదితమేనా అని.అందుకు ఆ పూజారి ఇలా అంటాడు ,నాయనా ఒకప్పుడు ఆ పూజారి గారి కొడుకు ఇంటినుండి వెళ్లిపోయాడు ఎంతవెతికినా అతని ఆచూకీ తెలియకపోయేసరికి దిగులుతో ఆయన భార్య మంచంపట్టింది.సరైన వైధ్యం చేయించలేని స్థితి ఉండడంతో కొన్నాల్లకి ఆవిడ చనిపోయింది.ఆ తర్వాత ఆయన కూడా మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడయ్యాడు.వీధులెమ్మట పడి బిక్షాటన చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ గుడి బయట కూర్చుని వచ్చిపోయేవాళ్లు ఇచ్చే బిక్షలు స్వీకరిస్తూ బ్రతుకుతున్నాడు.ఇప్పుడు కూడా ఆలయం బయటే కూర్చునివున్నాడు ఆతనే ఒకప్పటి పూజారి శర్మ అని బదులివ్వగానే సగం ప్రాణం కృంగిపోయినట్టయింది ఫణికి.

తను ఇళ్లు వదిలిపెట్టి వెళ్లి ఎంత తప్పుచేశానో అని కూలబడిపోయి తన తలను గోడకేసి బాదుకున్నాడు.అమాంతం గుడి బయటకు పరిగెత్తి ఒక్కసారిగా పిచ్చోడైన తన తండ్రి కాళ్లమీదపడి బోరున ఏడ్చాడు.తిరిగి తనతోపాటు తన తండ్రిని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు.

నీతి : కొన్ని పనులు చేసేటప్పుడు మనకు ఒప్పు అనిపించినా వాటి వల్ల కలిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి.కొన్నిసార్లు ఆ పనులే మనకు భరించలేనంత వేదనకు గురిచేస్తాయి.అందుకే ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయటం ఉత్తమం.

ఒకరి గెలుపు ఇంకొకరి వైఫల్యం వల్ల లభిస్తే అది గెలుపేకాదు


ఇట్లుః సగటు మనిషి


Rate this content
Log in

Similar telugu story from Tragedy