"శ్రీ కృష్ణ మహా భారతం - 47"
"శ్రీ కృష్ణ మహా భారతం - 47"
"శ్రీ కృష్ణ మహా భారతం - 46" కి
కొనసాగింపు...
"శ్రీ కృష్ణ మహా భారతం - 47"
యుధిష్ఠిరునికి పట్టాభిషేకం జరుగుతుండగా...
సభలోకి వచ్చిన దుర్యోధనుడు, అతని తమ్ములు మరియు కర్ణుడు యుధిష్ఠిరుని కోపంగా చూస్తూ అతన్ని సమీపిస్తారు.
యుధిష్ఠిరుడు కూడా అంతే గంభీరంగా వాళ్ళకి ఎదురుగా వెళ్తాడు.
దుర్యోధనుడు, యుధిష్ఠిరుడుకి మరింత దగ్గరగా సమీపించగానే తన ఆయుధం అయినటువంటి గదను అతని పైకి ఎత్తుతాడు.
అందరిలో ఒకటే ఉత్కంఠ, ఆందోళన ...
దుర్యోధనుడు అసాంఘిక కార్యలాపాలకు సిద్ధపడుతున్నాడు అని,
కానీ, దుర్యోధనుడు ఒక్కసారిగా ఆ చేతిలో ఉన్న గదను, వంగి యుధిష్ఠిరుడు పాదాల వద్ద పెడతాడు.
దాంతో ఒక్కసారిగా సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోతారు.
ఇంతలో దుర్యోధనుడు పైకి లేచి, యుధిష్ఠిరుడుకి నమస్కరిస్తూ
"బ్రాతా యుధిష్ఠిరా..!
వాయుదేవుడు ముందు తల వంచినంత మాత్రానా వృక్షం తన సామర్థ్యాన్ని కొల్పోధు.
సముద్రపు అలలకి అనుకూలంగా ఈదడం చేత నౌకకు ఎలాంటి అవమానం కలగదు.
అలాగే, మీ ముందు నా శస్త్రాలను త్యజించినంత మాత్రానా నాకు అవమానం జరిగినట్టు భావించను.!
అది నాకు గౌరవంగా మాత్రమే నేను భావిస్తున్నాను.
నేను ఒప్పుకుంటున్నాను...
మీరు నాకంటే బాహుబలంలోనూ, బుద్ధి బలంలోనూ శ్రేష్ఠులని.
మిమ్మల్ని హస్తిన పుర రాజుని చెయ్యాలన్న నిర్ణయాన్ని నేను, నా తమ్ములం స్వీకరిస్తున్నాం." అంటూ యుధిష్ఠిరుడికి నమస్కరిస్తాడు.
ఇక, యుధిష్ఠిరుడు యొక్క పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ఆ రాజ్య సభలో జరుగుతుంది.
యుధిష్ఠిర రాకుమారునికి జయహో...!
యుధిష్ఠిర రాకుమారునికి జయహో...!
యుధిష్ఠిర రాకుమారునికి జయహో...!
యుధిష్ఠిర రాకుమారునికి జయహో...!
అన్న ప్రజల కరతాళ ద్వనులు మరియు జేజేలు మధ్య యుధిష్ఠిరుడు సింహాసనాన్ని అధీష్టీస్తాడు.
కుంతీ, భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు మరియు మిగిలిన పాండవులు ఈ పట్టాభిషేకానికి ఆనంద భాష్పాలు చిందిస్తుంటే
ధృతరాష్ట్రడు, శకుని,కర్ణుడు, దుర్యోధనుడు మరియు అతని సోదరులు మాత్రం అసూయతో రగిలిపోతున్నారు.
ఇక జరుగుతున్న కార్యాన్ని చూసి సంతోష పడాలో, బాధ పడాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయింది గాంధారి.
************
ఇక పట్టాభిషేకం అయిపోయాక...
పాండవులందరూ తమ మందిరంలో కలుసుకుంటారు.
భీముడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఒక నీటి తొట్టెలో ఉన్న కాకరకాయలను తీసుకుని తింటాడు.
వాటి చేదు రుచికి తట్టుకోలేక బయటకి ఊసేస్తాడు.
దాంతో "ఏమైందని..?" నకులుడు ప్రశ్నించగా...
