"శ్రీ కృష్ణ మహా భారతం - 50"
"శ్రీ కృష్ణ మహా భారతం - 50"
"శ్రీ కృష్ణ మహా భారతం - 49" కి
కొనసాగింపు...
"శ్రీ కృష్ణ మహా భారతం - 50"
అలా కృష్ణుడు అర్జునుడిని వేరే కార్యం మీద తీసుకెళ్తూ...
సుభద్రను రాజ్య భవనంలోకి వెళ్ళమన్నాడు.
సోదరుని మాట ప్రకారం సుభద్ర రాజ్య భవనం వైపు అడుగులు వేస్తుంది కానీ, తన మనసంతా అర్జునుడి మీదే ఉంది. అర్జునుడు తనకి తాత్కాలికంగా దూరంగా ఉండనున్నారు అనే విచారం అది. ఆ విచారపు హావభావాలతో పదే, పదే
వెనకకు తిరిగి అర్జునుడిని చూస్తుంది సుభద్ర.
అర్జునుడు మాత్రం అదేం పట్టించుకోకుండా కృష్ణుడితో ప్రయణమవడానికి తన అశ్వాన్ని సిద్దం చేసుకుంటున్నాడు.
ఇదంతా గమనించిన కృష్ణుడికి సుభద్ర యొక్క ప్రేమ ఎంత మధురమైనదో అర్థమైంది.
ఇక కృష్ణుడి కార్యార్థం అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరి వెళతారు.
కృష్ణుడు అలా అర్జునుడిని తీసుకెళ్ళింది ఒక పర్ణ శాలకి,
అక్కడే కృష్ణుడికి సంబధించిన ఆనందం ఉంది. అదేంటంటే,
గోవులు, గోపికలు ఇంకా తనకెంతో ఇష్టమైన చిన్ని కృష్ణులు. వాళ్లందరితో ఆడుతూ పాడుతూ తనకిష్టమైన వెన్నను ఆరగిస్తూ...
గోవులను కాపలా కాస్తూ...
గోపికలను ఆటపట్టిస్తూ వాళ్ళతో అల్లరి చేస్తూ చాలా సరదాగా గడుపుతాడు శ్రీకృష్ణుడు. ఆ అల్లరికి అర్జునుడు కూడా కొన్ని సరదా శిక్షలు అనుభవిస్తాడు.
ఇక అక్కడే ఉన్న ఒక రైతు పొలంలో కాడేకు ఇరువైపులా కృష్ణార్జునులు కాచి, నాగలితో పొలం దున్నుతూ ఆ రైతుకి సహాయం చేస్తారు.
అది పూర్తైన పిదప అర్జునుడు కృష్ణుడితో...
"శ్రమ చేయడం వలన శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది వాసుదేవా !" అని అంటాడు
దానికి కృష్ణుడు...
"శ్రమ చేయడం వలన లభించడం కాదు, సహాయం చేయడం వలన శక్తి లభిస్తుంది పార్థ..!" అని బదులు ఇస్తాడు.
అక్కడినుండి కృష్ణుడు అర్జునుడిని కుందనాపురం అనే పట్టణానికి తీసుకుని వెళ్తాడు.
అది చూసిన అర్జునుడు...
"ఇదేనా కుందనాపురం..!
నేను విన్నదాని కంటే చాలా సుందరంగా ఉంది ఈ నగరం" అని కృష్ణుడితో అంటాడు.
"అవును..!
విదర్భ రాజ్యానికి ముఖ్య పట్టణం ఇది.
అదిగో అక్కడ కనిపిస్తుందే అది విదర్భ రాజు రాజభవనం యొక్క ముఖద్వారం." అంటూ ఆ ముఖ ద్వారానికి మరొక వైపు నుండి చూపిస్తూ కృష్ణుడు అర్జునుడితో అంటాడు
దానికి అర్జునుడు...
"అదేంటి..!
ముఖద్వారం అటువైపు ఉంది కదా..!
మనం ఇటువైపు ఎందుకు వచ్చాం..!" అని కృష్ణుడిని అడుగుతాడు.
"అవును...
కానీ, ముఖద్వారం వద్ద సైనికులు ఉంటారు పార్ధా...!
