శ్రీ కృష్ణ మహా భారతం - 46"
శ్రీ కృష్ణ మహా భారతం - 46"
"శ్రీ కృష్ణ మహా భారతం - 45" కి
కొనసాగింపు...
"శ్రీ కృష్ణ మహా భారతం - 46"
తండ్రి దృతరాష్ట్రడి మీద కోపంతో, ఆవేశంగా నేరుగా కర్ణుడి మందిరానికి వస్తాడు దుర్యోధనుడు.
బయటే నిల్చుని ఒక సేవకుడిని పంపి, అతని మందిరంలోకి రావడానికి అనుమతి కోరతాడు దృతరాష్ట్రడు.
కర్ణుడు తన మందిరంలో యుద్ద ప్రణాళికలు అభ్యసించడంలో నిమగ్నమై ఉండగా...
ఆ సేవకుడు వచ్చి,
*మీ అనుమతి కోసం దుర్యోధనుల వారు బయట వేచి చూస్తున్నారు " అని చెప్తాడు.
అసలే ప్రాణానికి ప్రాణమైన దుర్యోధనుడు రావడంతో కర్ణుడు
"నా మిత్రుడు వచ్చాడా ...!
ఎంత సమయం అయ్యింది" అంటూ అతన్ని ఆనందంతో, ఒకింత ఆశ్చర్యంతో తానే స్వయంగా ఆహ్వానించడానికి వెళ్లి, దుర్యోధనుడినీ లోపలికి తీసుకువస్తాడు.
వచ్చీ రావడంతోనే,
కర్ణుడు..
"మిత్రమా..!
మీకు నా మందిరంలోకి ఎప్పుడైనా రావొచ్చు, ఎప్పుడైనా వెళ్లొచ్చు..!
అలాంటిది మీరు నా అనుమతి కోరి, ఇందులోకి రావాలనుకోవడం ఏమిటి ?
ఇదంతా మీరు పెట్టిన భిక్ష..!" అని అంటాడు.
దానికి దుర్యోధనుడు...
"లేదు మిత్రమా...!
నువ్వొక రాజ్యానికి రాజువి..
అంగ రాజ్య సామ్రాట్ వి..
ఇప్పుడు నీకన్నా నా స్థాయి చాలా తక్కువ..!" అని దుర్యోధనుడు కోపంగా మాట్లాడతాడు.
"అదేంటి మిత్రమా...!
అలా మాట్లాడతారు...
చక్రం కూడా రథానికి ఉంటేనే అది యుద్ధంలో పాల్గొంటూ దాని విలువ పెంచుకుంటుంది.
అదే చక్రం కుమ్మరి వద్ద ఉంటే, కేవలం అది మట్టి పాత్రలు చేసుకోవడానికి మాత్రమే పని చేస్తుంది.
నా జీవితం కూడా అంతే...
ఇదంతా మీరు ప్రసాదించిందే...!
నా జీవితానికి విలువ ఏర్పడింది మీ యొక్క ఉపకారం తోనే" అని అంటాడు.
"ఇవన్నీ కాదు కానీ,
నువ్వు నాకోసం ఏమీ చేయగలవు..!" అని దుర్యోధనుడు అడుగుతాడు
దానికి కర్ణుడు...
"నీకోసం నా అంగ రాజ్యాన్ని ఇచ్చేస్తాను " అని బదులు ఇస్తాడు
"అది నీ స్వార్జితం కాదు..
నా కోసం ఇంకేదైనా ఇవ్వగలవా ?" అని దుర్యోధనుడు అడుగుతాడు.
కాసేపు ఆలోచించిన కర్ణుడు...
"నీ కోసం నా ప్రాణాలు ఇవ్వగలను" అని అంటాడు
"యోధుడి ప్రాణాలకు పెద్దగా విలువ లేదు మిత్రమా ?
నాకోసం నువ్వు ఏమీ చేయగలవు..!" అని దుర్యోధనుడు మరొక్క సారి అడుగుతాడు.
అప్పుడు కర్ణుడు కాసేపు ఆలోచించి...
"మీరు నా స్నేహాన్ని పరీక్షించాలని అనుకుంటున్నారా మిత్రమా ?" అని అంటాడు.
"అవునూ...!
నేను నా చుట్టూ ఉన్న వాళ్లందరినీ నమ్మలేక పోతున్నాను
ఎందుకంటే, సాక్షాత్తు నా పితృ దేవులే నన్ను హస్తినకు రాజుని చేయడానికి అంగీకారం తెలపడం లేదు.
నా తండ్రి నన్ను త్యజించాడు.
