Harikishan Kurnool

Drama Children Stories

3  

Harikishan Kurnool

Drama Children Stories

ఏం వదినా చాలా ఇంకా కావాల్న

ఏం వదినా చాలా ఇంకా కావాల్న

6 mins
275


ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు వరసగా ఏడుమంది మగపిల్లలు పుట్టినాక చానా కాలానికి బంగారు బొమ్మలాంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప లేక లేక పుట్టింది గదా, అదీగాక అందరి కంటే చిన్నదిగదా దాంతో వాళ్ళన్నోళ్ళందరికీ ఆ పాపంటే ప్రాణం. ఏదడిగితే అది క్షణాల్లో తెచ్చిస్తా కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకునేటోళ్ళు. ఏడంతస్తుల మేడ కట్టి, మెత్తని తివాచీలు పరచి, హంసతూలికా తల్పమేసి, అడుగడుగునా దాసీలను పెట్టి చిన్న కష్టం గూడా తెలీకుండా చూసుకునేటోళ్ళు.


కొంతకాలానికి ఆ ఏడుమందికీ పెండ్లిల్లయ్యి పెండ్లాలొచ్చినారు. మొగుళ్ళు తమకన్నా ఆ పాపనే బాగా చూసుకుంటా వుండటంతో నెమ్మదిగా వాళ్ళకు ఆ పాప మీద బాగా కోపం పెరిగిపోయింది. బయటకు ఏమీ అనకపోయినా లోపల్లోపల మాత్రం వుడుక్కునేటోళ్ళు.


ఒకసారి ఆ రాజ్యంలో వుండే కొంతమంది సైన్యాధిపతులు ఆడాడ తిరుగుబాట్లు చేయడం మొదలుపెట్టినారు. దాంతో ఆ ఏడుమందీ తిరుగుబాట్లను అణచడానికని ఏడువైపులా సైన్యంతో బైలుదేరినారు. అట్లా పోయేముందు పెండ్లాలను పిలిచి ''మా చెల్లెలు జాగ్రత్త. ఇప్పుడెట్లా వుందో మళ్ళా మేం తిరిగి వచ్చేసరికి గూడా అట్లాగే వుండాల. ఏ చిన్న పొరపాటు చేసినా మిమ్మల్ని బతకనియ్యం. జాగ్రత్త'' అని9 ఎచ్చరించి పోయినారు.


వాళ్ళట్లా పోవడం ఆలస్యం ఇంగ వీళ్ళు ఆ పిల్లని చంపుకు తినడం మొదలుపెట్టినారు. తివాచీల మీదనే తప్ప భూమ్మీద ఎన్నడూ నడవని ఆ పిల్లతో మండుటెండలో వుత్తకాళ్ళతో చెరువు నుండి నీళ్ళు తెప్పిచ్చినారు. మెత్తని పరుపుల మీదనే తప్ప యాడా పన్నుకోని ఆ పిల్లను దిండు కూడా ఇయ్యకుండా కటికనేల మీద పన్నబెట్టినారు. పంచభక్ష్య పరమాన్నాలే తప్ప ఏమీ తినని ఆ పిల్లకు పాచిపోయిన అన్నం, పాచిపోయిన కూరలు పెట్టినారు. పొద్దున లేసినప్పటి నుండి రాత్రి పన్నుకునేదాకా దాసీలు అడుగడుగునా సేవలు చేస్తా వుంటే కష్టమంటే ఏమిటో తెలీకుండా పెరిగిన ఆ పిల్లతో ఇంటి పనులన్నీ ఒకదానిమీదొకటి క్షణం గూడా తీరిక లేకుండా చేయించినారు.


