EERAY KHANNA

Inspirational

4.8  

EERAY KHANNA

Inspirational

" కరోనా - ఓ ప్రేమ కథ "

" కరోనా - ఓ ప్రేమ కథ "

4 mins
1.5K


   " కరోనా - ఓ ప్రేమ్ కహాని "     - రాజేష్ ఖన్నా

================================


"       ప్రేమలేని కవితలల్లి

ప్రేమరాని కథలలొల్లితో

జీవితమొక నాటకమని

విధిరాతొక బూటకమని

వింతల్ని చూపేదో కటకమని

తాను ముఖ్యమనుకొన్న తనువుని

మన్నుగా చేసిందో కరోనా అణువు

కరుణలేని కరోనా నిర్లక్ష్యంగుంటే నిలువునా

అజాగ్రతగుంటే అట్టడుగునా పాతేస్తుంది

అయినా మనిషి మారడు

అలాగనీ తన వంతుని కోరడు

ఎవరికో అమాయకులకి అంటించిపోతాడు

చివరికి తనవాళ్లక్కూడా బిగిస్తాడా ఉరితాడు

మనిషి చదువుకొన్న మూర్ఖుడు

పరులహితాన్ని కోరని దౌర్భాగ్యుడు

తన కళ్ళముందే మనుషులు పిట్టల్లా రాలుతున్నా

బాధితుల, బంధువుల అర్తనాదాల్ని వింటున్నా

నిర్లక్ష్యంతో మనిషి బయటికీ రాకుండా మానడు

మారని మనిషి కోసం కరోనా మారదు

మానవలోకానికి విపత్తు మిగిలించకా మానదు......"

   అబ్బా.... ఏమి సాహిత్యం...ఏమి భావం... తెలుగు భాషకున్న అందమే వేరు. కవి, రచయితలెవరైనా కానీ వాళ్ళు రాసిన తెలుగు చదువుతుంటే తేనే తాగుతున్నంత హాయిగా ఉంటుంది....అని మనసులో అనుకొంటూ అక్కడి పనిఒత్తిడిని తట్టుకోడానికి తాను చదువుతున్న తెలుగు కవితని మూసి, డాక్టర్ గోపి తన పక్కనున్న కిటికీ గుండా బయటకి చూశాడు.

   అంతలోనే ఏదో ఆ కిటికీ పక్కన పడిన శబ్దంతో గోపి ఉలిక్కిపడి లేచి చూశాడు. ఎవరో ఒకమ్మాయి పడిపోయి కనిపించింది. ఆ శబ్దం విన్నవెంటనే అక్కడున్న ఐటిబిపి దళంలోని ఆఫీసర్స్ అంతా అక్కడికి చేరుకొన్నారు. కంగారు పడిపోయిన గోపి బయటికి రాబోయాడు. కానీ అప్పటికే ఆ యువతిని లోపలికి తీసుకొచ్చి బెడ్ మీదా పడుకోబెట్టారు. ఆ హఠాత్పరిణామానికి నోరెళ్లబెట్టిన గోపి అలాగే చూస్తుండిపోయాడు. " డాక్టర్ " అని అక్కడున్నవారు పిలిచేసరికి గోపి వడివడిగా ముందుకు నడిచి, ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం అందించాడు. 

     ఐటిబిపి రక్షణదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నవంటి ఢిల్లీలోని చావ్లా క్యాంపు కరోనా క్వారంటైన్ సెంటర్లో ఇటలీ నుండి వచ్చిన మూదొందల అరవైఆరు మందిలో దాదాపు తొంబైమందిని పద్నాలుగు రోజుల నిర్బంధంలో ఉంచారు. అందులో పూనమ్ పాథక్ అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు అక్కడి భద్రత సిబ్బంది అధికారి అసిస్టెంట్ కమాన్డెంట్ అనురాగ్ ఠాకూర్ చొరవతో   తృటిలో ప్రాణాపాయస్థితి నుండి బయటపడింది. అంతందమైన అమ్మాయి ఎందుకు చావాలనుకొందో అర్థం కాకా తలపట్టుకొన్నాడు అనురాగ్.

    పూనమ్ ఆత్మహత్య చేసుకోడానికి గల కారణం ఆమె మానసికంగా క్రుంగిపోవడమేనని తెలిసింది. ఆమె ఒక నెలరోజుల క్రితమే మహారాష్ట్రలోని తన సొంతూరు సతారాకి చైనా నుండి వచ్చి వెళ్ళింది. తాను తిరిగి వెళ్ళగానే వుహాన్ లో మృత్యువు కరోనా రూపంలో వీరవిహారం చేయసాగింది. వెంటనే అక్కడి యూనివర్సిటీలన్నీ సెలవులు ప్రకటించాయి.