"ఈ కాకరకాయలను రాత్రంతా చక్కెర నీటిలో వేశాను సోదరా..!
అయినా వీటి రుచి ఏ మాత్రం మారలేదు" అని బదులు ఇస్తాడు భీముడు
దానికి నకులుడు
"బహుశా ఒక సంవత్సర కాలం ఉంచితే వాటి రుచి మారవచ్చను ఏమో కదా..!
దుర్యోధనుడు అంతటి వాడే మారాడు."
అని అంటాడు
దానికి భీముడు...
"కాకర కాయను జీవితాంతం ఉంచినా వాటిలో మార్పు రాదు నకులా..!, ఎందుకంటే కాకరకాయ అస్తిత్వం దాని చేదులోనే ఉంటుంది." అంటూ దుర్యోధనుడిని స్వభావాన్ని కాకరకాయలతో పోల్చుతూ అంటాడు.
అది అర్ధమైన యుధిష్ఠిరుడు...
"మంచిని చూడు భీమా..!
మంచిని చూడండి మీరంతా...
ఒక మనిషి హృదయం ధర్మాన్ని నిలుపుకోలేనంత బలహీనమైనది కాదు" అంటూ హితబోధ చేస్తాడు.
*************
"నా హృదయం ధర్మాన్ని నిలుపుకునేటంత బలహీనమైనది కాదు మామా..!" అని శకునితో అంటూ తన చేతిలో ఉన్న పాచికలు వేస్తూ...
"పడాలి ఐదు..!" అని అంటాడు తన మందిరంలో...
"అలా అనకు పుత్రా..!
ధర్మమే ఈ లోకానికి ఆధారం..!
నీవు అధర్మ మార్గాన నడవకూడదు పుత్రా..!"
అప్పుడే అక్కడికి వచ్చిన గాంధారి అంటుంది.
దానికి దుర్యోధనుడు..
"ధర్మం ఏమిటీ మాతా...!
ఏది ధర్మం..!
ధర్మం ఉన్నది కేవలం అసమర్ధులు, చేతకాని వారి కోసమే..!
ఈశ్వరుడు ఈ హృదయాన్ని ఇచ్చాడు.
ఆ హృదయంలో ఉన్న కోరికలను తీర్చుకోవడం అధర్మం ఎలా అవుతుంది.
ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు..!
గురుకులంలో ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నాను. కానీ, ఆ ధర్మాన్ని నేను పాటించలేను.
నాకు తెలిసిన ధర్మం ఒక్కటే,
అదే ఈ హస్తిన పురానికి రాజవ్వడం..!" అంటూ కుండబద్దలు కొడుతూ తనలో ఉన్న విషాన్ని చిమ్ముతాడు.
***********
భీష్ముడు తన తల్లి అయినటువంటి గంగా నది దగ్గరకి వచ్చి,
"మాతా..!
ఏ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నేను నిరీక్షించానో..?
అది ఇప్పుడు ఆసన్నమైంది." అంటూ ఆ గంగా నదికి నమస్కరిస్తుంటే,
"ఏ ఉత్తరాయణ పుణ్య కాలం కోసం నిరీక్షిస్తున్నావు పుత్రా. .!"
అంటూ గంగా దేవి నదిలో నుండి ప్రత్యక్షమవుతుంది.
"జన్మధారణ చేసే సమయంలో...
మహర్షి వశిస్టుల వారిని నేను నా మోక్షానికి మార్గాన్ని తెలుపమని కోరగా...
ఆయన..
"భూమి మీద జన్మించి నా జీవిత కార్యాన్ని పూర్తిచేసిన పిదప,
నేను ఉత్తరాయణ పుణ్యకాలంలో నా దేహాన్ని త్యజిస్తే,
ఉత్తరదిశగా నడిచే సూర్య భగవానుడు నాకు స్వర్గానికి మార్గాన్ని చూపిస్తాడు" అని అన్నారు.
"మాతా..!
నేడు హస్తినాపురంలో యుధిష్ఠిర పట్టాభిషేకం జరిగింది.
హస్తిన పురంలో ధర్మస్థాపన జరిగింది.
నేడు నా జీవిత కార్యం పరిపూర్ణం అయ్యింది మాతా..!" అని తన తల్లి గంగా దేవికి చెప్తూ ఉంటాడు.