ఆ పాప అన్నలు గనుక తిరిగొస్తే విషయం తెల్సుకోని వాళ్ళని వూరికే విడిచిపెట్టరు గదా.... దాంతో వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి పాపం ఆ పిల్లను జుట్టు పట్టుకోని వద్దు వద్దని ఏడ్చి మొత్తుకుంటా వున్నా వినకుండా ఈడ్చి ఇంటి బైటకు దొబ్బినారు.అప్పుడా పాప కండ్లు తుడుచుకోని ''చూస్తా వుండండి, రోజులెప్పుడూ ఒకేలా వుండవు గదా! నాకూ ఒక రోజంటూ వస్తాది. అప్పుడు చెబ్తా మీ పని. నేను గూడా మిమ్మల్ని మించిన రాజుని పెండ్లి చేసుకోని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోని, చేతుల నిండా బంగారు గాజులేసుకోని, కండ్ల నిండా కాటుక పెట్టుకోని, బొట్ బొట్ల రవికపైన బొట్ల బొట్ల చీరగట్టి, నా కొడుకు సంకలో ఆడుకుంటా వుంటే... మీకు బండిగానంత విస్తరాకేసి, చాటెడు బచ్చాలేసి, రత్నాల గిన్నెలోంచి ముత్యాల చెంచాతో నెయ్యి పోస్తా 'ఏం వదినా! చాలా... ఇంకా కావాల్నా' అని గంటెతో ఒక్క పోటు పొడవకుంటే నా పేరు తిప్పి పెట్టుకుంటా'' అని ప్రతిజ్ఞ చేసి ఆన్నించి సరసరసర వెళ్ళిపోయింది.


ఆ పాపకు ఏ దిక్కున పోవాల్నో అర్థంగాక ఆ చీకట్లో ఎట్ల పడ్తే అట్ల నడుస్తా ఆఖరికి ఒక పెద్ద అడవిలోనికి చేరుకోనింది. నడిచీ నడిచీ ఇంక నడవలేక అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయింది.


ఆ అడవిలో ఒక పెద్ద రాక్షసుడున్నాడు. వాడా పిల్లని చూసి పండుకున్నదాన్ని పండుకున్నట్టే అరచేతిలో పెట్టుకోని వానింటికి తీసుకోనిపోయి ఒక గదిలో పన్నబెట్టి తాళమేసేసినాడు. పొద్దున్నే ఆమె లేచి చూస్తే చుట్టూ ఒక చెట్టూ లేదూ. కొండా లేదు. ''నేనెక్కడున్నాను'' అనుకుంటా వుంటే ఆ రాక్షసుడు ధడేలున తలుపులు తెరచుకోని లోపలికొచ్చినాడు. వాన్ని చూడగానే ఆ పాప భయంతో గజగజ వణికిపోయింది. ఆ రాక్షసుడు మాంచి భోజనప్రియుడు. అంటే వానికి రోజుకోరకం వంట చేపిచ్చుకోని తినాలని ఒకటే కోరిక. కానీ వానికి వంట రాదు. దాంతో ఈ పిల్లను చంపి తినకుండా గదిలో పెట్టుకున్నాడు.


''ఎవరు నువ్వు? నన్నెందుకు ఎత్తుకోనొచ్చినావ్‌'' అని భయపడ్తా భయపడ్తానే ఆ పిల్ల అడిగింది. దానికి వాడు ''నువ్వు నాకు రోజూ చాటెడన్ని బచ్చాలూ, విస్తరాకన్ని కర్జికాయలూ, బానంత అన్నమూ, కుండంత సాంబారు, చాపన్ని అప్పడాలు చేసి పెట్టాల. అన్నం తిన్నాక గంప ఆకులల్లో చెంబెడు వక్కపేళ్ళు, లోటా సున్నమూ ఏసి తాంబూలమియ్యాల. పన్నుకున్నాక నిద్రపోడానికి పాట పాడతా రోకలిబండతో జోకొట్టాల. అట్లా నువ్వు చేసినంత కాలమూ నేను నిన్ను ఏమీ చేయను. కానీ ఏ రోజయితే నువ్వు చేయడం మానేస్తావో ఆ రోజు నిన్ను చంపి తినేస్తా'' అన్నాడు. పాపం ఆ పాప వాన్ని ఎదిరించలేదు గదా, దాంతో సరేననింది. వాడు ఆ పిల్ల పారిపోకుండా ఏడంతస్తుల ఒంటిస్తంభం మేడ కట్టి ఆమెను పై గదిలో పెట్టి కింద తలుపులన్నీ తాళమేసుకున్నాడు.


