సంక్రాంతి పల్లె (కథ)
సంక్రాంతి పల్లె (కథ)
సంక్రాంతి పల్లె (కథ)
రచన:
సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము
ఆరోజు డిసెంబరు నెల 24వతేదీ ఆదివారం
ఆనందంగా ఉత్సాహంగా కనులవిందుగా
తెలుగుసాంస్కృతిక సాహిత్యకార్యక్రమాలు ఆహ్లాదకరంమైన టెక్సాస్ఆడిటోరియంలో కొన సాగుతున్నాయ్ అమెరికాలో
ఆహూతుల్లో అమెరికన్లే అధికసంఖ్యలో వున్నారు.
అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారుకొందరుంటే ఉద్యోగరీత్యా వుంటున్న వారు ఎక్కువగా వున్నారు.
అందరూ ఆరోజు సకుటుంబసమేతంగా పిల్లలతో పాటు హాజరయ్యారు.
వేదిక పై ప్రముఖకవయిత్రి శ్రీమతి మన్నె లలితగారు ప్రసంగిస్తున్నారు.
భారత దేశంలో ... తెలుగువాళ్ళు పల్లెల్లో సంక్రాంతి పండుగను సంబరంగా ఎలా జరుపు కుంటారో చక్కగా వివరిస్తున్నారు.
నిశ్శబ్దంగా వింటున్నారు పిల్లలు
తమది కూడ ఇండియానే అయినా ఆమె చెబుతున్న వేవీ తాము స్వయంగా చూడక పోవటం ఆశ్చర్యంగా వుంది వాళ్ళకి.
ఎన్నో విషయాలు అర్థంకాక అలజడి రేపుతున్నాయ్ పిల్లల మెదళ్ళలో.
ఇంటికి చేరగానే మమ్మీడాడీల్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంది ఆరేళ్ళపాపాయి నిర్వ్యయ .
"సంక్రాంతికి ఇండియా వెళదాం డాడీ"
ఫంక్షన్లోనే అడిగింది పదేళ్ళ అమ్మాయి శ్రావ్య.
"ష్ ...సైలెన్స్ మాట్లాడకు"
గొణిగాడు రాజేష్ .
****** ******* ******** **********
ఏడుస్తూనేవుంది వాత్సల్య పల్లెకు పోదామంటూ .
"తాతయ్యా వాళ్ళ ఊరికెళ్ళాలి.
ఇంటి ముందు ముగ్గులు వేయాలి.
ముగ్గులకు రంగులు వేయాలి.
ముగ్గులమధ్యలో గొబ్బిళ్ళు నేనే స్వయంగా పెట్టాలి"
"సౌలభ్యా! నీ కూతురు డిమాండ్లు విన్నావా?"
అన్నాడు మంద్రంగా వృత్తాంత్ వర్మ
"పండ్రెండేళ్ళయింది ఇండియావదిలిపెట్టి వచ్చి"
పుట్టింటిని తలచుకుంది సౌలభ్య మౌనంగా మనస్సులో.
"సంక్రాంతి ఫెస్టివల్ కి వెళ్దాం మమ్మీ "
సౌలభ్య మెడచుట్టూచేతులు వేస్తూ అడిగింది వాత్సల్య లాప్ టాప్ లో కనిపిస్తూన్న ఒకప్పుడెప్పుడో తీసిన పాతవీడియోని చూస్తూ.
అందులో కనిపిస్తూన్న అమ్మమ్మ ,నాయనమ్మ,తాతయ్య లందరూ ఎప్పుడో చనిపోయారన్న చేదు నిజం తెలియదు పాపం వాత్సల్యకి.
** ** ** **
"ఇండియాలో మనది పల్లెటూరే కదా డాడీ ?
మన్నెలలిత బామ్మచెప్పింది విన్నావా డాడీ ?
కోడి పుంజులు అన్ని రకాలు వుంటాయా?
రంగుల్లోవుంటాయా? అవి టైం ని తెలియజేస్తాయా?"
ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసుకుంటూ అమాయకంగా అడుగుతోంది స్వీటీ.
"మన స్వీటీ ప్రశ్నలు విన్నావా కైవల్యా?"
"ఊఁ ..
పౌల్ట్రీల్లోని తెల్లతెల్లని బ్రాయిలర్ ,లేయర్ కోళ్ళూ ..వంటింట్లో వాటి మాంసం వంటలూ రకాలూ ..మాత్రమే తెలుసు దానికి .వాటినే చూసింది ఇంతవరకు తను. ప్రశ్నలు సరైనవే మరి"
అంది బన్ కి జామ్ రాస్తూ భర్తవైపు ఓరగంట చూస్తూ
పుట్టింటిని తలచుకుంటూ.
"స్టోర్ రూంలో ఆల్బం వుంది కదా. మన పెళ్ళికి ముందు అమెరికానుండి నీ కోసం మీ పల్లెకు వచ్చాను కదా. అప్పుడు మీ వీరన్నపల్లిలో నేను తీసిన ఫోటోలు మొత్తం చూపించెయ్.లేకుంటే నన్ను వదిలేలాలేదు"
అంటూ లాప్ టాప్ లోకి చూపు మళ్ళించాడు వాసూ.
*** *** *** ***
"మమ్మీ !
మీ పాత సంబరాల వీడియోలను ఈ గూగుల్ వీడియోలను ఈ తెలుగు సినిమాలను చూస్తూంటే జురాసిక్ పార్క్ మూవీ లో రాక్షస బల్లుల జీవితవిశేషాల్ని చూస్తున్నట్లుంది.
నాకు చిన్నిచిన్ని ఆశలు చాలా వున్నాయ్.
పశువులపాకల్ని చూడాలి.
దూడలు చెంగుచెంగునగంతులువేయటం చూడాలి.
అవి తల్లి ఆవుల వద్ద పాలుతాగటం చూడాలి. మనుషులు చేతులతో ఆవుల పొదుగుల్లోంచి పాలు పితకటం చూడాలి.
పూరిపాకలపైన పెరిగిన తీగలకు గుమ్మడి కాయలు వ్రేలాడటం చూడాలి.
కోడి పందేలని చూడాలి. గిలక బావుల్ని చూడాలి.
మన ఊరికి పోయి సహజమైన వెన్నో చూడాలి. ఆ వాతావరంలో నేను అనుభూతిని పొందాలి . నా జీవితంలో ఇక ఇండియాకు వెళ్ళే అవకాశములేదు. నాకు ఆ అవసరమూ వుండకపోవచ్చు.
అందుకే ఈసారి సంక్రాంతికి మనం మనపల్లెకు వెళ్ళాలి అంతే!"
తన ఆశ యే శాసనం అన్నట్లు చెప్పింది పాతికేళ్ళ పాశ్చాత్య.
అమెరికాపౌరసత్వాన్ని జన్మతఃపొందిన తెలుగింటమ్మాయి పాశ్చాత్యకి ..అమెరికన్ సెనేటర్ అర్జున్ డల్లాస్ తో వివాహం కుదరటంతో తనకిక
ఇండియాకు వెళ్ళేందుకు వీలుపడదేమోనన్న ఆలోచన మనస్సులో అలజడి రేపడంతో ఆవేశంగా చెప్పింది ఆమె అలా.
తల్లి నిర్మాల్యకు నోట మాట పెగలలేదు.
కారణం ఇండియాలో తమ వాళ్ళెవరూ మిగులలేదు.
పెద్దలు చనిపోయారు . పిల్లలనబడే తనబోటి వారందరూ విదేశాల్లోనే స్థిరపడ్డారు. తన తరపువారిదీ- తన భర్తతరపువారిదీ కూడా - అదే పరిస్థితి.
** &
nbsp;*** ** ** ***
"సంక్రాంతి పండక్కి మన మంతా ఇండియా వెళుతున్నాం"
తెలుగు అసోసియేషన్ వాసూ నోరు విప్పాడు.