మనం ఇలా వెళితేనే రాజ్యం లోనికి ప్రవేశం పొందగలము" అని కృష్ణుడు అంటాడు
అర్జునుడు ఏం అర్థం కాక,
"అదేంటి, విదర్భ రాజ్యానికి మీకు అనుమతి అదే, విదర్భ రాకుమార్తె రుక్మిణీ యొక్క వివాహానికి ఆహ్వానం ఉంది అని చెప్పారు కదా మాధవా...!" అని కృష్ణుడిని అడుగుతాడు.
దానికి ఆ వాసుదేవుడు..
"వివాహం చూడడానికి కాదు, చేసుకోవడానికి మాత్రమే నాకు ఆహ్వానం అందింది పార్థా..!" అని కృష్ణుడు బదులు ఇస్తాడు.
ఆ వాసుదేవ కుమారుని మాటలు అర్థం కాని అర్జునుడు..
"కానీ, మాధవా...!
రాకుమారి రుక్మిణీ వివాహం చేధియ రాకుమారుడు శిశుపాలునితో నిశ్చయించారు కదా ..!
సమస్త ఆర్యావర్తానికి తెలుసు" అని అంటాడు.
అప్పుడు కృష్ణుడు...
"రుక్మిణి వివాహం జరిగేది నాతోనే,
నీకు కృతజ్ఞతలు...!
ఎందుకంటే, ఈ విషయం నీకు తప్ప, ఈ విషయం సమస్త ఆర్య వర్తనంలో అన్యులు ఎవరికి తెలీదు." అని అంటాడు
"దానికి తాత్పర్యం(అర్థం) ఏమిటి వాసుదేవా..!" అని అర్జునుడు అడగ్గా...
కృష్ణుడు తనతో తీసుకొచ్చిన లేఖను అర్జునుడికి ఇచ్చి చదవమంటాడు...
"ఇదేంటని" అర్జునుడు ప్రశ్నించగా...
"ప్రేమలేఖ..!,
విదర్భ రాకుమారి రుక్మిణి నాకు రాసిన ప్రేమలేఖ ..!" అని బదులు ఇస్తాడు కృష్ణుడు
ఇక ఆ లేఖను చదవడం ప్రారంభించిన అర్జునుడుకి...
"ప్రియమైన భువన సుందరుడా...!
(ఈ లోకంలోనే అందమైన వాడా)
నేను మిమ్ములను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను.
మారు వేషంలో వచ్చి, నాకిష్టం లేని ఈ వివాహాన్ని ఆపి, నన్ను తీసుకుని వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను." ఈ విధంగా కనిపిస్తుంది.
(అప్పుడు అర్థమవుతుంది అర్జునుడికి
అంటే తాము అక్కడికి వచ్చింది, రుక్మిణి వివాహం చెడగొట్టి, ఎవరికి తెలియకుండా ఆమెను అక్కడి నుండి తీసుకురావడానికి కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు అన్న మాట..!
అర్జునుడు కి ఆ కార్యం క్లిష్టంగా ఉందని చెప్పడానికి వెనుక కారణం ఇదే కాబోలు 🤣🤣🤣)
అర్జనుడు...
"కానీ, వాసుదేవా..!
ఇలా ఒక కన్యను అపహరించుకొని రావడం అధర్మం అవుతుంది కదా...!" అని ప్రశ్నించగా
దానికి కృష్ణుడు...
"అవును పార్దా..!
నువ్వు చెప్పింది సత్యమే,
విదర్భ రాకుమారికి ఇప్పటికే నిశ్చయం అయినా తర్వాత ఆమెను అపహరించుకొని రావడం అధర్మమే..!
కానీ, ఈ స్తృష్టిలో ప్రతి జీవికి తాను ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కుని ఆ ఈశ్వరుడు ఇచ్చాడు.
రాకుమారి రుక్మిణికి ఇష్టం లేకుండానే అతని సోదరుడు ఈ వివాహాన్ని జరిపించాలని చూస్తున్నాడు. అప్పుడు అతను చేసింది కూడా అధర్మమే అవుతుంది కదా...!
అందుకే, నేను కేవలం ఆ అధర్మాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను.
అధర్మానికి అధర్మం ధర్మమే పార్థ..!" అంటూ అర్జునుడికి సమాధానం ఇస్తాడు.
