M.V. SWAMY

Children Stories

3  

M.V. SWAMY

Children Stories

నిజంగా పండగే

నిజంగా పండగే

2 mins
266



     నిజంగా నాగుపాములకు పండగే (కథ)


సంబంగి సర్పరాజు పాములను పట్టుకొని వాటి కోరలు పీకేసి, ఆ పాములకు ఆటలు నేర్పి, ఆ పాములను ఊరూ... వాడా తిప్పి పాముల ఆటలతో జనాలను మెప్పించి వారిచ్చే కానుకలు, పైసలుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.చిన్నతనం నుండి నాగస్వరం పలికించడంలో నిష్ణాతుడు అవ్వడంతో అతని నాగస్వరం వినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపేవారు, పాములాటవల్ల వచ్చే రాబడితో సర్పరాజు కుటుంబ పోషణ మాత్రమే కాకుండా కాస్తా డబ్బులు సంపాదించుకొని స్ధితిమంతుడు కూడా అయ్యాడు."మన బ్రతుకులు ఎలాగూ పాములు చుట్టూ తిరుగుతున్నాయి, మన అబ్బాయి బ్రతుకు అలాకాకూడదు, వాడిని చదివించి, విద్య, విజ్ఞానం, వివేకం ఇచ్చి వాడికి మంచి భవిష్యత్ ఇద్దాం"అని సర్పరాజు భార్య నాగమణి పోరు పెట్టడంతో, కొడుకు నీలకంఠంని బడికి పంపుతున్నాడు సర్పరాజు.నీలకంఠం ఇప్పుడు పదోతరగతి చదువుతున్నాడు, స్వతహాగా పాముల వారి ఇంటినుండి వచ్చాడు కాబట్టి, ఎక్కువగా బయాలజీ, జూయోలజీ, జియోలజీ, ఇథోలజీ, ఆర్నితోపోలజీ వంటి అంశాలపై చాలా శ్రద్ద చూపేవాడు, అందుకే నీలకంఠం బయోలజీ మాస్టర్ సుందర్ నాద్ నీలకంఠంకి అతనికి ఆసక్తి ఉన్న అంశాలను వివరంగా చెబుతూ, బడి గ్రంథాలయంలో రిఫరెన్సు బుక్స్ కూడా అతనికి ఇచ్చేవాడు, ఆ విధంగా నీలకంఠంకి జంతువులు పక్షులు కీటకాలు మీద మంచి అవగాహన వచ్చింది. నీలకంఠం తండ్రి సర్పరాజు నాగుల చవితి రోజుకి ఎక్కువ పాములు సేకరించేవాడు, వాటికి విషపు కోరలు లేకుండా చేసి, నగరంలోని ముఖ్యకూడల్లులో పాములు ఆడిస్తూ, నాగుల చవితి పండగ మీద విశ్వాసం ఉన్నవారు ఇచ్చే కానుకలు తీసుకునేవాడు, కృత్రిమంగా పాములు పుట్టలు తయారుచేసి పాముల్ని అందులో దించి పాములచే చిత్ర విచిత్ర విన్యాసాలు చేయించి మంచి రాబడి సంపాదించుకునేవాడు, అవసరమైతే కొంతమంది బంధువులను రప్పించుకొని వారి సాయంతో నాగులచవితి పాముల ఆటలను నగరంలోని అన్ని కూడల్లులోనూ రక్తి కట్టించేవాడు.


     నీలకంఠంతో సహా కొంతమంది విద్యార్థులను కలిపి విజ్ఞాన సమితిని ఏర్పాటు చేశాడు సైన్సు మాస్టర్, నాగుల చవితి రోజు భక్తులు పొసే పాలు, నీరు,గుడ్లు, చిమిడి వగైరాలు వల్ల, దీపధూప నైవేద్యాలు వల్ల, పుట్టలు వద్ద కాల్చే టపాకాయలు వల్ల పాములకు హాని కలగకుండా భక్తులకు అవగాహన కలిగించడానికి టీమ్ ని నగరంలో తిప్పి ప్రచారం చేయించాడు. నీలకంఠం నాయకత్వంలో ఎక్కువ మంది విద్యార్థినీ విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి నాగుల చవితి రోజు ఉదయాన్నే ప్రచారం మొదలుపెట్టారు, ముందుగా సర్పరాజు ఇంటికే వచ్చి, నీ రాబడి కోసం మూగ జీవులు పాములను హింసించడం మంచిదికాదు అని హితవు పలికారు, ఆ విషయంలో తండ్రి సర్పరాజుకి కొడుకు నీలకంఠంకి వాదోపవాదాలు జరిగాయి, గతాన్ని మర్చిపోదాం,మనకు ఇప్పుడు స్థోమత ఉంది కావున వేరే వ్యాపారులు లేదా ఉపాధి వృత్తి చేసుకుందాం, పాములను అడవిలో వదిలేద్దాం,పాములు ఆటవద్దు అని నీలకంఠం తండ్రికి చెప్పాడు.సర్పరాజు వినలేదు, నాగుల చవితి రోజు పాముల ఆటలను నీలకంఠం అండ్ టీమ్ అడ్డుకుంది వారికి పోలీసులు, పర్యావరణ పరిరక్షణ సమితి, స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం తెలపగా, భక్తులు సహకరించి, సాంప్రదాయం ప్రకారం నాగుల చవితి చేసుకున్నారు కానీ పాముల జోలికి పోలేదు. నీలకంఠం, సర్పరాజు మధ్య జరిగిన సంవాదం ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. జిల్లా కలెక్టర్, నీలకంఠం మరియు సైన్స్ మాస్టర్ ని పిలిపించి అభినందనలు తెలిపారు. అప్పుడు నీలకంఠం నేను పర్యావరణ పరిరక్షణకు, జీవకారుణ్యంకి ప్రయత్నం చేసినందుకు, మీ అభినందనలు పొందినందుకు సంతోషమే కానీ మా నాన్నగారు కులవృత్తిని మాని పాములను వదులుకుంటే ఉపాధి కోల్పోతాడు అదే బాధగా ఉందని అన్నాడు. అప్పుడు కలెక్టర్ నీలకంఠంని సముదాయించి, నాగస్వరం వినడానికి బాగుంటుంది, దాన్ని నేర్చుకోడానికి చాలా మంది ఇష్టపడతారు కాబట్టి నేను నాగస్వరం వాయిద్య కళాశాల పెట్టిస్తాను, అందులో మీ నాన్నకి ప్రముఖ పాత్ర ఇచ్చి, అతని లాంటి వృత్తిదారులకు ఉపాధి చూపుతాను అన్నారు. నీలకంఠం ఆనందపడ్డాడు. ఇంటికి వచ్చి తలిదండ్రులకు కలెక్టర్ మాటలు చెప్పి వారిని ఒప్పించి, రెండోరోజు వాళ్ళను కలెక్టర్ వద్దకు తీసుకొని వెళ్లారు. అప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినీ విద్యార్థులు నీలకంఠంని మెచ్చుకొని నాగులచవితి నేటికి నిజంగా పాముల పండగ అయ్యింది, భక్తి పేరిట పాములను హింసించే ఆచారాలు తగ్గుముఖం పట్టాయని అందరూ చర్చించుకున్నారు.


...



Rate this content
Log in