హ్రృదయ ముళ్ళు
హ్రృదయ ముళ్ళు
ఓ ధనిక వ్యాపారి ఇంద్ర భవనం లాంటి ఓ ఇంటిని నిర్మించుకొని అందులో ఉండేవాడు.
ఓ రోజున అటుగా వెళ్తున్న ఓ సన్నటి వంగి పోయిన ముసలావిడ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందా అని అడిగింది ఆ ఇంటి యజమానిని.
యజమాని - అమ్మా! నీ వయస్సే సుమారుగా 70-75 ఉంటాయి. నువ్వు ఏం చెయ్యగలవు?
ముసలావిడ - చేస్తాను అయ్యా. నాకు ఇది చాలా అవసరం. రోజు రెండు పూటలా భోజనం పెట్టి, నీకు తోచినంత ఇవ్వు అయ్యా!
యజమాని inner voice - ఈమె కి అయితే కొంచెం భోజనం పెట్టి, తక్కువ డబ్బులు ఇస్తే చాలు. నాకే లాభం.ఎవరూ లేనట్లు ఉన్నారు సెలవలూ ఇవ్వకరలేదు.
యజమాని - సరే అమ్మా.
ముసలావిడ - అయ్యా! నెలకు ఒక అర రోజు సెలవ కావాలి.నాకు నెల జీతం నేను సెలవు తీసుకునే ఆ అర రోజున కావాలి అయ్యా.
యజమాని - సరే అమ్మా.
అలా ఆమె ఉద్యోగంలో చేరింది. రోజులు గడుస్తున్నాయి.
ఆమె తో ఇంట్లో పని అంతా చేయించుకొనేవారు. మిగిలిన చల్లని అన్నం, పాడైపోయిన కూరలు అవీ ఇవీ పెట్టే వాళ్ళు. ఆమె ఏం మాట్లాడకుండా తిని పని చేసేది.
అలా నెలలో ఓ రోజు ఎక్కడికో వెళ్ళి వచ్చేది.
ఓ రోజున వెళ్లి తిరిగి వచ్చాక యజమాని తో ఇలా అడిగింది
"అయ్యా! వచ్చే నెల ఒక మూడు రోజుల పాటు ఊరిలో ఉండి వస్తా.ఊరిలో......"
ఆమె ను మధ్యలోనే ఆపి ఇలా అన్నాడు " వచ్చే నెల చాలా పని ఉంది. అన్ని రోజులు కుదరదు. రాలేను అంటే మానేసి వెళ్లిపో."
ముసలావిడ - సరే అయ్యా. సెలవు అక్కర్లేదు.
అలా ఆరు మాసాలు గడిచాయి.
ఎప్పటి లాగానే వెళ్లి వస్తా అని వెళ్లింది కాని మళ్ళీ రాలేదు. యజమానికి ఆమె ఊరి పేరు తప్ప ఏమీ తెలియదు.
కొన్ని రోజులు గడిచాయి.
యజమానికి- అసలు ఆమె ఎందుకు రాలేదు , జీతం కూడా తీసుకుంది కదా అని అనుకుంటాడు. అటుగా వెళుతున్నాను కదా ఊరిలోకి ఓ అడుగు వేస్తాను అనుకుంటాడు.
ఆ ఊరికి వెళ్ళాడు. అలా నడుస్తూ ఉండగా ఓ శ్రద్ధాంజలి బ్యానర్ కనపడుతుంది. అందులో ఓ ముసలాయన, ఈ ముసలావిడ చిత్రాలు ఉంటాయి.యజమానికి ఒక్క క్షణం భాధగా అనిపిస్తుంది.
ఆమె కథ ఏంటి, ఎలా చనిపోయింది, ఆ పక్కనే ఉన్న ఆయన ఎవరు, ఆ వయస్సులో ఎందుకు పని చేయటానికి వచ్చింది అని అడుగుతాడు అటుగా వెళుతున్న ఓ ఊరి అతన్ని.
కూర్చోండి అయ్యా చెప్తాను! ఇంతకీ మీరు ఎవరూ? అంటారాయన.
నా దగ్గరే పని చేసేది ఈమె.
ఊరి ఆయన - అవునా అయ్యా! ఇప్పుడే వస్తాను అయ్యా.
ఎటో వెళ్ళి కాసేపటికి చేతిలో ఓ చిన్న సంచితో వచ్చి యజమాని చేతిలో పెట్టి "తరువాత చూడు అయ్యా. ఇది మీకు చేరవేయటమే ఆమె చివరి కోరిక"
ఊరి ఆయన " ఆమె పేరు మంగమ్మ. ఆ ముసలాయన ఆమె భర్త. వీరికి ఒక కొడుకు. అతన్ని బాగా చదివించి పట్నం పంపారు. అతను వ్యసనాలకు బానిసై పట్నం లోనే ఉండేవాడు. వీరిని ఏనాడూ పట్టించుకోలేదు. వారి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం.ముసలాయనకి జబ్బు చేసింది. ఇక్కడ వచ్చే డబ్బు వైద్యానికి సరిపోక పట్నం లో పనికి వచ్చింది. రెండు నెలలుగా ఆయన ఆరోగ్యం మరీ క్షీణించింది. సరే వచ్చే నెల ఎక్కువ సెలవులు పెట్టి ముసలాయన తో ఉండాలి అనుకుంది కానీ సెలవు దొరకలేదు. ఎప్పటి లాగానే వచ్చి వెళ్లింది. ఆమెకు తెలుసు ఏమో మళ్ళీ వచ్చే నాటికి భర్త ఉండడని. మళ్ళీ వచ్చే రోజున ఆయన మరణించారు.ఆమె ఆయన కర్మకాండలు చేసింది. తిరిగి వచ్చాక ఆమె ఆత్మహత్య చేసుకుంది."
యజమాని చాలా భాధగా ఆ సంచి తీసుకుని ఇంటికి వెళ్తాడు.
ఇంటికి వచ్చిన తరువాత ఆ సంచి తీసి చూస్తే అందులో ఓ లెటర్ ఉంది.
అందులో " అయ్యా! ఇది నిన్ను చేరుతుందో లేదు తెలియదు. ధన్యవాదాలు. నాకు పని ఇచ్చారు. భోజనం పెట్టారు. రుణం ఉండకూడదు అయ్యా. మీరు ముందుగా జీతం ఇస్తారు గా అందులో మిగిలిన డబ్బులు. ఇవి మీరు తీసేసుకోండి.నువ్వు సంతోషంగా ఉండాలి"
యజమాని కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆమె నిజాయితీ చూసి.
నేను నా స్వార్థం తో ఆమెకు తక్కువ డబ్బులు ఇచ్చి వాడుకున్నాను, అన్నం కూడా సరిగ్గా పెట్టలేదు. ఆమె అడిగిన రోజు మొత్తం విని సెలవు ఇచ్చి ఉండాల్సింది అని ఏడుస్తూ ఉంటాడు.
ఆ బాధ, పశ్చాత్తాపం వెంటాడుతూనే ఉంది యజమానిని.
