అనగనగా ఒక రాజు - ఏడుచేపల కథ
అనగనగా ఒక రాజు - ఏడుచేపల కథ
ఏవండీ. ఎప్పుడూ ఆ పేపరు చదవకపోతే కాస్త పిల్లాణ్ణి పట్టుకోండి. నేను వంట చేసుకుంటుంటే వీడు వంట గదిలోని సామాను చిందరవందర చేస్తున్నాడు అని వనజ తన శ్రీవారికి పని పురమాయించింది.
శ్రీధర్ చూస్తున్న పేపరు పక్కన పెట్టి కొడుకును దగ్గరకి పిలిచాడు.
చింటూ. నీకు ఐదేళ్లు దాటాయి. ఇంకా అల్లరేమిటి నాన్నా అని పిల్లాడికి చెబుతున్నాడు.
ఎంత చెప్పినా చింటూ అటూ ఇటూ పరుగెత్తడం మానలేదు. ఇక విసిగిపోయి శ్రీధర్ పిల్లాణ్ణి మచ్చిక చేసుకోవడానికి చింటూకి ఏం కావాలో అడిగాడు.
చింటూ : మరీ.. నాన్నా కథ చెప్పు.
శ్రీధర్ : అనగనగా ఓ రాజు.
చింటూ : రైజింగ్ రాజా నాన్నా?
శ్రీధర్ : కాదురా. నీ ఫ్రెండ్ సన్నాసి రాజు. నోరు మూసుకుని విను. నువ్వూ నీ ఆటో పంచులూ.
వనజా! అందుకే పిల్లాణ్ణి టీవీ ముందు ఎక్కువ కూర్చోబెట్టద్దు అని చెప్పింది అని వనజకు వినపడేలా అన్నాడు.
చింటూ : నాన్నా. కథా..
శ్రీధర్ : ఆ రాజుకు ఏడు మంది కొడుకులు.
చింటూ : అందరి పిల్లలకూ అమ్మ ఒక్కరేనా?
నాన్న : లేదురా. అమ్మలందరూ మా పిల్లాణ్ణి అప్పగించమని కోర్టులో కేసు వేశారు. నువ్వు పెద్ద రామ్ జెఠ్మలానీ కదా. వెళ్ళి వాదించు. బడుద్ధాయి. విను అంతే.
వనజా! ఆ కోర్టు కేసులు గొడవలు ఉండే టీవీ షోలు చూడొద్దన్నానా. ఇప్పుడు చూడు పిల్లాడు వెధవ లా పాయింట్లు సందేహాలుగా అడుగుతున్నాడు అని వనజకు ఉపదేశం చేశాడు.
చింటూ : కథ చెప్పు నాన్నా..
శ్రీధర్ : ఆ ఏడుగురు కొడుకులూ వేటకు పోయి ఏడు చేపలు తెచ్చారు.
చింటూ : బొమ్మిడాయలా మట్టగిడసలా నాన్నా?
శ్రీధర్ : తిమింగలాలు తెచ్చారు. ఏం నువ్వు తింటావా?
చింటూ : అమ్మ ఇది కార్తీక మాసం, నీచు తినకూడదు అని చెప్పింది నాన్నా.
శ్రీధర్ : అబ్బబ్బా. ఏమి మాతృభక్తిరా నాయనా.
వనజా? వీడు మనబ్బాయి కాదేమో. ఏ యక్షుడో వచ్చి ఉంటాడు. నన్ను పరీక్ష చేయడానికి అని నసిగాడు శ్రీధర్.
ఆ వస్తాడు. మనకుండే అరెకరం పొలం కోసం యక్షుడూ గంధర్వుడూ అందరూ వస్తారు అని సణుక్కుంది.