     భారత ప్రభుత్వం, చైనాలోని  వుహాన్ నగరంలో దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొన్న భారతీయుల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చి మంటేసారులో కొందరిని, చావ్లా క్యాంపులో మరికొందరిని ఉంచారు. అక్కడున్న వాళ్లందరికీ కరోనా ఖచ్చితంగా వచ్చిందని ఎవరూ చెప్పలేరు, అలాగే రాలేదని కూడా ఎవరూ చెప్పలేరు. కనీసం పద్నాలుగు రోజులు ఆగాలి. అప్పుడే ఆ కరోనా వైరస్ ప్రభావం బయటపడ్తుంది.

      పూనమ్ ఆత్మహత్య చూసుకొనేంత పిరికిదానిలా కనిపించలేదు. కానీ ఆమెని ప్రేరేపించినా విషయాలు వేరే ఉన్నాయని గమనించినా డాక్టర్ గోపి, భద్రత అధికారి అనురాగ్ ఠాకూర్ కలిసి ఆమెని అసలు కారణం చెప్పమని అడిగారు.

     " మా సొంతూర్ మహారాష్ట్రలోని సతారా. మెడిసిన్ చదవడానికనీ చైనా వెళ్ళాను. నా పెళ్లి దగ్గర పడ్తున్న సమయంలో కూడా పరీక్షలనిమిత్తం నేను చైనాకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ఇంట్లో అందరూ ఆ సమయంలో వెల్లొద్దని వారించారు కూడా. అక్కడా నాకేం జరుగుతుందిలే, నేను పైగా డాక్టర్ని కదా అనుకొన్నాను. నా తిరుగుప్రయాణాన్ని ఎంతో సులువుగా ఊహించుకొన్న నేను,  అక్కడికెళ్ళగానే కరోనా వైరస్ స్టేజి మూడు నుండి నాలుగుకి చేరేసరికి భయంతో బెంబేలెత్తిపోయాను.

        నేను ఇప్పుడిప్పుడే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాను. ఆ విషయం తెలియగానే నన్ను చేసుకోబోయేవాడు పెళ్లిని రద్దుచేసుకోవడమే కాకుండా నన్ను ఇక్కడే చావమన్నాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. వద్దని చెప్పినా కూడా వెళ్ళావు, ఇప్పుడు అనుభవించు అంటున్నారు. 

    నాకు కాబోయే మామగారిక్కూడా జ్వరం రావడంతో అది నా వల్లనే వచ్చిందని  నన్ను దారుణంగా తిట్టారు. నేను నెలక్రితం వచ్చాను. నా వల్లా కరోనా వాళ్లందరికీ వస్తే ఇప్పటికే తేలిపోయేది. కానీ ఎవరికీ ఏం కాలేదు. కాబోయే మామయ్యకి కేవలం జ్వరం రాగానే అది కరోనానే అని భయపడి నానా హంగామా సృష్టించారు. నన్ను చేసుకోబోయేవాడు మా నాన్నని చంపేద్దామనే వచ్చావా అని తిట్టాడు.

     మా తల్లిదండ్రుల్ని కూడా నానారకాలుగా దూషించారు. మా ఊర్లో కూడా మా ఇంట్లోవాళ్ళందరిని ఎవరూ కలవడానికి ముందుకు రావట్లేదు. ఎప్పుడూ కోలాహలంగా, కలగొల్పుగా మాట్లాడిన బంధువులతో బ్రతికిన మా తల్లిదండ్రులు ఒక్కసారిగా అలా వెలివేసినవారిలా బ్రతడానికి భయపడిపోయారు.

   ఒంట్లో ప్రాణముండికూడా జీవచ్ఛవాల్లా వాళ్ళు బ్రతకలేకపోయారు. నేను మళ్ళీ చైనా వెళ్లకుండా అక్కడే ఉంటే బాగుండేదేమో. చివరి పరీక్షలు అయిపోతే ఒక పనైపోతుందనుకొన్నాను. కానీ నేను తీసుకొన్న నిర్ణయం నా జీవితాన్నే తలక్రిందులు చేస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నా పరిస్థితిని చక్కదిద్దుకొనే మార్గం నాకు కనిపించట్లేదు.

    నేను ఇప్పుడు ఇంటికి వెళ్లినా నన్ను అనుమానంగానే చూస్తారు. నా వల్లా ఎవరికైనా ఆపద వస్తుందనే భయంతోనే బ్రతుకుతారు. నాలా చాలామంది ఇలాగే ఇంట్లోవాళ్ళు ఎంతగా చెప్తున్నా వినకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతూ, సరదాకోసం స్నేహితుల్ని కలుస్తూ ఎందరికో భారం అవ్వడానికి బజార్లో బలాదూరుగా తిరుగుతున్నారు.

