ఉగ్ర ఘాతుకం
ఉగ్ర ఘాతుకం


పుల్వామా ఉగ్ర ఘాతుకం ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికులదినం ..మంచుకొండల్లో నెత్తుటి ధార.
పంజా విసిరిన ఉగ్రవాదం.
కశ్మీరులో ఆత్మాహుతి దాడి.
సిఆర్పిఎఫ్ పై జైషే దొంగదెబ్బ. 2547 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు 78 వాహనాల భారి కాన్వాయ్ తో
జమ్మునుండి శ్రీనగర్ లోయకు విధి నిర్వహణకు పయనమయ్యారు. మరో కొద్ది సేపటిలో గమ్యం చేరేవారే ...
అంతలోనే
350 కిలోల పేలుడు పదార్ధాలు నింపిన కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్ లోని ఓ బస్సును డీకొట్టింది.
పెను విలయం త్రుటిలో ..
ఒక్కజవాను మిగలలేదు.
అసలు బస్సే మిగలలేదు.
పేలుడు శబ్దం పన్నెండు కిలోమీటర్ల వరకు వినిపించింది.
అంటే పేలుడు తీవ్రతను అర్ధం చేసుకో వచ్చు.
పాక్ ప్రేరేపిత వుగ్రవాద తండా కష్మీర్ పై విసిరిన పంజా యిది.
కుటిల రాజకీయాలకు నిలయమైన పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరుల దారుణము యిది.
ఈదారుణానికి తామే కారణమని సిగ్గులేని జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
ఒకరిని నిందించే ముందు భారి పేలుడు పదార్ధాలతో దూసుకొచ్చిన
{S.U.V} స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ ను గుర్తించ లేని మన నిఘా వ్యవస్థను నిందించాలో, 49 వీర జవానుల మృతికి కారణమైన ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాలో అర్ధం కాని స్థితిలో భారతీయులు స్తంభించి పోయారు.
సంఘటనకు మూడు రోజుల ముందే హెచ్చరించిన అమెరికా నిఘా సంస్థ హెచ్చరికను ఖాతరు చేయని మన డిఫెన్స్ వ్యవస్థను ఏమనాలో,ఏమి చేయాలో నిర్ధారణకు రాలేని ప్రజలు గుండెలు బాదుకుని ఏడ్చినా,పొగిలి పొగిలి సొమ్మసిల్లినా వీరమరణం చెందిన ఒక్క జవానూ తిరిగిరాలేదు ,రాడు కూడా. 2001 తర్వాత ఉగ్రవాదుల దాడి యింత పెద్దఎత్తున జరగడం యిదే తొలిసారి.
దేశ రక్షణకోసం రాఫెల్ అంటూ పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికే సిగ్గు శరము లేని దేశనాయకులు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో వేచిచూడాలి.
దినపత్రిక చదివి ఉడుకుతున్న రక్తంతో రగిలి పోతున్నమాజీ జవాను భరత్ నిస్సహాయ స్థితి లో కన్నీటితో కంపించిపోయాడు.
“భరత మాతకు ముద్దుబిడ్డవు, వీరధాత్రికి వర పుత్రుడవు
కన్నీటితో కదిలిపోవడం వీర లక్షణం కాదు.
ఆవార్త నేనూ విన్నాను ,చదివాను స్పందించాను.
స్పందించి సహనం కోల్పోతే సమస్యకు పరష్కారం దొరకదు.
నాకొడుకు సాఫ్ట్ వేర్ వుద్యోగం చేయాలి,లక్షలు సంపాదించి నాకు రత్నాల సమాధి కట్టాలని కోరుకుంటున్న నేటి తల్లుల స్వార్ధ పరత్వానికి విరుద్ధంగా నా కొడుకు దేశాన్ని ,భరత మాతను రక్షించే వీర జవాను కావాలని నిన్ను సైన్యంలో చేరడానికి ప్రోత్సహించాము.
మా ఆశయం నెరవేర్చి ,దేశమాతకు ఒక చేతిని కానుకగా సమర్పించి వీరుడవై నన్ను వీరమాతను చేసావు. ధాత్రి అన్న నాపేరుకు వీర అన్న పదాన్ని జోడించి సార్ధకతను కల్పించావు.ఇప్పుడు నీతరుణం వచ్చింది.ఏమి చేయాలో ఆలోచించు.కన్నీటితో కరిగిపోవడం ,కంపించి పోవడం కార్య శూరుల లక్షణం కాదు.”
తన వాఘ్దాటితో హెచ్చరిస్తున్న తల్లి వంక నిస్సహాయంగా చూసాడు భరత్.