"మా ఊర్లో మమ్మల్ని గుర్తు పట్టేవాళ్ళే లేరు.
వదలివచ్చి పాతికేళ్ళుదాటిపోయాయి. మా మమ్మీడాడీ పోయాక .తమ్ముళ్ళు సిటీలో సెటిలయ్యారు"
నేను రాలేను పెదవివిరిచాడు రాజేష్.
"అయితే మా ఊరికి రండి! ప్రేమగా పిలిచింది వాత్సల్య"
చప్పట్లతో మీటింగ్ హాలు దద్దరిల్లింది.
రాజేష్ తోపాటు సమావేశంలోని సభ్యులందరూ.. వాత్సల్య మమ్మీడాడీలైన సౌలభ్య వృత్తాంత్ లవైపు చూశారు ఆశగా.
"ఎంతైనా రాయల్ ఫ్యామిలీ వర్మా వాళ్ళది ఆతిథ్యాలకు వెనుకాడరులే"
ఎవరో భరోసా యిచ్చారు.
"మా వాళ్ళెవరూ పల్లెల్లో లేరు వర్మగారూ సిటీల్లోకి వచ్చేశారు మేమూ మీ ఊరికే వస్తాం"
హరినాథరెడ్డి నేను రెడీ అన్నట్టు చెయ్యి ఎత్తాడు.
"మేమూ మీ ఊరికే మాదీ అదే పరిస్థితి "
అంటూ సురేష్ నాయుడు చేతులెత్తాడు.
"వర్మగారూ ఓకేనా?"
అంటూ శర్మగారు కూడా అడగడంతో
ఊహించని పరిణామానికి ఏమి జవాబు చెప్పాలో తోచక భార్యవైపు చూశాడు వర్మ.
క్షణం ఆలస్యం చేయకుండా ఇండియాలో వున్న
అక్కయ్యకీ బావగారికీ ఫోన్ చేసింది సౌలభ్య.
"బావగారూ మీ తమ్ముడు నేను పిల్లలు మాతో పాటు ఓ పది కుటుంబాలవాళ్ళము కలిసి అమెరికానుండి ఇండియాకి మన రామరాజు పల్లెకు వస్తున్నాం ఓ నాల్గురోజులు మన బంగ్లాలోనే వుండాలి అనుకుంటున్నాం"అంటూ.
అవతలినుండి సమాధానం వింటూన్న ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
"ఏమండోయ్ ఇన్నేళ్ళతర్వాత ఈ రకంగానైనా ...మీరు మీ స్వంత అన్నయ్యను నేను నా స్వంత అక్కయ్యను కలుసుకోబోతున్నాం "
అంది చెమర్చుతూ మెరుస్తూ అందంగా విప్పారిన పెద్దపెద్దకళ్ళతో సౌలభ్య.
** **** ** *** *****
రాత్రి సమయం పదకొండుగంటలు.
రామరాజు పల్లె లోని బంగ్లాకాంపౌండులోకి ఇరవైకార్లు ప్రవేశించాయి.
నియాన్ బల్బులు ,మెర్క్యురీ బల్బులూ, యల్ ఇడి బల్బులూ ,అక్కడక్కడా మూలల్లోనక్కిన సి సి కెమెరాలతో. ....హుందాగా కనిపిస్తున్న
ఆ బంగళా చక్కగా తీర్చిదిద్దిన పెద్ద హాలిడే రిసార్టు లా మెరిసిపోతోంది.
వర్మాగారి అన్నయ్యగారు తన స్వంత తమ్ముణ్ణి, ఆయనభార్యగారైన సౌహార్ద్ర తన స్వంతచెల్లెలు సౌలభ్యను ,అతిథుల్ని ,ప్రేమగా ఆహ్వానించారు.
భోజనాలు అయ్యాయి.అందరికీ గదులు ఏర్పాటు చేశారు.
పిల్లలంతా సంతోషంగా పడుకున్నారు.
కానీ .....
