స్మశానంలో ఒక రాత్రి
స్మశానంలో ఒక రాత్రి
కాలం కరుగుతున్న కొద్దీ వినీత్ కి భయం పెరగసాగింది. పందెం కాసి రాత్రంతా స్మశానంలో ఉంటాను అని రావడం తప్పని అతనికిప్పుడు అర్థం అవుతోంది.
తెచ్చుకున్న వేరుశెనక్కాయలు అన్నీ అయిపోయాయి. వాటి తొప్పట్లు కాలుతున్న చితి నిప్పుల మీద వేసాడు. టప్ టప్ అని శబ్దం వచ్చింది.
వినీత్ కి చుట్టూ చూడ్డానికి ధైర్యం చాల్లేదు. దూరంగా తీతువు కూతలు, పక్కనే కుక్కల అరుపులు. కొద్దిగా జరిగాడు. అతను కూర్చున్న సమాధి కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
మెల్లిగా లేచి నిలబడ్డాడు. మోకాళ్ళ దాకా ఉన్న నిక్కరు చలిని ఆపలేకపోతోంది. అప్పుడే మెత్తగా అతని కాళ్ళకు ఏదో తగిలింది.
చప్పున కిందికి చూశాడు.
రెండు చేతులు అతని కాళ్ళను చుట్టుకుంటూ మోకాళ్ళ దాకా వచ్చాయి. భయంతో గావు కేకలు పెడుతూ అక్కడ నుంచి ముందుకు పరిగెత్తాడు.
ఆపసోపాలు పడుతూ ఓ చెట్టు దగ్గర ఆగాడు. దప్పిక వేస్తోంది. దాహంగా ఉందా అంటూ ఓ ఆకారం తల క్రిందులుగా వేలాడుతూ అతనికి దగ్గరగా వచ్చింది.
అమ్మ బాబోయ్! అంటూ బయటికి పరుగెత్తాడు. వెనకే ఎవరో వస్తున్నట్టు అలికిడి. అతను వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటూ ముందుకు నడిచి తూలి పడ్డాడు. లేచే ఓపిక లేదు.
ఆకాశం క్రమంగా రంగు మారుతోంది. వినీత్! లేవరా అంటూ స్మశానం బయట పడున్న అతని మీద ఎవరో నీళ్లు చల్లుతున్నారు.