‘అమ్మా!చేయిలేని , చేతకాని వాడిని.ఒకప్పుడు వీరజవానునే. కానీ నేను యిప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయుడిని.”
భరత్ మాటల్ని కొట్టి పారేస్తూ
“మనిషికి మాటల్లో లేని మనోధైర్యం మనసులో వుంటుంది.
నీమనసును అడుగు .”
ధాత్రి హెచ్చరించింది.
“అమ్మా !నువ్వు ఒక రచయితవి,కవయిత్రివి. నువ్వు తలుచుకుంటే ఏదైనా రాయగలవు.కానీ నేను?ఏమి చేయగలను చెప్పు.”
“ముందే చెప్పాను. మనిషికి నిస్సహాయతే నిప్పువంటిది. అది మొదలైతే మొత్తం శరీరాన్నే దహించి వేస్తుంది.ఒక్కచేయి లేదని దివ్యాOగుడనని పెళ్లికి దూరయ్యావు.రెండు చేతులు లేని ఒక అమ్మాయి కాలితో కళాఖండాలు సృష్టిస్తూ దివ్యాOగులకు దారిచూపే మార్గదర్శి అయ్యింది.రెండు చేతులు లేని ఎందరో మిరకిల్స్ చేసి చూపిస్తున్నారు.
దివ్యాంగులు అంటే దివ్యమైన అంగము కలవారని కాదు భావం.
వున్న అంగాలనే దివ్యంగా మలచుకొని దివ్యమైన సృష్టిని సృష్టించే వారని.
వారితో పోల్చుకుంటే నువ్వు యెంతో అదృష్ట శాలివి. వయసు వుంది.ప్రేమించే మనసువుంది.
నీఅభిప్రాయాన్ని ఎప్పుడు కాదనలేదు.కానీ యిప్పుడు పరస్థితి వేరు.
నాకర్తవ్యం గా ఒక వీరజవానును భారత మాతకు అందించి..ఋణం తీర్చు కున్నాను.నువ్వు అంతకు మించిన త్యాగం చేసావు కాదనను.
కానీ దేశానికి మరో వీరజవానును అందించే శక్తి ఉండికూడా చేయలేకపోతున్నావు.”
“అమ్మా!తల్లిగా నువ్వు చూపించే ప్రేమ వేరు.కానీ నాకు భార్యగా వచ్చే స్త్రీలో నువ్వు చూపించే ప్రేమ వుండదు.అయినా ఒక చేతిని కోల్పోయిన నన్ను భర్తగా పొందడానికి ముందుకొచ్చే అమ్మాయి ఉంటుందా?”
“చక్కగా గుర్తుచేసావు.సమయానికి గుర్తుచేసావు.
నీమేజరు మామయ్య అమరేంద్ర విషయం చెప్పాలని వచ్చి ఉగ్రవాదుల దాడికి కంపించిపోయిన నిన్ను చూసి రచయిత్రి నై ఏదో మాట్లాడాను.
నువ్వు మిలటరీలోకి వెళ్లకముందు నుండి నిన్నే కలవరించిన అవని గురించి చెప్పాలనే ఫోను చేసాడు.
నాభర్త అశోకే అని అవని తెగేసి చెప్పిందట.
బావ తనకు ఒక చెయ్యి లేదని నన్ను కాదన్నాడని తెలుసు.
వీరుడికి నేను భార్యనై ,వీరత్వానికి సాయమందించే చేతినై గర్విస్తాను.
అని తెగేసి చెప్పిందట.”
“అమ్మా!నాస్వార్ధం కోసం ఒక నిండు జీవితాన్ని పాడుచేయడం నా దృష్టిలో పెద్ద నేరం.తనమీద ప్రేమలేక కాదు ..”
“అయితే ప్రేమించు వీరుడా.”
గుమ్మం లోనుండి వినిపించిన మాటలకు బిత్తరపోయి దిక్కులు చూసాడు భరత్.
అంత ఆచ్చర్యం వద్దుబావా.నేనే నీ అవనిని. పెళ్ళైన తర్వాత నా అవయవాల్లో ఏదైనా లోపం వస్తే నువ్వు నన్ను వదిలేసే వాడివా? అవునంటే నేను మరో మాట మాట్లాడను.వెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్పు నాకు కావలసింది నీచేయి కాదు.
భరత్ అనే వీరజవాను.ఒక జవానుకు భార్య అయ్యే భాగ్యం ఎంతమందిని వరిస్తుందో నాకు తెలియదు.కానీ నాముందున్న భాగ్యాన్ని కాలదన్నుకునేOత అవివేకిని కాదు. నువ్వు కాదంటే నేనూనీలాగే ఆజన్మ బ్రహ్మచారిణిగా వుండిపోతాను.”