కృష్ణుడి మాటల్లో పరమార్థాన్ని వెతికినా అర్జునుడు,
ఆయన మాటలకి ఆలోచనలకి చాలా ముగ్ధుడవుతాడు.
"ఇప్పుడే ఆదేశించండి వాసుదేవా...!
నా వింటిని ఉపయోగించి, విదర్భ ముఖ ద్వారాన్ని నాశనం చేయగలను" అంటూ అర్జునుడు అంటాడు
దానికి కృష్ణుడు..
"అదే నా బాధ...!
నీకు అలా ఆదేశిస్తే, నువ్వు అన్నంత కార్యం తలపెట్టగల సమర్ధుడివి,
కానీ, రుక్మిణి ఆ లేఖలో చాలా స్పష్టంగా రాసింది.
తన వాళ్ళకి ఎలాంటి అపటం తలపెట్టకుండా తనని అక్కడి నుండి తీసుకుని వెళ్ళాలని.
మనకి మరొక మార్థం ఉండగా...
ఈ హింస అనే మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి చెప్పు..!
దాని అవసరం ఉంది అంటావా...?" అని చెప్తూ అర్జునుడిని శాంతింప చేస్తాడు కృష్ణుడు.
ఇంకా కృష్ణుడు చెప్తూ...
"రుక్మిణి ఏ రకంగా అయితే, మనల్ని మారు వేషంలో రమ్మని కోరిందో అదే రకంగా నువ్వు వెళ్లి ఆమెకి ఈ లేఖను అందించి,
నేను తన కోసం పార్వతి పరమేశ్వరుని మందిరంలో ఎదురు చూస్తుంటాననీ సందేశం అందించు..." అని అర్జునుడితో అంటాడు
"ఏ మారువేషంలో మనం వెళ్ళాలి వాసుదేవా..?" అన్న అర్జునుడికి ప్రశ్నకి
"నాకు గోవుల కాపరిగా అనుభవం ఉంది కాబట్టి,
గోపాలుడిగా...
నువ్వు ...
నువ్వు....
నీకు మారు వేషం గురించి చెప్పను, కాసేపట్లో ఎలాగో వేసుకుంటావ్ గా నీకే తెలుస్తుంది లే..!" అంటూ కృష్ణుడు చెప్తూ అర్జునుడిని సందిగ్ధంలో పెడతాడు.
***********
మారు వేషం వేసుకున్న ఇద్దరూ విదర్భ ముఖద్వారం గుండా రాజ్యంలోకి ప్రవేశించడానికి బయలుదేరతారు.
ముందుగా కృష్ణుడు ఆ ముఖ ద్వారం గుండా లోపలకి వెళ్ళడానికి ప్రయత్నించగా ..
అక్కడే ఆ ముఖద్వారానికి కాపలా ఉన్న సైనికుడు కృష్ణుడిని అడ్డుకుంటాడు.
దానికి కృష్ణుడు...
"నేను ఒక గోపాలుడిని, రాకుమారుడు కోసం క్షీరాన్నం తీసుకుని వచ్చాను." నన్ను లోపలికి వెళ్లనివ్వు అని అడుగుతాడు
దానికి ఆ సైనికుడు...
"అన్యులు ఎవరికి లోపలికి ప్రవేశం లేదు. ఇది రాకుమారుల వాటి ఆదేశం" అంటూ హెచ్చరిస్తాడు.
"ఓహ్... అలాగా
ఇదంతా ఆ యాదవుడు ఆ కృష్ణుడు వల్లనా..!
ఛీ...!
ఛీ...! అతను మా గోపాలుల పేరును మలినం చేసేసాడు.
వాడు ఎలాంటి పనులు చేశాడంటే,
మీలాంటి శస్త్రాన్ని ధరించిన సైనికులకు కూడా మా గోపాలుడు అంటే భయం వేస్తుంది.
సరే..!"
అంటూ ఆ సైనికుడిని తన మాటల గారడీతో బుట్టలో వేసి నాటకమాడుతున్న కృష్ణుడు అక్కడి నుండి వెళ్లిపోతున్నట్టు నటిస్తుంటే,
అది అర్థం కాని ఆ సైనికుడు...
"మాకు ఆ కృష్ణుడు అంటే భయం లేదు..!" అంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ అతన్ని లోపలికి అనుమతిస్తాడు.