    నేను కూడా అందరిలాగే అనుకొన్నాను. ఏదో తప్పు చేస్తేనే వచ్చే ఎయిడ్స్ లాంటి వ్యాధి కాదిది. కొద్దిపాటి నిర్లక్ష్యం చాలు. ఆ ఒక్కరూ ఎంతోమందికి తనకి తెలియకుండానే అంటించేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా ఇంకొంతమందికి అంటిస్తారు.

  ఇప్పుడైతే వందల్లో ఉన్నారు కాబట్టి, ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తూ ఎలాగో ప్రభుత్వం ఆదుకొంటోంది. అదే వేలల్లో, లక్షల్లో అయితే వాళ్లందరికీ ఎక్కడంటూ చికిత్స నందించగలరు?.

    అప్పుడు మరణాలు ఎక్కువైతాయి, దేశం అతలాకుతలం అవుతుంది, ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుంది. ఏ ఇతర కారణాల వల్లనైనా దగ్గు జ్వరం వచ్చినా వాళ్ళని కూడా అనుమానించడం మొదలౌతుంది. కొంతమంది భయంతోనే చనిపోతారు. ఇదంతా జరిగేది ఒక్కరి నిర్లక్ష్యం వల్లనే కావచ్చు.

   ఆ ఒక్కరు పరోక్షంగా దేశద్రోహి అవుతాడు. కాలానుగుణంగా దేశ సంస్కృతి,  ఆచారాలు విదేశీ సంస్కృతి వల్లా కలుషితమైతేనే తమ దేశం తమ సంస్కృతి అని గగ్గోలుపెట్టే దేశభక్తులంతా కరోనా విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా, వాళ్లంతా అతిపెద్ద దేశద్రోహులకిందే లెక్కా.

  నమ్మేది ఏ మతమైనా, పూజించేదే దేవుడైనా ఇలాంటి పరిస్థితిల్లో కూడా మతం గొప్పా, మా దేవుడు గొప్పా....ఎదుటివారి దేవుడి వల్లనే ఇలా జరుగుతోంది అని పోట్లాడే దేవుడి భక్తులంతా దేశభక్తులవ్వగలరా?. 

నిజమైన దేశభక్తులెవరంటే, ఇలాంటి ఆపత్కాలినా పరిస్థితుల్లోనూ ప్రభుత్వఉత్తర్వుల్ని తూచా తప్పకుండా పాటించేవారు మాత్రమే. వైద్యా, రక్షణ సిబ్బంది, నిస్వార్థంగా ప్రభుత్వాదేశానుసారం పనిచేసేవారు మాత్రమే ఇప్పటి పరిస్థితిలో నిజమైన దేశభక్తులు. వాళ్లంతా ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నారు.

      కానీ చాలామంది నాలాగే, దేశభక్తంటే తమ దేవుడు, మతం గురించి మాట్లాడటమే అనుకొంటారు. కానీ ప్రభుత్వఉత్తర్వుల్ని పాటించడం అనుకోరు. తనకేమైనా ఫర్వాలేదు కానీ, తమ సొంతదేశ పౌరుల్ని ఎలాగైనా కాపాడాలనుకొనే తపనికి మించిన దేశభక్తి ఎక్కడుంటుంది. నేను నా స్వార్థం వల్లా, కరోనా వైరస్ నాకు ఉందనే అనుమానం వచ్చినా కూడా నా దేశానికొచ్చి, పెద్ద ద్రోహం చేశాను. అందుకే నాకు బ్రతికే అర్హతా లేదనుకున్నాను...."  అని పూనమ్ చెప్తుంటే అనురాగ్ ఆమెనలా చూస్తుండిపోయాడు.

     " మీరు చెప్పిందాంట్లో చాలా విషయం ఉందండి. కానీ ఆత్మహత్య చేసుకునేంతైతే లేదు..." అనురాగ్ ఆమెని శాంతపర్చబోయాడు.

 

    డాక్టర్ గోపి మళ్ళీ తన చేతిలో ఉన్న కవితల పుస్తకాన్ని తెరిచి నిర్బంధంలో ఉన్న మిగతా వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. పూనమ్ ఏడుస్తుండటం చూసి అనురాగ్ తట్టుకోలేకపోయాడు. ఆమెనెలాగైనా ఓదార్చాలనుకొన్నాడు. 