ఆరోజు నుండీ ఆ పాపకు పొద్దున లేసినప్పటి నుండి మళ్ళా రాత్రి పన్నుకునేదాకా ఒకటే పని. గంపలు గంపలు చేయలేక కిందామీదా పడ్తా వుండేది. క్షణం గూడా తీరిక వుండేది గాదు. ఏమాత్రం కొంచం తక్కువ చేసినా ఆ రాక్షసుడు వూరుకుండేటోడు కాదు.


ఇక్కడ ఇట్లా ఈ పాప బాధలు పడ్తా వుంటే ఆడ ఏడుమందీ అన్నలు తిరుగుబాట్లు అన్నీ అణచివేసి ఇంటికొచ్చినారు. వచ్చి చూస్తే చెల్లెల్లేదు. ''యాడికి పోయిందే మా చెల్లెలు కనబడ్డం లేదు'' అనడిగితే ఆ ఏడుమందీ కూడబలుక్కోని ''మీ చెల్లెలు ఎవరో సైనికున్ని ఇష్టపడిందంట. మీరుంటే పెండ్లికి ఒప్పుకోరని మీరట్లా పోవడం ఆలస్యం మాకెవరికీ మాటమాత్రమయినా చెప్పకుండా అర్ధరాత్రి అందరి కన్నూ గప్పి... మట్టసంగా వాన్తో పారిపోయింది'' అని చెప్పినారు. అందరూ అట్లాగే చెప్పేసరికి వాళ్ళు గూడా అదే నిజమనుకున్నారు.


చెల్లెలంటే వాళ్ళకు యాడలేని ప్రేమ గదా! దాంతో ఆమె యాడికి పోయిందో, ఎన్ని కష్టాలు పడతా వుందో అని ఆలోచిస్తా ఆఖరికి అన్నం గూడా సరిగా తినక మనోవ్యాధితో మంచం పట్టినారు. అదే సందనుకోని కొంతమంది సైన్యాధికారులు మళ్ళా తిరుగుబాటు చేసి యుద్ధానికొచ్చినారు. పాపం వీళ్ళు చానా బాధలో వున్నారు గదా దాంతో యుద్ధం సరిగా చేయలేక ఓడిపోయి... పెండ్లాలను తీసుకోని పారిపోయినారు. అట్లా పారిపోయి వాళ్ళని ఎవరూ గుర్తుపట్టలేని ఒక చిన్న పల్లెటూరికి చేరుకోని అడవిలో కట్టెలు కొట్టి వాటిని చుట్టుపక్కల అమ్ముకుంటా బదకసాగినారు.

అన్నలిక్కడ ఇట్లా కష్టాలనుభవిస్తా వుంటే చెల్లెలక్కడ ఆ రాక్షసుని చేతిలో బాధలు పడ్తా వుంది. ఒకరోజు ఆ అడవి పక్కనే వున్న ఒక పెద్ద రాజ్యానికి చెందిన యువరాజు వేటకని అడవిలోనికి వచ్చినాడు. వచ్చి అడవి నడుమ ఆ పెద్ద ఒంటిస్తంభం మేడ చూసి ఆచ్చర్యపోయి ఎప్పుడూ ఈ అడవిలో ఇంత పెద్దమేడ చూడలేదు. ఎవరు కట్టినారు దీన్ని అనుకోని గుర్రాన్ని చెట్టుకు కట్టేసి పోయి చూస్తే తాళమేసి కనబడింది.