అందుకే, నా పక్కన ఉన్న వాళ్ళలో నా వాళ్ళు ఎవరో, నా వాళ్ళు కానివారు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను." అని దుర్యోధనుడు అంటూనే
"మిత్రమా..!
నాకోసం ధర్మాన్ని విడవగలవా..!" అని షరతు పెడతాడు
దానికి కర్ణుడు...
"మిత్రమా..!
నీకోసం నా తల్లిదండ్రులనే త్యజించి వచ్చిన వాడిని, నీకోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే
కానీ, ధర్మాన్ని వదులుకోవడం అంటే.."అంటూ సందేహంగా చెప్తూ...
"ధర్మాన్ని వదులుకున్న వారు ఎవరూ బాగుపడలేదు" అంటూ తన అంతరంగం చెప్తాడు.
దానికి దుర్యోధనుడు
"నీ అంతరంగం ఏమిటో నాకు అర్థమైంది మిత్రమా..!
ఇక నేను వెళ్తాను" అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు దుర్యోధనుడు.
అప్పుడు కర్ణుడు దుర్యోధనుడినీ
"మిత్రమా..!" అంటూ వెనక్కు పిలిచి
ధర్మాన్ని వదులుకోవడం కొంచెం కష్టమే..!
కానీ, ఆరోజు నన్ను నువ్వు అంగ రాజుగా ప్రకటించిన రోజున నీకు ప్రమాణం చేశాను నువ్వు ఎప్పుడు ఏది అడిగినా లేదనకుండా ఇస్తాను అని" దాని ప్రకారం చెప్తున్నాను...
"నీ కోసం ధర్మాన్ని వదులుకోవడానికి నేను సిద్ధమే..!" అని మాటిస్తాడు.
(కర్ణుడు చేసిన తప్పులలో అతి పెద్ద తప్పు ఇదే,
కర్ణుడు మంచి వాడు అయినప్పటికీ, దుర్యోధనుడు లాంటి ఒక చెడ్డవాడిగా మిత్రునిగా ఉంటూ, అతడితో మిత్ర ధర్మాన్ని పాటించాలి అనుకోవడం)
ఇంకా కర్ణుడు...
"మనం హస్తిన పురి పై యుద్ధం ప్రకటించవచ్చు రాకుమారా..!
యుద్ధంలో పాండవులను మనం పరాజితులం చేయగలం..!
ఏ నిర్ణయం తీసుకున్నారు మీరు ?" అని దుర్యోధనుడిని అడుగుతాడు
"ఇప్పటికే నేను నిర్ణయం తీసేసుకున్నాను మిత్రమా !" అని దుర్యోధనుడు కర్ణుడితో చెప్తాడు.
*********
ధృతరాష్ట్రడు యుధిష్ఠిరుడు మందిరానికి వస్తాడు.
అప్పుడు అతని వద్ద తన సోదరులు ఎవరూ ఉండరు.
అర్జునుడు, సహదేవుడు ధనుర్భాణ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అప్పుడే సహదేవుడు మనసుకి యుధిష్ఠిరునికి ఏదో కీడు శంకించబోతున్నట్టు అనిపిస్తుందని అర్జునుడికి చెప్తాడు.
వెంటనే ఇద్దరూ అక్కడి నుండి యుధిష్ఠిరుడు ఉన్న మందిరానికి బయలుదేరతారు.
ఇక యుధిష్ఠిరుడు మందిరానికి వచ్చిన దృతరాష్ట్రడు...
"పుత్రా..!
దుర్యోధనుడికి రాజ్యాధికారం దక్కదన్న కోపంతో హస్తిన పై తిరుగుబాటు చెయ్యాలని చూస్తున్నాడు.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్ ..!" అని అడుగుతాడు
"అప్పుడు మీరు కూడా యుద్దానికి సైన్యాన్ని సిద్దం చేయండి మహారాజా...!" అని చాలా తెలివిగా బదులు ఇస్తాడు యుధిష్ఠిరుడు.
దానికి దుర్యోధనుడు...
"యుద్దానికి సైన్యాన్ని సిద్దం చేస్తే, ఆ యుద్ధం చేసేది ఎవరో కాదు గంగా పుత్రులు...
వారు యుద్ధం చేస్తే, వారి చేతిలో సాక్షాత్తు పరుశరాముల అంతటి వాడే ఓటమి చవి చూసాడు.
చూస్తూ చూస్తూ నా పుత్రులను వారి చేతిలో అగ్నికి ఆహుతి చేయమంటావా...!