"కొక్కోరోక్కో కో"
అంటూ తెల్లవారు జాము నుండి మొదలయ్యే తొలికోడి కూతలు మలికోడికూతలు వినాలన్న ఆశతో ఆ సమయంకోసం ఎదురుచూస్తూ ఎవ్వరూ నిద్రపోలేదు.
తెల్లారగానే తాము చూడబోతున్న పల్లెటూరి విశేషాల గురించి కబుర్లు చెప్పుకుంటూంటే వాళ్ళ కళ్ళముందే తెల్లారిపోయింది.
అయినా.. ..
కోడికూత వినిపించకపోవటం తో అందరూ ఆశ్చర్యపోయారు.
** ** *** *** *** *** ***
"మమ్మీ డాడీ " " మమ్మీ డాడీ" "మమ్మీ డాడీ " "మమ్మీ డాడీ "అంటూ పిల్లలందరూ ఆందోళనగా అరుస్తూ పిలుస్తున్నారు.
'ఏ పామో తేలో కనిపిస్తే భయపడ్డారేమో' అనుకుంటూ పెద్దలంతా పిల్లల గదివైపు పరుగులుతీశారు తల్లిదండ్రులందరూ నిద్రమొహాలతోనే...
పిల్లలు అక్కడలేరు.
అరుపులు వినిపించే వైపు పరుగెత్తారు..
పిల్లలంతా బంగళా పైన టెర్రస్ పై కనిపించారు.
దగ్గరకు వస్తున్న పేరెంట్స్ వైపు కోపంగా చూస్తున్నారు వాళ్ళు
దగ్గరికి రాగానే .....
"మీరు మమ్మల్ని మోసంచేశారు"
అంటూ పిచ్చిగా అరిచారు పిల్లలు కోరస్ గా.
"ఇది ఇండియా కాదు.
ఈ ఊరు మాకు చూపిస్తామన్న రామరాజు పల్లె కాదు. !ఇదేదో హైటెక్ సిటీలోని కాలనీ.చూడండి!"
అంటూ ఎత్తైన ఆ బంగ్లాపై నుండి కనిపిస్తూన్న ఊరివైపు వ్రేళ్ళుచూపించింది పాశ్చాత్య.
"అయ్యో ఇది ఇండియానే .
రామరాజు పల్లే. ప్రపంచం తో పాటే ఊరూ మేము కూడా. మారటం తప్పు కాదు కదా తల్లీ!"
వర్మగారి అన్నయ్య భూపతి వర్మ బదులిచ్చాడు.
"అంటే..కోడి పందేలు చూడలేమా?"
"వాటితోనే వచ్చింది పల్నాటి యుద్ధం
అవి చట్టవిరుద్ధం!
జీవకారుణ్యం మానవధర్మం"
బదులిచ్చాడు మళ్ళీ.
"అంటే మా ఆశ నిరాశేనా?
మన తెలుగు సంస్కృతి ని ఇండియాలో ఇక చూడలేనా?"
ఏడ్పుగొంతుతో అంది వాత్సల్య.
"జాతీయరహదారికి ప్రక్కన సిటీకి చేరువలో వుండటంతో మన పల్లెలో ఈ మార్పు అనివార్యం"
నిట్టూర్చాడాయన.
"నిరాశ కు తావేలేదు.
గంగిరెద్దుల ఆటలు,సంక్రాంతి సంబరాలు అన్నింటినీ అందరికీ ...నేను దగ్గరుండి తీసుకెళ్ళి మరీ చూపిస్తాను!
మన సంస్కృతికి ప్రాణంపోస్తూ మన మారుమూలపల్లెలు ఇంకా బ్రతికేవున్నాయ్ "
అంటూ నవ్వుతూవచ్చింది భూపతివర్మగారి ధర్మపత్నియైన సౌలభ్యగారి అక్కయ్యపౌష్యలక్ష్మి .. అతిథుల్ని సంతృప్తి పరచటం తన ధర్మంగా భావిస్తూ ఆనందంగా కదలివస్తున్న తెలుగుతల్లిలా