''ఎవరూ లేరేమో'' అనుకోని వెనక్కు తిరుగుతా వుంటే.. ఆమె పైన వంట చేస్తా వుంటాది గదా ఆ వెలుగూ, పొగా కనబన్నాయి. దాంతో రాజు ఒకొక్క మేడా కష్టపడి ఎక్కుతా నెమ్మదిగా ఏడో మేడ చేరుకున్నాడు. చేరుకోని చూస్తే అక్కడ నెమలీకలెక్క అందంగా వున్న ఆ పాప వంట చేస్తా కనబడింది. యువరాజు లోపలికొచ్చి ఆచ్చర్యంగా ''ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావిక్కడ'' అన్నాడు. అప్పుడామె జరిగిందంతా చెప్పింది.


అప్పుడా యువరాజు ''నువ్వు ఎట్లాగయినా సరే వాని ప్రాణాలు యాడున్నాయో కనుక్కో. మిగతాది నే చూసుకుంటా'' అన్నాడు. ఆమె సరే అనింది. ఆ రోజు రాత్రి ఆ పాప కొత్త కొత్త వంటకాలు ఎప్పుడూ లేనంత రుచిగా చేసి రాక్షసుడు వస్తానే పెట్టింది. వాడు లొట్టలేసుకుంటా అన్నీ తినగానే గంప ఆకులల్లో చెంబు వక్కలు, లోటా సున్నమూ ఏసి నోటికందించింది. వాడు ఆనందంగా నములుతా వుయ్యాల మీద పన్నుకోగానే దాన్ని వూపుతా రోకలిబండతో జోకొడతా ''నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరూ లేరు గదా. నువ్వు పొద్దుననగా పోతే రాత్రి వరకూ రావు. బైటకి పోయినప్పుడు నీకేమన్నా అయితే ఇక్కడ నాగతేం కావాల'' అనింది దొంగేడుపు ఏడుస్తా.


దానికి వాడు పెద్దగా నవ్వుతా ''ఓసీ పిచ్చిదానా! ఎందుకే అనవసరంగా భయపడతావు. నా ప్రాణాలు తీయడం అంత సులభం కాదులే. ఈడికి ఏడుమైళ్ళ దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. ఆ మర్రిచెట్టు తొర్రలో ఒక చిన్న చిలకుంది. దాంట్లో నా ప్రాణాలున్నాయి. దాన్ని చంపితేగానీ నేను చావను'' అన్నాడు. తర్వాత రోజు పొద్దున్నే ఆ రాక్షసుడు బైటకి పోగానే ఆమె ఆ విషయం యువరాజుకి చెప్పింది. అట్లాగా అని ఆ రాజు గుర్రమేస్కోని పోయి ఆ మర్రిచెట్టు తొర్రలో వున్న చిలకను పట్టుకోని ఒక్కవేటుతో తల నరికినాడు. అంతే ఆ రాక్షసుడు అక్కడికక్కడే కిందపడి గిలగిలా కొట్టుకుంటా రక్తం కక్కుకోని చచ్చిపోయినాడు. ఆ యువరాజు ఆమెను పెండ్లి చేసుకున్నాడు.ఈమెను పెండ్లి చేసుకున్నది చానా పెద్దరాజు గదా. దాంతో మళ్ళా ఆమెకు రాజవైభోగం పట్టుకోనింది. రాజు ఆమెను చానా ప్రేమగా చూసుకునేటోడు. కొన్నాళ్ళకు వాళ్ళకో కొడుకు పుట్టినాడు. పుట్టినాక ఆమెకు అన్నోళ్ళను ఒకసారి చూడాలన్పించి మొగునికి చెప్పింది. మొగుడు ''సరే... పోయిరాపో'' అన్నాడు. పోయి చూస్తే అక్కడ అన్నల్లేరు, వదినల్లేరు. జరిగిందంతా తెలుసుకోని బాధపడింది. ఎట్లాగయినా సరే అన్నోళ్ళు యాడున్నారో కనుక్కోవాలని రోజుకొక వూర్లో అందరినీ పిలిచి వుచితంగా భోజనాలు పెడ్తా తాను మాత్రం ఎవరికీ కనబడకుండా మిద్దె మీద కూచోని వచ్చేపోయే వాళ్ళలో తన అన్నలేమయినా వున్నారేమోనని వెదకసాగింది.