అప్పుడే కృష్ణుడు...
"ఓయ్..
బృహన్నలా..
నిన్నే రా ..!" అని వెనుకున్న మనిషిని పిలుస్తాడు.
(ఆ బృహన్నల ఎవరో కాదు స్త్రీ వేషం (మారు వేషంలో) ధరించిన అర్జునుడు.)
దాంతో....
"ఈవిడెవరు..!" అంటూ
ఆ సైనికుడు మారు వేషంలో ఉన్న అర్జునుడి గురించి, గోపాలుడి వేషంలో ఉన్న కృష్ణుడిని ప్రశ్నిస్తాడు.
"ఈవిడ నా సోదరి,
సామాన్యుల స్త్రీల కంటే, ఈవిడ రూపం కొంచెం తేడాగాను, వారి కంటే కొంచెం పొడవుగానూ ఉండడం వలన మా అమ్మ
ఈమెకు బృహన్నల అని పేరు పెట్టింది" అంటూ వాళ్ళకి వివరించి, ఏమార్చి విదర్భ రాజ భవనం లోనికి ప్రవేశిస్తారు.
ఇక ఆ వేషంలో రాజ్యంలో తిరుగుతూ చాలా అసౌకర్యానికి గురవుతున్న అర్జునుడు కృష్ణుడితో...
"వాసుదేవా..!
నా చేత ఇలాంటి వేషం వేయించావు ఏమిటి..?" అని అడుగుతాడు.
అప్పుడు కృష్ణుడు...
"నేను నీకు ముందే చెప్పాను కదా అర్జునా...!
ఈ కార్యం చాలా క్లిష్టంగా ఉంటుంది అని,
అయినా భవిష్యత్తులో ఎప్పుడైనా నీకు ఈ వేషం ఉపయోగపడొచ్చు, కాబట్టి అలవాటు చేసుకో..!" అని బదులు ఇస్తూ నవ్వుతూ ముందుకు సాగుతాడు
కృష్ణుడి అంతరంగం ఏమిటో అర్జునుడికి అర్ధం కాకపోయినప్పటికి అతనితో ముందుకు సాగుతూనే ఉంటాడు.
(పోను పోను అర్జునుడితో పాటు మనకి తెలుస్తుంది లెండి)
అలా వారి వెళ్తుంటే,
రుగ్మి కనిపిస్తాడు.
అతనే రుక్మిణి యొక్క సోదరుడు, విదర్భ యువరాజు.
అతని గురించి అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు.
"వెళ్లి వారినే(రుగ్మి) అడుగుదాం రుక్మిణి ఎక్కడుందో..!" అని కృష్ణుడు అర్జునుడితో అంటే,
"అలా చేస్తే, మిమ్మల్ని వారు కనిపెట్టేస్తారు మాధవా..!" అంటూ కొంచెం భయంగా అంటాడు.
"వాస్తవానికి నేను ఏవరో ?, నీకే ఇంకా అర్థం కాలేదు!, ఇంకా వారికేం అర్థమవుతుంది" అంటూ కృష్ణుడు అర్జునుడితో అనగా...
అర్జునుడు కృష్ణుడు మాటల్లో అంతరంగం అర్థం చేసుకునే లోపే,
కృష్ణుడు తెచ్చిన క్షీరాన్నమ్ పట్టుకుని...
"నమస్కారం యువరాజ..!
నమస్కారం యువరాజ..!" అంటూ రుగ్మిని సమీపించి, అతడికి పాదాభివందనం చేస్తాడు కృష్ణుడు
"కల్యాణమస్తు ...!"అంటూ దీవించి,
"ఎవరు నీవు..?
ఇక్కడెందుకు వచ్చావు..?
ఎలా వచ్చావు..?" అని ఒకదానిపై ఒకటి రుగ్ని కృష్ణుడిపై ప్రశ్నలు సందిస్తుంటే,
"యువరాజ...!
నన్ను దుర్వాస మహర్షుల వారు పంపించారు.