దానికి గంగా దేవి
"నీకు నమ్మకం ఉందా..!
నిజంగానే దుర్యోధనుడు తన పదవి కాంక్షను త్యజించాడు అంటావా..!" అని ప్రశ్నిస్తుంది.
అప్పుడు భీష్ముడు...
"కానీ, మాతా యుధిష్ఠిరుడు సింహాసనాన్ని అధిష్టించిన పిదప,
అతని సోదరులతో కలిసి తమని తాము రక్షించుకొగలరు.
అందుచేతనే నేటితో నా కార్యం పూర్తయింది మాతా..!" అని అంటాడు.
"ఒక్క కార్యం పూర్తయితే, మనిషి జీవిత కార్యం ఎలా పూర్తవుతుంది భీష్మ..!
మనిషి అన్ని బంధాలను త్యజిస్తేనే జీవిత కార్యం పూర్తవుతుంది." అని గంగా దేవి చెప్తుంది.
"కానీ, మాతా...
నాకు ఎటువంటి బంధాలు లేవు.
(ఆజన్మ బ్రహ్మచారి కదా..!)
నేను కేవలం నా కర్తవ్యం నిర్వర్తించాను" అని అంటాడు భీష్ముడు
"కర్తవ్యమ్ కూడా బంధమే కదా పుత్రా..!
ఆ బంధం నుండి విముక్తి పొందేవరకూ, నీవు ముక్తుడవు కాలేవు" అని గంగా దేవి అంటుంది.
"అలా అనకండి మాతా...!
జీవిత పర్యంతం ధర్మానికి కట్టుబడి ఉన్నా కూడా నేను ముక్తిని పొందలేనా ..!
మాతా నేను ముక్తి పొందే మార్గం ఏది?" అంటూ భీష్ముడు ప్రశ్నిస్తాడు.
దానికి బదులుగా గంగా దేవి..
"దానికి మార్గం నేను చెప్పలేను.
అతి త్వరలో ఒకరు వస్తారు.
వారే నీకు వాస్తవిక ధర్మాన్ని తెలియజేస్తారు..!
కేవలం నీవే కాదు పుత్ర..!
సమస్త లోకం ధర్మ జ్ఞానాన్ని పొందుతాయి
ఆ జ్ఞానాన్ని నీవు పొందినప్పుడు నీకు ముక్తి లభిస్తుంది పుత్రా..!" అంటూ సెలవిస్తుంది.
ఆ వచ్చే ఒకరు
సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం ఆ శ్రీ కృష్ణ భగవానుడే
"పరిత్రాణాయ – సాధూనాం –
వినాశాయ – చ – దుష్కృతాం –
ధర్మసంస్థాపనార్థాయ –
సంభవామి – యుగే – యుగే"
"సాధువులకు ముక్తిని ఇచ్చేందుకు,
పాపకర్మాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు,
ధర్మాన్ని రక్షించి, దాన్ని స్థాపించడానికి ”
కుళ్ళు, కుతంత్రాలు, సంఘర్షణలు, కోపక్రోధాలు లాంటి మలినాలతో నిండిన కొన్ని హృదయాలను ప్రేమనే సుభ్రతతో కడగడానికి ఈ మహా భారత కావ్యంలో ఆ వసుదేవ సుతుడు శ్రీ కృష్ణ భగవానుని రంగ ప్రవేశానికి సర్వం సిద్దమైంది.
శ్రీ కృష్ణుని రాకతో ఈ మహా భారతం అనే అద్భుత కావ్యం ఎలాంటి కొత్త పుంతలు తొక్కబోతుంది.?
యుధిష్ఠిరుడుతో పరిపాలన చేయించే బాధ్యతను శ్రీ కృష్ణుడు తీసుకుంటాడా ?
దుర్యోధనుడు, శకుని లాంటి దుష్ట శక్తులను ఎలా అడ్డుకుంటాడు ?
మిత్ర ధర్మం కోసం ధర్మాన్నే త్యజించిన కర్ణుడి పరిస్థితి ఏమిటి ?
లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.
"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.
తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 48"
అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.
అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.
నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
రచన: సత్య పవన్ ✍️✍️✍️