శివయ్య నేతిగారెల కోరిక
శివయ్య నేతిగారెల కోరిక
రామాపురంలో శివయ్య, గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్ళు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, శివయ్యకు పొరిగింటి నుంచి కమ్మని నేటి గారెల వాసన వచ్చింది.
నోట్లో నీళ్లూరుతుండగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి, భార్య వడ్డించిన రాగి సంగటిని చూసి, 'నాకు నేతిగారెలు తినాలని ఉంది.' అంటూ సంకటిని దూరంగా నెట్టాడు.
'మనమేమన్న శ్రీమంతులమా ఏమిటి? పూట గడవని మనకు నేతిగారెలు అత్యాశే,' అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటి తిన్నాడు.
ఆ సంవత్సరం జమీందారు, తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తి అయిపోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది. తన భార్యని పెరట్లోకి పిలిచి, 'ఏమేవ్! శ్రద్ధానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు. సాయంత్రానికి కొన్నయినా మిగులుతాయి కదా. ఈ రోజుకి నేతిగారెలు తినే యోగం వచ్చిం'దని సంబరపడిపోయాడు.
బ్రాహ్మణుల భోజనం అయిపోయాక, కొన్ని పిండివంటలు, గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏమి చేద్దామని అనుకుంటుండగా, 'అయ్యా, శ్రద్ధ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే, దగ్గరలోని చెరువులో వదిలేయండి పితృ దేవతలకు చేరుకుంటాయి,' అన్నాడు బ్రాహ్మణుడు.
