🌹క్రౌంచద్వీపం 🌹
🌹క్రౌంచద్వీపం 🌹
🌹 క్రౌంచద్వీపం 🌹
రచన :- అంజనీగాయత్రి.
ఒకానొకప్పుడు క్రౌంచద్వీపం లో అనేక పక్షులు వలస వచ్చి ఒక వృక్షంపై ఉండేవి. ఆ పక్షులకు క్రౌంచ పక్షులు అని పేరు స్థిరపడిపోయింది.
ఆవృక్షం కూడా ఒక కన్య . శాపవసాత్తు వృక్షంగా మారిపోయింది . ఎన్నో పక్షులకు నీడనిస్తోంది. మారిష అనే అప్సరస గంధర్వ శాపం వలన వృక్షజాతికన్యగా మారింది.
మారిష చాలా అందగత్తె . ఆమె ఎప్పుడు కలలు కంటూ, అందమైన రాజకుమారుడు తనకోసం వెన్నెలరేయినాడు రెక్కల గుర్రంపై వస్తాడని, తన చేయందుకుంటాడని ఎదురుచూస్తుంది.
ఆమె కలలు కంటూ ఎదురుచూసే రాజకుమారుడు ఒక రోజు ఆమెకి ఎదురుపడతాడు. అతడిని చూసామే ఆశ్చర్యపోతూ , తన కలలో వచ్చే రాజకుమారుడు తన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆమెకి వింతే కదా ?
" మీ పేరు ఏమిటీ?" అంటూ ప్రశ్నించింది ఆశగా,
" చంద్రకాంత్" అని ముక్తసరిగా సమాధానమిచ్చి అక్కడనుండి మాయమయ్యాడు. ఆ క్షణం నుండి అతని కోసం వెతుకుతూనే ఉంది.
ప్రభులోచనుడు అనే గంధర్వుడు మారిషని చూసి ఇష్టపడి వెంట పడుతూ ఉంటాడు. తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వేధిస్తూ ఉంటే ఆమె, " తాను చంద్రకాంత్ ను ప్రేమిస్తున్నానని , అతడినే పెళ్లి చేసుకుంటానని , తనమీద ఆశ వదులుకోమని, " అతడికి ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పింది.
ఆ మాట వినగానే అతడికి కోపం తారస్థాయికి చేరుకుంది . "ఎంతోమంది ఆడవాళ్లు తనకోసం, తన ప్రేమ కోసం పాకులాడుతారని, నీవు మాత్రం నన్ను, నా ప్రేమను లెక్క చేయడం లేదని , ఆక్రోషపడుతూ, నీవు వృక్ష కన్యవై క్రౌంచద్వీపం లో పడి ఉండు, అలాగే నువ్వు ప్రేమించే ప్రియుడు చంద్రకాంత్ కూడా క్రౌంచ పక్షి అయిపోవునుగాక " అంటూ శపించి వెళ్ళిపోబోయాడు. గంధర్వ శాపానికి తిరుగుఉండదు కదా? అతని శాపానికి మిక్కిలి బాధగా అతని కాళ్లు పట్టుకుని, శాపవిమోచనం గురించి అడిగింది.
నువ్వు ప్రేమించే నీ ప్రియుడు ఎప్పుడైతే వలస పక్షిగా వచ్చి నిన్ను తాకుతూ, నీ నీడలో విశ్రమిస్తాడో అప్పుడే నీకు శాపవిమోచనం కలిగి కన్యగా మారతావు. నిన్ను తాకిన ఆ క్షణంలో అతడికి శాపవిమోచనం కలుగుతుంది. మానవరూపం ధరిస్తాడు. ఆ సమయం వచ్చే వరకు నువ్వు వృక్షకన్యగానే పడి ఉంటావు అని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఎన్నో పక్షులు వచ్చి వెళుతున్నాయి గాని , మారిష మాత్రం వృక్ష కన్యగానే ఉంది . ఒకసారి జంబుద్వీపం నుండి పక్షులు వలస వచ్చి క్రౌంచద్వీపంలో చెట్లపై ఆవాసం ఉంటున్నాయి.
ఒకరోజు ఒక రాబందు చెట్టుపై ఉన్నపక్షి పిల్లలను తినడానికి చెట్టు చుట్టూ తిరగడం ప్రారంభించింది. పక్షులన్నీ బెంబేలెత్తి అరవడం ప్రారంభించాయి.
ఆ చుట్టుపక్కల ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్ద క్రౌంచపక్షి ఎగురుకుంటూ వచ్చి , రాబందుని తరిమి తరిమి కొట్టింది. రాబందుతో యుద్ధం చేసినంత పని చేసింది. క్రౌంచపక్షి ధాటికి తట్టుకోలేక రాబందు పారిపోయింది.
క్రౌంచపక్షి అలసిపోయి సేద తీరదామని ఆ చెట్టు పై వాలింది . ఆ పక్షి తాకిన మరుక్షణం ఆ చెట్టు మారిష అనే అందమైన అప్సరసగా మారింది. చెట్టుగా ఉన్నప్పుడు ఆమెను తాకిన మరుక్షణం ఆ క్రౌంచపక్షి కూడా చంద్రకాంత్ అనే రాజకుమారుడుగా మారి ఇరువురు నిజరూపాలు చూసుకుని , మురిసిపోయారు.
అప్పుడు అసలు విషయం చెప్పింది మారిష ఇలా " నా మూలంగానే నువ్వు కూడా శాపానికి గురి అయ్యావు , నేను నిన్ను ప్రేమించిన కారణంగా , ప్రభులోచనుడనే గంధర్వుడు శాపం మూలంగా మనిద్దరం రూపాలు మారాము , ఇప్పుడు నువ్వు నన్ను తాకిన క్షణం మన నిజరూపాలు మనకి వచ్చాయి , ఇంత కాలం వేచి చూసిన నా ప్రేమని స్వీకరించి నా చేయి అందుకుంటావని , ఆశిస్తున్నాను , " అని చెప్పి తలదించుకుంది ఆమె.
మారిష మాటలు విన్న చంద్రకాంత్, చిరునవ్వు మోముతో ఆమె చేయి అందుకున్నాడు . ఆమె కలలుగన్న రాజకుమారుడు ఆమె చేయి అందుకోవడం ఆమెకు రెక్కల గుర్రం ఎక్కినంత ఆనందంగా ఉంది . అందగత్తైన మారిషని కూడా అతడు ఎంతో ఇష్టంగా చూసుకున్నాడు.
🌹🌹😊🌹😊🌹.