వాళ్ళన్నోళ్లు అడవిలో కట్టెలు కొట్టుకోని అమ్ముతా ఒకరోజు చెల్లెలున్న వూరికి వచ్చినారు. ఆడ వుచితంగా అందరికీ అన్నం పెడ్తా వుంటే తిందామని వీళ్ళు గూడా పెండ్లాలను పిలుచుకోని వచ్చినారు. ఆమె మిద్దెపై నుండి అన్నావదినలను చూస్తానే గుర్తుపట్టింది. వెంటనే ఆమె కండ్లలో నీళ్ళు తిరిగినాయి. అంతలో ఆమెకు వదినల్తో చేసిన సవాలు గుర్తుకొచ్చింది.


వెంటనే నుదుట కుంకుమ పెట్టుకోని, చేతుల్నిండా వజ్రాల గాజులేసుకోని, కండ్లకు కాటుక పెట్టుకోని, బొట్ల బొట్ల రవిక పైన బొట్ల బొట్ల చీరగట్టి, సంకలో కొడుకు ఆడుకుంటా వుంటే వచ్చి అందరికీ మామూలు విస్తరాకులేస్తే వదినలకు మాత్రం బండి గానంత విస్తరాకులు ఏసింది.'' ''ఇదేందబ్బా ఇంత పెద్ద ఆకేసింది'' అని వాళ్ళు ఆచ్చర్యపోతా వుంటే ఒక్కొక్కరి ఆకులో చాటెడు బచ్చాలు ఏసి, రత్నాల గిన్నెలోంచి ముత్యాల చెంచాతో ఆ బచ్చాల మీద నెయ్యి పోస్తా ''ఏం వదినా! చాలా... ఇంకా కావాల్నా'' అని గంటెతో ఒక పోటు పొడిచింది. దాంతో అదిరిపడి వాళ్ళందరూ తలెత్తి చూస్తే ఆమె చిరునవ్వులు నవ్వుతా చిన్నబిడ్డను సంకనేసుకోని కనబడింది. వెంటనే వాళ్ళు ఆమెని గుర్తుపట్టి కండ్ల నీళ్ళతో ''మమ్మల్ని మన్నించమ్మా! నీకు చానా అన్యాయం చేసినాం. అందుకే మా బతుకులిట్లా నాశనం అయినాయి'' అని ఏడ్చినారు. అన్నలు జరిగినేదంతా తెలుసుకోని పెండ్లాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినారు.


''జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటినుంచయినా అందరమూ కలిసుందాం'' అని ఆమె అన్నావదినలందరినీ మొగుని దగ్గరకు తీసుకోని పోయి పరిచయం చేసింది. ఆయన వాళ్ళందరికీ బాగా మర్యాదలు చేసి, తన సైన్యాన్ని వాళ్ళకిచ్చి పొండి ''పోయి మీ రాజ్యాన్ని మీరు గెల్చుకోని రాపోండి'' అన్నాడు. వాళ్ళు సరేనని ఆ సైన్యంతో పోయి మళ్ళా తమ రాజ్యాన్ని తాము గెల్చుకున్నారు. అప్పటి నుంచీ అందరూ ఎటువంటి గొడవలూ లేకుండా పండగలకు ఒకరింటికొకరు వస్తాపోతా హాయిగా కలసిమెలసి వున్నారు. 

**********************



Rate this content
Log in

Similar telugu story from Drama