అవని నిర్భయంగా,నిస్సంకోచంగా చెపుతుంటే జవాబు దొరకని భరత్
మ్రాన్పడిపోయాడు.
“అవనీ!నేను వాడికి అదే చెప్పాను.దేశానికి నేనో వీరజవాన్ను యిచ్చాను.నువ్వుకూడా మరో జవానును దేశానికి యిచ్చి దేశ భక్తి చాటుకోమని .నిన్ను భార్యగా అంగీకరిస్తే నీకు ద్రోహం చేసినవాడినిగా మారుతానని వాడి అనుమానం.”
ధాత్రి చెప్పింది.
“అత్తయ్యా!నేను నాన్నతో ,అమ్మతో ఎప్పుడో నా మనసులోని విషయం చెప్పేసాను. బావ భరత్ నే భర్తగా ఊహించుకొని పెరిగిన నేను ఒక చెయ్యి కాదు రెండు చేతులు లేకున్నా మనసు మార్చుకోనుఅని.
భరత్ కాదంటే యిలాగే వుండిపోతాను తప్ప మనసును వంచించుకో లేనని.
బావా!నిన్నుబలవంత పెడుతున్నాని అనుకోవద్దు.నామనసును నీముందు ఉంచాను. నీకు తెలియని అవనికాదు ,మనసుకాదు.
నిర్ణయం నీది. నిర్ణయం ఏదైనా మనస్పూర్తిగా స్వీకరిస్తాను.”
అవని మాటలు పూర్తిఅవుతుండగానే మాజీమేజర్ అమరేంద్ర వచ్చేసాడు.
“భరత్!అవనిమాటలు ఈనాటివి కాదు.అది తన మనసును ఎప్పుడో విప్పి చెప్పింది. నాచెల్లెలు ,నీ తల్లి ధాత్రి పెట్టిపుట్టింది.
వీరమాత అనిపించుకొని ,వీరధాత్రి అయ్యింది.
దానికి అన్నయ్యనైనా నాకు తనభాగ్యం దక్కలేదు.
అవని స్థానంలో కొడుకు పుట్టివుంటే నా వారసుడిగా దేశమాతకు అర్పించేవాడిని.
అయినా యిప్పుడు మించిపోయింది లేదు.భరత్ నువ్వు తలచుకుంటే అవనికి జీవితాన్ని,దాని ద్వారా ఒక వీర సైనికుడిని దేశానికి యివ్వగల అవకాశము నీచేతుల్లో వుంది.
దేశంలో నివసించే ప్రజలు గుండెలమీద చెయ్యి వేసుకొని ధైర్యంగా నిద్రపోవాలంటే దేశ సరిహద్దుల్లో జవానులు కావాలి.
మొన్న పుల్వామాలో ఒక వీర పుత్రుడిని పోగొట్టుకున్న తండ్రి తన రెండో కొడుకుని దేశంకోసం సైన్యములో చేరుస్తానని ప్రకటించి భారతీయుడిని అనిపించాడు. దేశ ప్రజలు కళ్ళు చేమర్చేలా చేసాడు. ఇప్పటికే నువ్వు చేసిన త్యాగం,దేశసేవ వర్ణనాతీతం.అయినా మరో అవకాశము నీపాదాలముందుకు వచ్చి ప్రాధేయ పడుతోంది.అదికూడా నా కూతురి రూపంలో.ఈ కలే గనుక సాకారమైతే నాకల ఫలించినట్లే.”
మాజీమేజర్ అమరేంద్ర సంతోషాన్ని వ్యక్త పరిచాడు.
“భరత్!నీకున్న అనుమానాలు ,అపోహలు అవని,మా అన్నయ్య మాటలతో తొలగిపోయి ఉంటాయని భావిస్తున్నాను.
నీకోసం చేయమనడము లేదు ,నువ్వు ప్రేమించే మన దేశంకోసం నిన్ను ప్రేమించే అవని కోసం అడుగుతున్నాము.నేను పొందిన భాగ్యము తనకు దక్కలేదని బాధ పడుతున్న అన్నయ్య కోరిక నెరవేర్చి దేశానికో జవానును ప్రసాదించమని అందరం కోరుకుంటున్నాము.”
ఏదో నిర్ణయానికి వచ్చినట్లు భరత్ చిన్నాగా నవ్వాడు.
“ధాత్రి ,అవని మీయిద్దరిపేర్లూ మనతల్లి భారతికి ముద్దు పేర్లే.