"ఈ కస్టమ్ పగవాడికి కూడా రాకూడదు...
నేనేం ఏం పాపం చేశాను పుత్రా..!
నేను బ్రతికుండగానే, నా పుత్రులు మరణించడం అనేది,
బ్రతికుండగానే కాదు, మరణించిన పిదప కూడా నా తీరని శోకాన్ని మిగుల్చుతుంది." అంటూ బాధపడతాడు దృతరాష్ట్రడు.
ధృతరాష్ట్రడి బాధను అర్థం చేసుకున్న యుధిష్ఠిరుడు...
"ఇప్పుడు నేనేం చెయ్యాలో ఆదేశించండి పెద తండ్రి..!" అని అంటాడు
అప్పుడు దృతరాష్ట్రడు ఆ మాటకు ఆనంద పడతూ...
యుధిష్ఠిరుడునీ దగ్గరకి తీసుకుని
"ఆదేశించడమా..!
నాకు ఆదేశించే అర్హత లేదు ఇప్పుడు...
కేవలం ఆశ మాత్రమే ఉంది.
అది ఏంటంటే,
నిన్ను సామ్రాట్ గా ప్రకటించడం నా ధర్మం..!
నా ఆశను నెరవేర్చి, నన్ను సంతోష పెట్టడం నీ ధర్మం..!
నిన్ను నేను సామ్రాట్ గా ప్రకటించిన పిదప,
నీ అంతట నువ్వే మహారాజు సింహాసనాన్ని త్యజించి, అది దుర్యోధనుడికి త్యాగం చెయ్యాలి..!
అలా అయితే నా ధర్మం నిలబడుతుంది. నీ ధర్మం నిలబడుతుంది. ఇది చేయగలవా పుత్రా..!
బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో పుత్రా..!" అని ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడను కోరతాడు.
సరిగ్గా అప్పుడే అక్కడికి అర్జునుడు, సహదేవుడు వస్తారు.
అది గమనించిన దృతరాష్ట్రడు..
"ఓహ్...
ఇక్కడికి ఇప్పుడు అర్జునుడు, సహదేవుడు కూడా వచ్చినట్టు ఉన్నారే,
యుధిష్ఠరా..!
నువ్వు వారి సలహాలు కూడా తీసుకుని, నీ నిర్ణయం ఏమిటో నాకు చెప్పు..!" అని వెళ్ళిపోతూ ఉంటే,
"ఇందులో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఏముంది మహారాజా..!
మీ ప్రతి నిర్ణయం మా జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠిరుడికు ఆదేశమే..!
అతనికే కాదు మా మిగిలిన సొదరులందరకీ అది ఆదేశమే..!" అని అర్జునుడు దృతరాష్ట్రనితో అంటూ...
"కానీ నాకొక సందేశం మహారాజా...!
వర్ష ఋతువు ఆరంభంలో మొట్టమొదట రాజుల చేలల్లో నాగలి దున్నతారు. దీనిని శీతల యజ్ఞం అంటారు. దాని తాత్పర్యము ఇప్పటికీ నాకు అర్ధం కాలేదు పెద్ద తండ్రి."
అని అర్జునుడు దృతరాష్ట్రనుని అడుగుతాడు
దానికి దృతరాష్ట్రడు...
"శాస్త్ర చర్చకు ఇది సమయం కాదు, అయిన దీనికి విపులంగా నేను నీకు సమాధానం ఇస్తాను.
నాగలి దున్నేటప్పుడు రైతుకి కొన్ని అమాయక జీవులు నశిస్తాయి. అతడికి వాటి హత్యా దోషం అంటుతుంది.
ఈ రకంగా రాజు శీతల యజ్ఞం చేసి, ఆ దోషాన్ని తన పై వేసుకుంటాడు. ఇలా ప్రతి రాజు మరణించిన పిదప కొద్ది సేపే కావొచ్చు ఆ నరకాన్ని అనుభవిస్తాడు పుత్రా...!" అని బదులు ఇస్తాడు
"నరకవాసం అనుభవించే అంతటి కార్యం రాజు చేయడం ఎందుకు ?" అని అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు.
దానికి దృతరాష్ట్రడు...
"నరక వాస భయంతో రైతులు వ్యవసాయం చేయకపోతే, సమస్త లోకం ఆకలితో ఉండిపోతుంది. వాస్తవానికి రాజు కర్తవ్యమ్ అది" అంటూ బదులు ఇస్తాడు దృతరాష్ట్రడు.
