విలువ
విలువ
అనగనగా........... కారుణ్యమని అనే రాజ్యంలో.....
దిలీపుడు.... అనే రాజు ఉండేవాడు.
దిలీపుని ప్రధానమంత్రి వయో భారంతో........ తన పదవిలో నుండి తప్పుకొని...... ఆ పదవికి తగు అధికారిని నియమిస్తే బాగుంటుందని....... రాజు గారికి చెప్తాడు.
తన వంటి యోగ్యుడిని...... వెదికే పనిని రాజు ప్రధానమంత్రిపైనే పెట్టాడు.
రాజుగారి కొలువులో ఉద్యోగావకాశాలు ఉన్నాయని రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి.
వచ్చిన వ్యక్తులకు అనేక రకములైన పరీక్షలు నిర్వహించిన తర్వాత.......... భార్గవుడు, భాస్కరుడు, ఉదయుడు... అను ముగ్గురు యువకులను తుది పరీక్షకు ఎంచుకున్నాడు.
తుది పరీక్ష నిర్వహించవలసిందిగా మంత్రి రాజును కోరాడు.
దిలీపుడు ఆ ముగ్గురుని ప్రవేశ పెట్టమని చెప్తాడు.
భార్గవుడు, భాస్కరుడు,ఉదయుడు... రాజుగారి దగ్గరకు వెళ్లి ప్రణామం చేస్తారు.
అప్పుడు రాజు.......
"నేను మిమ్ములను ఇప్పుడొక ప్రశ్న అడుగుతాను.... నేను అడిగిన ప్రశ్నకి......ఎవరైతే మీ సమాధానంతో నన్ను రంజింపజేస్తారో ...........వారికే ఈ కొలువు వరిస్తుంది...... "అని చెప్తారు.
ఐతే నా ప్రశ్న వినండి అని రాజు అంటాడు. ముగ్గురు అభ్యర్ధులతోపాటు...... మంత్రి కూడా రాజు ఏ ప్రశ్న అడుగుతాడు అని ఆతృతగా ఎదురు చూస్తుంటాడు.
రాజు :"ఈ మహా రాజ్యానికి రాజును నేను.నిత్యం పండిత పామరుల చే కీర్తించబడుతుంటాను. అటువంటి నా విలువ ఎంతో చెప్పండి....? "అని అడుగుతాడు.
ఉదయుడు:
"రాజా.... నా పేరు ఉదయుడు. ఇక మీ ప్రశ్నకు నా సమాధానం.......
మీ విలువ ...... మన రాజ్యంలోని మొత్తం మణులు., మాణిక్యాలకు సరితూగ గలదు. "అని ముగిస్తాడు.
రాజు గారు..... ఆ సమాధానం విని చినునవ్వు చిందిస్తారు.
భార్గవుడు:
మహారాజ..... భార్గవుడు ఐన నేను ఇచ్చు సమాధానం......
నా దృష్టిలో..... మీ విలువ ఈ భూమండలమంతా విశాలమైనది .... ఆకాశం వలె ఎనలేనిది.
ఈ సమాధానానికి రాజు గారి వదనం వికసిస్తుంది.
భాస్కరుడు:
రాజా.... నా దృష్టిలో మీ విలువ మన రాజ్యంలోని నాణెం అంత....
భాస్కరుడు ఇచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోవడం మిగిలిన అభ్యర్థులు వంతు.... కోపోద్రిక్తుడవడం మంత్రి వంతు అయినది.
మంత్రి :
నీ పేరేమిటి.....? నువు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా.....? రాజదూషణ కి శిక్ష ఏంటో తెలుసా...... మరణదండన........
అంటూ ఊగిపోతూ ఉంటాడు.
రాజు :
ప్రశాంతంగా .... జరిగేది చూస్తూ ఉంటాడు......
భాస్కరుడు:
మహాసేయా..... నేను చెప్పేది ముందు ప్రశాంతంగా వినండి. ఆ తర్వాత మీరు ఏ శిక్ష విధించినా నేను... అంగీకరిస్తాను అని చేతులు జోడిస్తాడు.....
అప్పటికి మంత్రి శాంతించి... ఏం చెప్తాడా... అని చూస్తున్నాడు.
భాస్కరుడు:
రాజా..... నా నామధేయము భాస్కరుడు. నేను మీ రాజ్యంలోని ఉత్తర దిక్కునున్న పాడివలస అను గ్రామానికి చెందినవాడని.
మా గ్రామంలోని ప్రజలు ఎంతో శ్రమించి పంటలు పండించి...... ధాన్యం ఇంటికి తీసుకురాడానికి అధికారులకు కప్పం చెల్లించి...... ఆ పిమ్మట ధాన్యం అమ్మగా సంపాదించేది..... ఒక నాణెం మాత్రమే.
ఆ నాణెం మీద మీ రూపమే ఉంటుంది. ఆ నాణెం వారికి ఎంతో విలువైనది. అధికారుల దగ్గర ధన రాసులు ఉండొచ్చు..... వారికి ఒక నాణెం అంటే ముఖ్యం కాదు..... వారికి వజ్ర వైడూర్యాలు విలువ కలిగిన వస్తువులు . కానీ పేదవారికి ఆ నాణెము అత్యంత విలువైన సంపద. వారు ఆ నాణెంలో మీ రూపము నే చూస్తూ..... మిమ్మల్ని దేవుని లా భావించి పూజిస్తారు. అందుకే మీ విలువ ఒక నాణెం అని చెప్పాను అని ముగిస్తాడు.
తన రాజ్యంలో జరుగుతున్న అధికారుల దోపిడీని తన దృష్టికి వచ్చేలా ..... చతురత, వివేకం, వినయం కలిగిన భాస్కరుడు కి మంత్రి పదవిని కట్టబెడతారు.
రాజు తీసుకున్న ఈ నిర్ణయం తో మంత్రి కూడా ఏకీభవిస్తాడు.
భాస్కరుని సలహాలు.... సూచనలతో..... దిలీపుడు ..... రాజ్యపాలన....... సజావుగా సాగిస్తాడు.