భయ్యా! పానీ పూరీ
భయ్యా! పానీ పూరీ
లోగ్ ఆయేగా క్యా? మున్నా పూరీల్ని సంచీలోంచి బకెట్లో వేస్తూ అడిగాడు.
శివరాజ్ ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల క్రితం ఒక పానీపూరీ బండి దగ్గర ఉన్న చాలా మందికి కరోనా వ్యాపించినట్లు ఒక వార్త వచ్చింది. ఆరోజు నుంచి అతణ్ణి చాలా మంది శత్రువుగానూ, మరికొంత మంది జాలిగానూ చూడ్డం జరుగుతోంది.
లాక్డౌన్ సమయంలో ఆదాయం లేదు. అంతో ఇంతో పానీపూరీ బండి మీద వచ్చే ఆదాయంతో రోజులు గడిచేవి.
తనతోపాటు తన వీధిలోనే ఉండే మున్నా కూడా ఆదాయాన్ని కోల్పోయాడు.
భగవాన్ కరే సబ్ కా భల్లాయీ అంటూ శివరాజ్ అగరుబత్తీలు వెలిగించి దణ్ణం పెట్టుకున్నాడు.
రోజూ వంద మంది పైగా వచ్చేవాళ్ళు. స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలే ఎక్కువ. భయ్యా! టీకా లగావ్, ప్యాజ్ ఔర్ డాలో ఇలా చెప్తూ ఉండే కస్టమర్లతో ఎప్పుడూ బిజీగా ఉండేది.
లాక్డౌన్ సడలించాక ఇదే మొదటిరోజు బండి పెట్టడం. ఓ నలుగురు వచ్చి పార్సిల్ తీసుకుని వెళ్లారు.
బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కలిపిన మిశ్రమం వృథా కాకుండా ఇంట్లో రోటీతో తినడానికి కవర్లో పెట్టుకుని బండి లోపల పెట్టేసి ఇద్దరూ ఇళ్లకు బయలుదేరారు.
ఇలా ఎన్నాళ్ళు నడుస్తుందో అని శివరాజ్ మనసులో అనుకుంటూ ఉండగా, భయ్యా!మన గల్లీలో మస్తు మందికి నౌకరీ పోయిందంట. పైసలు లేవని కొందరు వద్దంటుంటే, పిల్లల దగ్గరికి రావొద్దని ఇంకొంత మందిని వొద్దని చెప్పుకుంటా ఉన్నరు అన్నాడు మున్నా.
దిక్కుమాలిన రోగం, మందిని ముంచనీకే వొచ్చింది అనుకుంటూ శివరాజ్ అస్తమిస్తున్న సూర్యుని వైపు చూసాడు.
మరో రోజు.. కొన్ని వార్తలతో.. శవాల చిత్రాలతో...ఆక్సిజన్ సిలిండర్ల చప్పుళ్లతో ఒరిగిపోయింది.