మీరు కోరుకున్న కోరికలు మనభరతమాత కోరికలుగా భావించి ఒప్పుకుంటున్నాను.కానీ మీరుకూడా నా కోరికను మన్నించాలి.”
దృడనిచ్చయంతో చెప్పాడు.
“కొడుకు కోరిన కోరికను మన్నించని మాతృ మూర్తి వుండదు.
అలాగే భర్త కోరికను కాదనే ధైర్యం యేభార్యకు వుండదు.
అడగరా భరత్ అడుగు.నిర్భయంగా అడుగు.”
ధాత్రి రెట్టించింది.
“అమ్మా!నాతోటి అమర జవానుల పిల్లలకు ఎందరో మహాను భావులు ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగస్తులు తమ జీతాలనుండి కోట్లాది రూపాయల్ని మరణించిన జవాన్ల కుటుంబాలకు సాయం అందిస్తున్నారు.
ఒకప్పటి క్రికెట్ లెజెండ్ వీరేంద్ర శేహ్వాగ్ అమరుల పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యాన్ని కల్పిస్తూ తన ఉదారతను చాటుకున్నాడు.
వీరే కాదు మనసున్న ప్రతి భారతీయుడు తన వదాన్యతను చాటుకుంటున్నాడు.
విదేశాలలో ఉంటున్న మన భారతీయులు, చలన చిత్ర హీరోలు,హీరోయిన్లు నిర్మాతలు తమకు చేతనైన సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
మనకున్న ఆస్తి నాకు ప్రభుత్వం యిచ్చిన అయిదు ఎకరాల బంజరు భూమి.
కాని ఆబంజరు భూమే ప్రభుత్వ సమర్ధత వలన నేడు బంగరు భూమిగా మారిపోయింది.”
“నువ్వు ఏమిచెపుతున్నవో ?ఎటు తీసుకు వెళ్తూన్నావో రచయిత్రి నైన నాకే అర్ధం కావడంలేదు నీభావ మేమిటో?కొంచం వివరంగా చెపితే సంతోషిస్తాము.నీవుద్దేశo సాయము అందించడమే అయితే ,
ఆ అయిదు ఎకరాలను వారికి యిస్తానన్నా నాకు ఎలాంటి అభ్యంతరము లేదు.”
ధాత్రి చెప్పింది.
“అమ్మా!నీకు అర్ధం కాని భాష నాకు తెలియదు.
నేను మాట్లాడే ప్రతిమాట నువ్వు పెట్టిన భిక్షే.
మనిషికి ధనం ,చదువు అత్యవసరమే .ఎవరూ కాదనలేని సత్యం.
కాని యివే జీవితం కాదు.
ప్రేమ,ఆప్యాత,యిదినాది అన్న ధీమా కావాలి.
అంటే ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక భరోసా కావాలి.
అందుకే అమరులైన నాతోటి సోదరుల పిల్లలందరికీ వీటిని పంచలేను..కానీ మామయ్య కోరిక తీర్చడానికి ఒక అబ్బాయిని అవని ముచ్చట తీర్చడానికి ఓఅమ్మాయిని దత్తత తీసుకోవాలనేది నా అభిప్రాయం. కనీసం యిద్దరికైనా జీవితాన్ని యివ్వగలననే ధైర్యం వుంది.
దీనికి మీరు అంగీకారం తెలిపితే అవనిని భార్యగా , కాదు కాదు అవనికి భర్తగా మారడానికి నేను సిద్ధమే.
అబ్బాయిని పెంచి మరో “అభినందన్” గా,అమ్మాయిని మరో స్క్వాడ్రన్ లీడర్ “స్నేహా షెకావత్” గా పెంచి దేశానికి సమర్పిస్తాను.
నేను కూడా మరో “సింహ కుట్టిననే” పేరు సంపాదిస్తాను.
అవనికి వీరమాతనని పిలుపించుకునే భాగ్యాన్ని కలగ చేస్తాను.
అబ్బాయికి అభిమాన్,అమ్మాయికి స్నేహ అని పేర్లు పెడతాను.
జైహింద్.
కళ్ళలో తిరిగిన ఆనంద భాష్పాలను ఆస్వాదిస్తూ భారత మాతను స్మరించు కుంటూ మరో లోకంలో విహరిస్తున్న భారత్ ను,
ఆనందంతో హటాత్తుగా వచ్చిన అవని భరత్ నుదిటిని ముద్దుపెట్టుకొని సిగ్గుల మొగ్గ అయ్యింది.
మాజీమేజర్ అమరేంద్ర తన వత్తైన గుబురు మీసాలను పైకి తిప్పుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.
ధాత్రి “భరతమాత” లాగ పులకరించి పోయింది.