హనుమ రామాయణం
హనుమ రామాయణం
*హనుమంతుడు కూడా రామాయణం రాశాడు!*
అవునా! హనుమంతుడు కూడా రామాయణం రాశాడా అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. మీకు వచ్చిన సందేహం ఒకప్పుడు వాల్మీకి మహర్షి కి కూడా వచ్చింది. మరి మహర్షి సందేహం తీరిందో లేదో ఈ సంఘటన చదివి తెలుసుకోండి......
వాల్మీకి తన రామాయణ రచన పూర్తి చేశాడు. కానీ నారదుడికి అందులో ఎక్కడో లోపం కనిపించింది. అపుడు వాల్మీకి తో ఇలా అన్నాడు 'నీవు రచించిన రామాయణం చాలా బాగుంది, కానీ హనుమంతుడు కూడా ఒక రామాయణం రచించాడు అది ఇంకా అద్భుతంగా ఉంది ' అని అన్నాడు.
'హనుమంతుడు కూడా రామాయణం రాశాడా!'అని వాల్మీకి ఆశ్చర్యపోయాడు. ఇద్దరి లో ఎవరి రామాయణం మెరుగ్గా ఉంటుదో అని అనుకుంటూ ఆందోళన చెందుతున్నాడు.
ఆందోళన ను తట్టుకోలేక, సందేహాన్ని తీర్చుకోడానికి హనుమంతుడిని, అతడి రామాయణాన్ని వెతకడానికి బయలుదేరాడు.
కదలి-వనంలోని అరటి తోట లో, అరటి చెట్టు యొక్క ఏడు విశాలమైన ఆకులపై రామాయణం చెక్కబడి ఉన్నట్లు, అది హనుమ రచిత రామాయణం గానూ తెలుసుకున్నాడు.
అతను దానిని చదివి, అది పరిపూర్ణంగానూ అర్థవంతాగాను ఉన్నట్లు కనుగొన్నాడు. వ్యాకరణం తో కూడిన పదాల కూర్పు అత్యంత అద్భుతంగా, సున్నితమైనదిగా ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఎందుకో ఉన్నట్టుండి ఏడవడం ప్రారంభించాడు.
వాల్మీకి ఏడుపును చూసిన హనుమంతుడు 'ఇది అంత చెడ్డదా? దీనిలో ఉన్న లోపమేమిటి?' అని అడిగాడు. అప్పుడు వాల్మీకి 'లేదు, ఇది చాలా బాగుంది' అన్నాడు.
'మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు?' అని అడిగాడు హనుమంతుడు.
అపుడు వాల్మీకి ' మీ రామాయణం చదివిన తరువాత నా రామాయణాన్ని ఎవరూ చదవరు. నేను పడిన శ్రమంతా వృథాయే అందుకని నాకు దుఃఖం కలుగుతుంది. ' అని బదులిచ్చాడు.
హనుమంతుడు, వాల్మీకి మాట విన్న వెంటనే రామాయణం ఉన్న ఆ ఏడు అరటి ఆకులను చించివేసి, ఇప్పుడు ఎవరూ నేను రాసిన రామాయణం చదవరులే. అని మహర్షి వాల్మీకి కి బదులిచ్చాడు.
హనుమంతుడి ఈ చర్య చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇలా చేసావు అని అడిగాడు!
అప్పుడు హనుమంతుడు,
రామాయణం యొక్క అవసరం నాకంటే ఎక్కువగా మీకే ఉంది.
ప్రపంచం మిమ్ములను గుర్తుంచుకునే విధంగా మీరు మీ రామాయణం రాశారు;
నేను రాముడిని జ్ఞాపకం చేసుకునేలా నా రామాయణం రాశాను.' అన్నాడు.
వాల్మీకి యొక్క రామాయణం గుర్తింపు పొందాలనే కోరికను తీర్చడానికి హనుమంతుడు తనను ఎలా గౌరవించాడో ఆ క్షణం లో వాల్మీకి గ్రహించాడు.
వాల్మీకి రామాయణ ముఖ్య ఉద్యేశ్యం రామాయణం ఉత్పత్తి చేయడం, ప్రచారం చేయడం మాత్రమే... కానీ హనుమంతుడు రాసిన రామాయణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రామ భక్తి, ఆప్యాయత ను పెంచడం.
అందుకే హనుమంతుడి రామాయణం చాలా గొప్పదైంది.
రాముడి కంటే రామ నామము గొప్పది అని హనుమంతుడు నిరూపించిన సంగతి తెలిసిందే.
మనం ఈ సంఘటన ద్వారా గ్రహించాల్సింది ఏమిటంటే...
ఇక్కడ వాల్మీకి ను తక్కువ చేసి చెప్పడం ఉద్దేశ్యం కాదు. హనుమంతుడి నిస్వార్థ సేవను అర్థం చేసుకోవడమే ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ప్రపంచం లో ప్రసిద్ధి చెందడానికి ఆసక్తి చూపని హనుమంతుడి వంటి వారు చాలానే ఉన్నారు. వారు తమ పనిని చేసి వారి లక్ష్యాన్ని నెరవేరుస్తారు మరియు లోక కల్యాణార్థం పాటుపడుతారు. కానీ వారికి పేరు ప్రతిష్టలు రావాలని మాత్రం ఆశించరు.
మన జీవిత భాగస్వామిని, తల్లిని, తండ్రిని, గురువులను, స్నేహితులను హనుమంతుడి నిస్వార్థ సేవకు ఉదాహరణగా చెప్పవచ్చు. వారిని గుర్తుంచుకుందాం మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం.
ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ తన పనిని ఎత్తి చూపుతూ, ధ్రువీకరణ కోరుతూ, ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారిని గూర్చి ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా మన కర్మలను మనం చేద్దాం. ఫలితం దానంతటదే వస్తుంది. పేరు ప్రతిష్ఠల కోసం ఎదురు చూపులు అవసరం లేదు వాటంతటవే కలుగుతాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏
*ఇది ఆంగ్ల భాషలో ఉన్న కథ*
*అనువాదం: మ్యాడం అభిలాష్*
*ధన్యవాదాలు*
*జై శ్రీరామ్*