    " నాకే ఇలా ఎందుకు జరిగింది. ఇక నన్నెవరు పెళ్లి చేసుకొంటారు. నాకు కాబోయేవాడు వేరే అమ్మాయిని చూసుకొన్నాడు. అప్పటివరకు తను ప్రేమించిన అమ్మాయిని ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నాకిలా జరగ్గానే, ఆ అమ్మాయిని సంతోషంగా ఒప్పుకొన్నారు. పోనిలే, నా వల్లా వాళ్ళిద్దరి ప్రేమైనా గెలిచింది  అదే నాకు మిగిలిన సంతోషం...." అని ఏడుస్తుంటే,

   " మీరు అనుకొంటే ఇంకో సంతోషం కూడా దొరుకుతుంది. కరోనా వచ్చినంతా మాత్రానా చావే పరిష్కారం కాదు. దాని నుండి బయటపడటానికి సంకల్పం ఉంటే చాలు.

      మీకు అభ్యంతరం లేకపోతే.... మిమ్మల్ని నేను పెళ్లి చేసుకొంటానండి. మిమ్మల్ని మహారాణిలా చూసుకొంటాను.... " అనురాగ్ గద్గదస్వరంతో అన్నాడు.

   అతని మాటలకి ఆమె పెదాలమీదా ఏదో అంతుతేలని చిరునవ్వు తళుక్కునా మెరిసింది. అంతలోనే డాక్టర్ గోపి వచ్చి,

  " ఎందుకమ్మా !....ప్రాణాలు తీసుకోవాలనుకొన్నావు. నీకు కరోనా నెగటివ్ వచ్చింది. నీకు వచ్చింది మామూలు జ్వరమే.... అయినా ఈ పద్నాలుగు రోజులు డాక్టర్ల పర్యావేక్షణలోనే ఉండటం మంచిది. ఎందుకంటే నీవన్నట్లు బయట జనాలు ఊరికే భయపడ్తారు. నిన్ను  జ్వరం తగ్గేవరకూ ప్రత్యేకమైన గదిలో ఒంటరిగా ఉండే వెసులుబాటు కల్పిస్తాను... " అని చెప్పేసరికి

    " థాంక్ యూ డాక్టర్.... థాంక్ యూ సో మచ్...." అని కన్నీళ్లు తూడ్చుకొంది.

     " అయ్యో!....పూనమ్ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు?... " అనురాగ్ తమాషాగా అడిగాడు. 

   " ఈ అనుమానం వల్లా అన్నీ పోగొట్టుకున్నాను....నా అదృష్టం బాగుండి నాకు నెగటివ్ వచ్చింది. ఒకవేళా పాజిటివ్ వచ్చి ఉంటే బాధ్యత లేకుండా బలాదూర్ గా తిరిగానని అనేవారు. ఒక రకంగా ప్రభుత్వానికి భారమయ్యేదానిని... " అని వాపోయింది పూనమ్. 

  అనురాగ్ సలహామేరకు వెంటనే పూనమ్, సతారాలో ఉన్న తన తల్లిదండ్రులకి ఫోన్ చేసింది.

   " అమ్మా!... నాకు కరోనా వైరస్ సోకలేదు. నాకు వచ్చింది మామూలు జ్వరమే. నా పెళ్లి రద్దయ్యిందని బాధపడకండి. మీకు అంతకంటే మంచి అల్లుడు దొరికాడు. అతని నా పక్కనే ఉండి నా బాగోగులు చూసుకొన్నాడు. చాలా మంచివాడు.... నాకు జ్వరం తగ్గాకా ఇక్కడే డాక్టర్ గా నిస్వార్థంగా సేవలందించాలనుకొంటున్నాను. భయంతో కొంతమంది డాక్టర్స్ సెలవు మీదా వెళ్లారు....." పూనమ్ మాటలు విన్నాకా అనురాగ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

   " నీ సంకల్పం చాలా గొప్పది. అందుకే రెండస్తుల నుండి దూకినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డావు. కరోనా వచ్చిందనుకొని జీవితమే పోయిందనుకొన్న నీకు కరోనా కూడా లేదు. నీ ప్రేమ ముందు కరోనా ఏంటి.... ఏ భూతం కూడా ఏమిచేయలేదు.... "  నవ్వాడు అనురాగ్.

     అలా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఇలాంటి ప్రేమికులు, దేశభక్తులున్న భారతావని నుండి పారిపోవాలని కోరుకొందాం. 

===========సమాప్తం========

ధన్యవాదములతో 

మీ 

-రాజేష్ ఖన్నా

  

    


Rate this content
Log in

Similar telugu story from Inspirational