(ఇప్పటికే దుర్వాస మహర్షి గురించి మనం ముందు భాగంలో తెలుసుకున్నాం. కుంతీకి పెళ్లి కాకుండా కర్ణుడు పుట్టడం, ఆ వరం కుంతీకీ లభించడం దుర్వాస మహర్షి వలనే వచ్చింది)
ఆయనకు కొన్ని అనివార్య కార్యాలు ఉండడం వల్ల రాలేకపోయారు.
అందుకే, నాకు ఈ ప్రసాదాన్ని ఇచ్చి, వీటి ద్వారా తన ఆశీస్సులు అందజేయవలసిందిగా నన్ను ఇక్కడికి పంపించారు." అంటూ ఒక కట్టు కథ అల్లుతాడు.
దానికి రుగ్మి..!
"సరే..!
ఇలా ఇవ్వు నేను ఇస్తాను " అని అనగా...
"ఇది ప్రసాదం యువరాజ..!
కేవలం కాబోయే దంపతులు మాత్రమే తీసుకోవాలి. లేదంటే, అపవిత్రం అయిపోతుంది" అంటూ మారు వేషంలో ఉన్న కృష్ణుడు చెప్తాడు.
"అయితే,
నువ్వే స్వయంగా పట్టుకుని వెళ్లి, అందజేయి" అని చెప్తాడు రుగ్మి
దానికి కృష్ణుడూ...
"నేనా..!
నా సోదరి బృహన్నల ఉంది ఆమెతో పంపిస్తాను" అంటూ ఆమెను రుగ్మికి చూపిస్తాడు.
స్త్రీ వేషంలో ఉన్న అర్జునుడిని చూడగానే రుగ్నికి ఆమెపై సందేహం కలుగుతుంది. ఆమెను (అర్జునుడిని) అలానే అనుమానాస్పదంగా చూస్తాడు.
అయినా ఏం బయటకి చెప్పకుండా
"సరే..!
కాసేపు అయిన తర్వాత నేను లోపలికి పిలుస్తాను"అని కృష్ణుడితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఋగ్మి.
ఇక కృష్ణుడు అర్జునుడి వద్దకు రాగానే,
అర్జునుడు..
"మాధవా..!
నువ్వు అతనికి పాదాభివందనం చేసావా..!" అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు
"అర్జునా...!
అతడు రుక్మిణికి జ్యేష్ఠ సోదరుడు...
రేపు మా వివాహం జరిగిన తర్వాత, అతడి ఆశీర్వాదం లభిస్తుందో లేదో..?
అందుకే, వీలున్నప్పుడు తీసుకోవడం మంచిదే కదా..!" అని బదులు ఇస్తాడు.
"కానీ, ఈ ప్రసాదం నిజంగా దుర్వాస మహర్షి పంపించిందేనా?" అని మరొక సందేహాన్ని అర్జునుడు వ్యక్త పరచగా...
"నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అర్జునా ?
వచ్చే దారిలో దుర్వాస మహర్షి ఆశ్రమం ఉంటే, నేనే స్వయంగా వెళ్లి అక్కడి నుండి ప్రసాదం తీసుకుని వచ్చాను" అని కృష్ణుడు అంటూ ఆ ప్రసాదాన్ని తాను కొంచెం తీసుకుంటాడు.
దానికి ఆశ్చర్యంతో చూస్తున్న అర్జునుడితో కృష్ణుడు...
"ఏంటి అంతా ఆశ్చర్యంగా చూస్తున్నావ్..!
రుక్మిణికి కాబోయే వరుడిని నేనే కదా..!
అందుకే, ఇందులో సగం తీసుకున్నాను.
ఇక నీ తక్షణ కర్తవ్యం...
వెళ్లి రుక్మిణిని తీసుకుని రావడం.
నేను పార్వతి పరమేశ్వరుని మందిరంలో ఎదురుచూస్తూ ఉంటాను మీ రాకకోసం..."అంటూ అర్జునుడిని పంపిస్తాడు.
ఋగ్నికి మారు వేషంలో ఉన్న అర్జునుడు దొరికిపోతాడా ?
రుక్మిణిని అర్జునుడు ఒక్కడే ఎలా తీసుకురాగలడు ?
అర్జునుడు రాజభవనంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాడు, వాటిని ఎలా పరిష్కరిస్తాడు ?
లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.
"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.
తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 51"
అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.
అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.
నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
రచన: సత్య పవన్ ✍️✍️✍️