"రాజు మరొక వ్యక్తి చేత శీతల యజ్ఞం చేయించి, తాను నరక వాసం నుండి విముక్తి పొందవచ్చు కదా..!
ఈ కర్మ సూత్రాలు పరివర్తనం చేయలేమా?" అని అర్జునుడు మరొక ప్రశ్న సందిస్తాడు.
దాంతో దృతరాష్ట్రడు ఒక్కసారిగా నిర్ఘాంత పోతాడు.
(యుధిష్ఠిరుడతో దృతరాష్ట్రడు రాజ్య అధికారం భిక్షాగా ఆశించినప్పుడు అన్న మాటలకు ఇవి అర్జునుడు సంధించిన అస్త్రాలు అని మనకు అర్థమవుతుంది.)
ఇక తేరుకున్న దృతరాష్ట్రడు...
"యుధిష్ఠరా..!
రేపు ప్రాతః కాలంలో నీకు హస్తినా పుర పట్టాభిషేకం జరుగుతుంది." అని అర్జునుడి ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దృతరాష్ట్రడు.
*************
ఇక యుధిష్ఠిరుడి పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. గాంధారి అన్నింటినీ దగ్గరుండి పరీక్షిస్తూ ఉంటుంది.
రాజు ధరించే వస్త్రాలను పరీక్షించే బాధ్యత మాత్రం కుంతీ కి అప్పజెప్పుతుంది.
దానికి కుంతీ నిరాకరిస్తూ...
"మహారాణి స్థానంలో మీరు మాత్రమే వీటిని పరీక్షించాలి కదా అక్కా .!" అని అడుగుతుంది
దానికి గాంధారి...
"నా కళ్ళకు గంతలు ఉన్నాయి. పైగా యుధిష్ఠిరుడు నీ పుత్రుడు. కాబట్టి అతడు ధరించే వస్త్రాలను నువ్వు పరిశీలించడమే ఉత్తమం." అని కొంచెం నిరాశగా సమాధానం ఇస్తుంది.
గాంధారి నిరాశను గమనించిన కుంతీ...
"అక్కా ..!
మీకు పాండు కుమారులు విజయం సాధించడం దుఖాన్ని కలిగిస్తుందా?" అని ప్రశ్నిస్తుంది.
దానికి గాంధారి...
"నా మనసులో అలాంటి దురుద్దేశం ఏం లేదు కుంతీ..!
కేవలం నా పుత్రులు యుద్ధంలో ఓడిపోయారన్న బాధే నా మనసును విచ్ఛిన్నం చేస్తూ కలిచి వేస్తుంది." అని బధులిస్తుంది.
"మీరు తలుచుకుంటే,
ఇప్పుడే మీరు దుర్యోధనుడినీ మహారాజుగా ప్రకటించవచ్చు.
నాకు అందులో ఏం అభ్యంతరం లేదు" అని కుంతీ అంటుంది.
"ఛ... ఛ...
నాకు అలాంటి ఆశ లేదు కుంతీ...
యుధిష్ఠిరుడు అన్ని విధాలా ఈ రాజ్యానికి రాజయ్యే అర్హతను కలిగి ఉన్నాడు. కేవలం పుత్ర సంతోషం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకొనరాధు.
మనం దుఃఖంతో ఒకటి అయ్యాం.
ఇప్పుడు నీకు సుఖ పడే అవకాశం లభించింది.
దాన్ని ఆస్వాదించు..." అంటూ బదులు ఇస్తుంది.
************
ఇక రాజ్య సభలో యుధిష్ఠిరుడుకి దృతరాష్ట్రడు, భీష్ముడు, విదురుడు, కుంతీ అందరి సమక్షంలో గురువు కృపాచార్యుడు పట్టాభిషేకం జరిపించి,
సింహాసనం పై ఆశిన్నుడును చేసే సమయంలో అక్కడికి దుర్యోధనుడు తన సోదరులను, కర్ణుడిని వెంట పెట్టుకుని వస్తాడు.
మహాభారతం అనే ఈ మహాకావ్యంలో కర్త, కర్మ, క్రియ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు ప్రవేశం ఇక్కడ నుండే మొదలుకాబోతుంది.
యుధిష్ఠిరుడు కి పట్టాభిషేకం జరుగుతుందా ?
నిండు సభలో దుర్యోధనుడు తిరుగుబాటు చేస్తాడా ?
ఎవరిది పైచేయి ?
ధృతరాష్ట్రడి ప్రణాళిక ఏమిటి ?
లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.
"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.
తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 46"
అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.
అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.
నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
రచన: సత్య పవన్ ✍️✍️✍️